Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వైజ్ఞానిక గని అల్బర్ట్ ఐన్స్టైన్''
ప్రశ్నలే ఆలోచనా ప్రయోగాలు అన్న గొప్ప సైంటిస్ట్ అల్బర్ట్ ఐన్స్టైన్. శాస్త్ర విజ్ఞానం నడిచే దారిని ప్రభావితం చేసిన ఐన్స్టైన్ జీవితంలోని ముఖ్యాంశాలు సచిత్రాలతో యా పుస్తకం రాసారు గోపాలం. ఐన్స్టైన్ కృషి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. టైమ్స్ పత్రిక ఆయనను ఇరవయ్యవ శతాబ్ధపు వ్యక్తిగా ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో సరికొత్త దారులను చూపించాడు. నోబెల్ బహుమతి సాధించాడు. ''ఎవరైనా ఎప్పుడూ ఒక తప్పు కూడా చేయలేదు అంటే కొత్త పని చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించ లేదు అని అర్థం'' అన్నాడు ఐన్స్టైన్.
1879 మార్చి 14వ తేది జర్మనీలోని ఉల్మ్ నగరంలో ఐన్స్టైన్ పుట్టాడు. అతని జీవితంలో గణితం, భౌతికశాస్త్రం, ఎదో తెల్సుకోవాలి - సాధించాలి - యుద్ధ వ్యతిరేకత లాంటి అంశాలను చదువుతుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించే పరిశోధనలు 1905 నాటికి ఐన్స్టైన్ పూర్తి చేసాడు. చలన సూత్రాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతం అన్నవి సైన్స్కు న్యూటన్ అందించిన గొప్ప బహుమానాలు. శక్తి అన్ని పదార్ధాల మీద చూపించే ప్రభావాన్ని చలన సూత్రాలు వివరిస్తాయి. పదార్థంలోని మాస్ అనే ద్రవ్య రాసిని బట్టి ఈ గురుత్వాకర్షణ మారుతుంది. స్థలం కొలతలు - కాంతి, కాలం, కాంతి వేగాన్ని కొలవడం లాంటి అంశాలు సున్నితంగా యా గ్రంథంలో రాసారు. 1913లో అల్బర్ట్ ఐన్స్టైన్ తన సిద్ధాంతాన్ని ప్రతి పాదించిన డాక్టోరల్ థీసిస్ను మార్సెల్కు అంకితం చేసాడు. సాపేక్ష సిద్ధాంతం యొక్క భౌతిక శాస్త్ర అంశాలను పరిశీలిస్తే అదే సిద్ధాంతాన్ని గణిత పరంగా పరిశోధించాడు. 20 శతాబ్ధి భౌతిక శాస్త్రంలో ఐన్స్టైన్ ప్రతిపాదించిన అంశాలు చాలా గొప్పవి అని అందరూ అంగీకరించారు. వాటి ఆధారంగా వచ్చిన సిద్ధాంతాలు, పరిశోధనలు ఈ నాటికీ ప్రపంచాన్ని మారుస్తున్నాయి. ముందుకు నడిపిస్తున్నాయి. ఐన్స్టైన్ పై ప్రభావం చూపిన న్యూటన్ (1642 - 1727) మాక్స్వెల్ (1831 - 1879) మాక్స్ ఫ్లాంక్ (1858 - 1947)ల గురించి ఈ పుస్తకంలో రాసారు. విద్యార్ధులు మేధావులుగా ఎదిగేందుకు ఇది చక్కటి కరదీపిక - భౌతిక శాస్త్ర విజ్ఞానాభిలాషులకు చక్కటి మార్గదర్శి యా పుస్తకం.
ఆల్బర్ట్ ఐన్స్టీన్, రచయిత : కె.బి. గోపాలం, పేజీలు : 88, వెల: 80 రూ||, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్ భవన్ - ప్లాట్ -21/1, అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండం వద్ద హైదరాబాద్-20, ఫోన్ : 9490099378/373/350
- తంగిరాల చక్రవర్తి, 9393804472
అక్షర సుగంధాల బంధం
ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, భావతీవ్రతలు, ఉద్విగత, ఆవేశం లాంటివేవీ లేకుండా, శిల్పం, అభివ్యక్తి వంటివేవీ కాకుండా కేవలం అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు సాదాసీదా పదగుంభన రహితంగా 'అక్షర సుగంధం'ను పంచింది దేవల పల్లి సునంద.
ఈ కవయిత్రి రాసిన 63 కవితల్లో కేవలం ఆమె అనుభవించిన, అనుభూతించిన సన్నివేశాలు, సంఘటనలు మాత్రమే సూటిగా సుస్పష్టంగా వెలువరించింది కవయిత్రి. సునంద నోస్టాలజీని పాటించి కవితా రచన ప్రారం భించింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునే తొలుత గురుపూజ చేసింది. నేటి వైద్యుల పరిస్థితులను వింగడిస్తూ ''రోగాలతో వ్యాపారం/ భయాందోళనతో వ్యాపారం/ అవయవాలతో వ్యాపారం / చివరకు శవాలతో కూడా వ్యాపారం/'' అంటూ రోగాలశ్రీను భయపెట్టే డబ్బులు గుంజే విధానాలను ఎండగట్టింది. జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమ. అందుకే ''ఈ చలి భయపెడుతుంది / ఈ చలిని ఆపే / వెచ్చటి దుప్పటి నీవై వస్తావా'' అని ఆశ పడుతుంది. పురుషుడి మనస్తత్వాన్ని సున్ని తంగా చెబుతుందిలా ''ప్రియు డిగా ఉన్నప్పుడు నువ్వే నా లోకం/ నీవులేని నేను లేనంటాడు/ పతిగా మారగానే పట్టించుకోవడమే మానేస్తాడు'' అంటూ చురకలు వేస్తుంది. వస్తు వైవిద్యం విశాలంగా ఉన్న ఈ కవితా సంపుటితో సరళ సుందరంగా, అక్షర సుగంధా లను విమజిమ్ముతుంది.
'అక్షర సుగంధం' (కవితా సంపుటి) రచయిత : దేవలపల్లి సునంద, పేజీలు : 104, వెల : రూ.100/-, ప్రతులకు : హైదరాబాద్ పాతనగర కవుల కవన వేదిక, నవోదయ, నవచేతన పుస్తక కేంద్రాలలో. సెల్ : 9182178653
- మంజుల సూర్య, 9704022244