Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలోని మిన్నియాపోలిస్లో మే 25న జరిగిన నల్ల జాతీయుడు జార్జిఫ్లాయిడ్ హత్యతో నివురు గప్పిన నిప్పులా ఉన్న తెల్ల జాత్యహంకారం, నల్లవారి పట్ల వివక్ష ఒక్కసారిగా ప్రపంచానికి వెల్లడైంది. ఒక గొప్ప ప్రజాస్వామ్యంగా కీర్తించబడే అమెరికా డొల్లతనం బయటపడింది. ఐ కాంట్ బ్రీత్, నో జస్టిస్ నో పీస్, బ్లాక్ లైవ్స్ మాటర్ అంటూ సమానత్వ వాదుల ప్రదర్శనలతో అమెరికా అతలాకుతలం అయింది. అమెరికన్ ప్రెసిడెంట్ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికి ఒక సంఘటన క్రియాశీలం కావడం ప్రాధాన్యత గలిగిన అంశమే.
ఇటువంటి సందర్భాలు ప్రపంచ చరిత్రలో అరుదుగా వచ్చినప్పటికీ అసంభవం కావు. అలాగే అవి యాదచ్ఛికమూ కావు. అనేక సంవత్సరాల నుంచీ ఆర్ధిక అసమానత్వం పట్లా, అన్యాయం పట్లా అణచివేత పట్లా పోగు పడిన అసంతప్తి కొన్ని సంఘటనలతో ట్రిగ్గర్ కావడం, కొత్త పరిణామాలకు, సమాజం లో ఒక మేరకు అభ్యుదయకర మార్పులకు దారి తీయడం జరుగుతుంది. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే పరిణా మాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారితీయడం.
ట్యునీషియాలో మహ్మద్ బౌజీ అనే పండ్ల వ్యాపారి, పోలీసు వారి లంచగొండితనానికి హింసకు తట్టుకోలేక డిసెంబర్ 2010లో పార్లమెంటు ముందు ఆత్మాహుతి చేసుకున్న ఘటనతో అరబ్ దేశాలన్నీ ప్రజా ప్రదర్శనలతో అట్టుడికి పోయాయి. టునీషియా నియంత పారిపోయాడు. ప్రపంచం ఉలిక్కిపడింది. ఈజిప్టు రగలడం మొదలయింది. 12 లక్షల మంది ప్రజలు కైరోలోకి వచ్చారు. 18 రోజుల తర్వాత నియంత పలాయనం చిత్తగించాడు. యెమన్ అధ్యక్షుడు 32 యేండ్ల సలేV్ా నాకు మళ్ళీ పదవి వద్దన్నాడు. జోర్డాన్ రాజు సమీర్ ప్రభుత్వాన్ని రద్దు చేసాడు. కొద్దీ గొప్పో ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. అణగారిన జీవితాల్లో కొంత మార్పు చోటుచేసుకుంది. మొదటిసారిగా అరబ్ దేశాల యువత చైతన్యయుతంగా ఈ నిరసనలలో పాల్గొంది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి ఆధునిక పరిజ్ఞానం ఈ ఆందోళనలకు విస్తుతంగా ఉపయోగ పడింది.
ఇలా వుంటాయి కొన్ని సంఘటనల పరిణామాలు. అటువంటిదే అమెరికాలో జరిగిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ సంఘటన కూడా. దీన్ని కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ గానే భావించాలి. దొంగనోటు మారుస్తున్నాడనే ఒక చిన్న అభియోగం పైనజార్జి ఫ్లాయిడ్ను అరెస్టు చేయడం, హత్య చేయడం మాత్రమే సంఘటనలకు కారణం కాదు. అంతకుముందే అక్కడి నల్లజాతి వారు, రంగుల వారిలో పోగుపడ్డ అసంతప్తిని కూడా ఈ ఆందోళనలకు కారణంగా చూడాలి.
అక్కడి నల్లవారిలో పెరిగిన నిరుద్యోగిత, ఆర్థిక వెనుకబాటు తనం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలో తెల్లవారి కంటే నల్లవారు రెండు రెట్లు నిరుద్యోగులుగా వుంటారు. మన దేశంలో ఇంటి పేర్లను బట్టి కులాన్ని అంచనా వేసినట్టే, అక్కడ కూడా పేర్లను బట్టి జాతిని అంచనా వేసే పద్ధతి ఉన్నదట. దీనితో ఉద్యోగ దరఖాస్తులు ఫిల్టర్ అవుతాయి. ఫైర్ చేసిన ఉద్యోగుల్లో తిరిగి అవసరమైన వారిని వెనక్కు పిలవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ పేర్లు ఒక అంశంగా మారతాయట. దీనితో నల్లవారిలో 50శాతం మంది మాత్రమే ఎంచుకోబడతారు. దీనితో తెల్లవారిలో నిరుద్యోగం 3.8 శాతం వుంటే నల్లవారిలో 7.5 శాతం ఉన్నది. అంటే రెట్టింపు. ఇక వారి చదువులూ అంతంత మాత్రమే. 2018 లెక్కల ప్రకారం కాలేజ్ గ్రాడ్యుయేట్స్ తెల్లవారిలో 42.1శాతం ఉంటే నల్లవారిలో కేవలం 22.8శాతం మాత్రమే. పేదరికం తెల్లవారిలో 8.8శాతం వుంటే నల్లవారిలో 21.8శాతం అంటే దాదాపు మూడు రెట్లు. కుటుంబ సంపద విషయంలో తెల్లవారికి నల్లవారికీ తేడా దాదాపు 10 రెట్లు వుంటుంది. స్వంత ఇళ్ళు కలిగిన వారి విషయమూ అలాగే వుంది. తెల్ల వారిలో 71.1శాతం స్వంత ఇల్లు వుంటే నల్లవారిలో కేవలం 41.2శాతం మందికి మాత్రమే స్వంత ఇళ్ళున్నాయి. చివరికి పసిపిల్లల మరణాల రేటు విషయంలో కూడా ఈ వ్యత్యాసం కనబడుతుంది. తెల్లవారిలో ప్రతీ 1000 మంది బిడ్డలకు 4.9 మంది చనిపోతుంటే నల్లవారిలో ఆ సంఖ్య 11.4 గా వున్నది. ఇలా ఆర్ధికానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ నల్లవారు తీసికట్టుగానే వున్నారు అమెరికా వంటి ధనిక దేశంలో.
ఇక రెండవది కరోనా ఎఫెక్ట్. కరోనా లాక్డౌన్ కారణంగా ఎందరికో అమెరికాలో ఉద్యోగాలు పోయాయి. నల్లవారిలో అది ఇంకా ఎక్కువగా ఉన్నది. దీనితో దరిద్రం మరింత తీవ్రతరమైంది. మరోవైపు కరోనా మరణాల రేటు కూడా నల్లవారిలో ఎక్కువగానే వుండటం పరిస్థితిని మరింత దిగజార్చింది.
ఇక మూడవది తరతరాల బానిసత్వం నాటి అవమానాలు. బానిసత్వం 1865లో రద్దయినా ఆధిపత్య భావజాలం కొనసాగుతూనే వుంది. ఇది నల్లవారిలో ఆనాటి అవమానకర చీకటి జీవితాన్ని నిరంతరం గుర్తు చేస్తూ గాయం మానకుండా వుంచింది. నల్లవారిలో అసహనాన్ని మరింత పెంచి పోషిస్తోంది. జార్జి ఫ్లాయిడ్ మెడ మీద కాలు పెట్టిన పోలీసు జేబులో చేతులు తీయకుండా పది మందీ చూస్తుండగా అహంకారం ప్రదర్శిస్తూ హత్య చేయడం నల్లజాతి వారి అభిజాత్యాన్ని తీవ్రంగా గాయపరిచింది.
ఇక చివరిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన. ఫ్లాయిడ్ పట్ల సానుభూతి చూపకుండా సమస్యను పరిష్కరించకుండా రేసిస్టు ప్రకటనలను చేయడం, మీరు లూటీ చేస్తే నేను షూట్ చేస్తా అనడం, భద్రతా దళాలను ఉసిగొల్పుతా అనడం వంటివన్నీ అగ్నికి ఆజ్యం పోసాయి. ఐ కాంట్ బ్రీత్, నో జస్టిస్ నో పీస్, బ్లాక్ లైవ్స్ మాటర్ అంటూ అమెరికాలోని 140కి పైగా నగరాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రధానంగా శాంతియుతంగా జరిగినా కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల లూటీలకు పాల్పడ్డారు కొందరు. ఈ ఆందోళనలు నల్లజాతి వారికి మాత్రమే పరిమితం కాలేదు. దీనిలో అనేక మంది తెల్లజాతివారూ, అక్కడ నివసిస్తున్న భారతీయుల వంటి ఇతర దేశాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. సెలబ్రిటీలు, పెద్ద కంపెనీల సి.ఇ.వోలు కూడా దీనిలో పాలుపంచుకున్నారు. చివరకు ప్రదర్శన కారులు వైట్హౌస్ను కూడా చుట్టుముట్టి దేశాధ్యక్షుడు బంక్లోకి వెళ్ళవలసిన పరిస్థితిని కల్పించడం విశేషం.
ఈ ఆందోళనలు అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు ఖండాలు దాటింది. యూరప్లో అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో మరొక గుర్తించదగిన అంశమేమంటే అలనాటి పాశవికమైన బానిసత్వానికి చిహ్నాలుగా వున్న కొన్ని విగ్రహాలను నాశనం చేయడం. అమెరికాలో కొన్ని చోట్ల అమెరికాను కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహాల తలలను ధ్వంసం చేసారు. యూకేలోని బ్రిస్టల్లో ఎడ్వర్డ్కాల్టన్ అనే బానిస వ్యాపారి విగ్రహాన్ని తాళ్ళతో కట్టి నదిలోకి ఈడ్చారు.
ఈ ఆందోళన పర్యవసానం ఏం కాబోతోంది. ఈ ఆందోళన లో అంతర్గతంగా ఆర్థికాంశం ఉన్నప్పటికీ ఆర్దికాంశాలకు సంబంధించిన డిమాండ్లు లేవు. ఈ ఉద్యమంలో ప్రధానం గా వినబడిన నినాదాలు ఐ కాంట్ బ్రీత్, నో జస్టిస్ నో పీస్, బ్లాక్ లైవ్స్ మాటర్ అంటే సమానత్వాన్ని, సమన్యాయాన్ని అందిం చాలనీ, హింసను ఆపమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. చివరికి వెస్టిండీస్ పరుగుల యంత్రం క్రిస్గేల్ సైతం అయిందేదో అయింది మేము ప్రతీకారం కోరటం లేదు. కేవలం న్యాయాన్నీ, సమానత్వాన్నీ, గౌరవాన్ని మాత్రమే కోరుతున్నాం అన్నారు. అందుచేత మనం విప్లకరమైన పెను మార్పులు ఆశించలేం. కానీ తప్పనిసరిగా కొంత సాంస్కతిక పరమైన మార్పులను సాధించ గలుగుతుంది. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా అణగారు తున్న జాతుల వారికి ఇది ఒక చైతన్య దీపికగా ఉండబో తుందన్నది యదార్ధం. ప్రపంచంలోని ఆధిపత్య భావజాలానికి ఒక ఎదురుదెబ్బ ఈ ఉద్యమం అని అభ్యుదయ కాముకులు భావించ వచ్చు. ఏది ఏమైనా జార్జి ఫ్లాయిడ్ విషాదాన్ని ఈ ప్రపంచం అంత త్వరగా మరిచిపోదు.
ఈ జాత్యహంకార ధోరణి భారతదేశంలోనూ కనబడతుంది. బయటి నుండి వచ్చిన ఆఫ్రికన్స్ పట్ల మన ప్రవర్తన కొన్నిసార్లు చాలా అభ్యంతర కరంగా వుంటుంది. వారందరినీ డ్రగ్స్ అమ్మేవారు గానూ, దొంగలు గానూ చూడడం కద్దు. వారిపై దాడి చేసి చంపిన ఘటనలూ వున్నాయి. వెస్టిండియన్ క్రికెటర్ సామీని 'కాలూ' అని భారతీయులు అన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతీ సంవత్సరం అనేక మంది నల్ల జాతీయులు మన వద్ద చదువులు బాగుంటాయని, వైద్య సౌకర్యాలు బాగుంటాయని వస్తుంటారు. వీరినే కాదు భారతదేశంలో కుల వ్యవస్థ కారణంగా కొంతమంది మనుష్యులు మరికొంత మందిని తక్కువగా చూసే తత్వం వున్నది. ఇటువంటి అసంబద్ధ అహంకారాల విషయంలో మనల్ని మనం సంస్కరించుకోవాల్సి వుంది. అప్పుడు మాత్రమే మనం నిజమైన మానవులుగా మన గలుగుతాం.
జి. గోపాల కృష్ణ
9290146187