Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు మనసులో లేదు పన్నెండేళ్ల క్షేత్రకి!
అప్పటికే ఉదయం అమ్మతో నాన్నతో చాలాసార్లు తిట్లు తిని ఉండడంతో మళ్ళీ వాళ్ళతో ఆ పని చేయించుకోదలచుకోలేదు తను.
కానీ ఎప్పుడూ ఎదుటి మనిషికి సహాయం చెయ్యడంలో ముందుండే అమ్మానాన్నా ఈసారి మాత్రం ఎందుకంత క్రూరంగా మారిపోయారు?! అసలు పక్కింటి ప్రవీణ్ అంకుల్ వచ్చినట్టే తనకు ఉదయం తెలిసింది! అనుకోకుండా మేడ మీదకు వెళ్లి కిటికీ తలుపు తెరుచుకుని ఉండటంతో తను లోపలికి తొంగిచూస్తే ప్రవీణ్ అంకుల్ పాపం ఒక్కడే దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని పడుకోవడం చూసి ఎంతగానో బాధపడిపోయి తల్లి అమల దగ్గరకు వెళ్లి విషయం చెబితే, ''ఆంటీని వాళ్ళమ్మ గారింట్లో దిగబెట్టడానికి ఢిల్లీ వెళ్ళి ఏ తెల్లవారు ఝామునో రైల్లో వచ్చి ఉంటారు అంకుల్. రాత్రంతా నిద్ర ఉండి ఉండదు. అందుకని అలసిపోయి ఉంటారు. మనం ఇప్పుడు లేపితే బావుండదు.'' అని కటువుగా చెప్పేసింది తను.
తండ్రి ప్రమోద్ని అడిగినా అదే జవాబు! ఆ తర్వాత రెండు మూడు సార్లు తను అడిగినా కూడా వాళ్ల ఓపిక కోపంగా మారింది తప్ప ప్రయోజనం లేకపోయింది. వాళ్లు వెళ్లి ఏమాత్రం సహాయం చెయ్యకపోగా తల్లి గట్టిగా చెప్పేసింది... ''నువ్వు కానీ అంకుల్ దగ్గరకు వెళ్ళావో వీపు చీరేస్తాను'' నాన్న కూడా వంత పాడటంతో కళ్లలో నీళ్లు తిరుగుతుండగా నిస్సహాయురాలై పోయింది క్షేత్ర.
ఎంతసేపని తను మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో ఉండిపోగలదు? తనను ఎంతో బాగా ఆడించే ప్రవీణ్ అంకుల్ వారం తర్వాత ఊరెళ్లి వస్తే వీళ్లేమో కలవనివ్వడం లేదు. పైగా అంకుల్కి ఒంట్లో బావున్నట్టు కూడా లేదు. ప్రాణం విలవిలలాడి పోతోంది క్షేత్రకు.
ఆ రాత్రి యాంత్రికంగా భోజనం చేసి త్వరగా నిద్రపోయింది క్షేత్ర.
మరుసటి రోజు ఉదయం టిఫిన్ పూర్తైన కాసేపటికి ''అంకుల్కి బ్రెడ్, పాలూ ఇచ్చి వద్దామా?'' తల్లి ప్రశ్నకు ఆశ్చర్యపోతూ ఎగిరి గంతేసినంత పని చేసింది క్షేత్ర.
ఇద్దరూ కలిసి పైకి వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రమోద్ ఉన్నాడు. మంచం మీద కూర్చుని నీరసంగా చూస్తున్నాడు ప్రవీణ్. ''అంకుల్, బావున్నారా?'' ఆప్యాయంగా అడిగింది క్షేత్ర.
''ఫైన్రా చిట్టీ! నువ్వు బావున్నావా?'' నవ్వుతూ అడిగాడు ప్రవీణ్.
''రిపోర్ట్స్ వచ్చేసాయి కదా! ఇంక భయం లేదులెండి'' నవ్వింది అమల.
''అవునండీ! నేను కంగారు పడి మిమ్మల్ని కూడా కంగారు పెట్టేసాను. ఏమీ అనుకోకండి. మీకు శ్రమ కూడా కలిగిస్తున్నాను.'' నవ్వాడు ప్రవీణ్.
ప్రవీణ్ పాలలో ముంచుకుని బ్రెడ్ తినేవరకూ ఉండి తిరిగి ఇంటికొచ్చారు ముగ్గురూ.
''ఇప్పుడు వెళ్లొచ్చా అంకుల్ దగ్గరకు?!'' తండ్రిని అడిగింది క్షేత్ర.
''తనకు ఇంకా కొంచెం జ్వరంగా ఉంది. కొంచెం ఆగి వెళుదువు గానిలే.'' చెప్పాడు ప్రమోద్.
''ఏమయిందసలు? రిపోర్ట్స్ బాగానే ఉన్నాయన్నారు కదా?'' అయోమయాన్ని మాయం చేసుకునే ప్రయత్నం చేసింది క్షేత్ర.
''రాత్రి నువ్వు పడుకున్నాక రిపోర్ట్స్ వచ్చాయి. ప్రవీణ్ అంకుల్ రెండు రోజుల క్రితం ఢిల్లీలో రైలు ఎక్కిన తర్వాతి రోజు ఒంట్లో బావుండక పోవడంతో కరోనా ఏమో అని భయపడి మాకు ఫోన్ చేసారు. అతను వచ్చేసరికి మేము ఇక్కడ ప్రభుత్వ అధికారులకి తెలియచేసాం. రైల్వే స్టేషన్నుంచి నేరుగా అంకుల్ని టెస్టులకి తీసుకెళ్ళి ఒక పూటంతా అబ్జర్వేషన్లో ఉంచి, ఫర్వాలేదనుకున్నాక ఇంట్లో దిగబెట్టి సాయంత్రం రిపోర్ట్స్ వచ్చేవరకూ ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ కరోనా అని తేలితే పద్నాలుగు రోజులూ మేడ పైనే ఉండిపోవాలని చెప్పి వెళ్ళారు. రిపోర్ట్స్లో అంకుల్కి కరోనా లేదని తేలడంతో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.'' వివరంగా చెప్పింది అమల.
తల్లి మాటలకు పున్నమిజాబిల్లిలా వికసించింది క్షేత్ర ముఖం!
- రాజేష్ యాళ్ల, 9700467675