Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం వచ్చిందంటే వాన జల్లులు, పిల్లకాలవలతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. దీనితో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ గుంపులు గుంపులుగా రంగురంగుల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తాయి. భూమి మీది జీవరాశుల్లో సంఖ్యాపరంగా అత్యధికంగా వున్న జీవులు కీటకాలయితే వాటిలో అత్యంత అందమైనవి సీతాకోక చిలుకలు. ఎంత చక్కని పూదోటకైనా సీతాకోక చిలుకలు లేక పోతే అందమే రాదు. అందుకే ఎగిరే పూవులు అంటారు సీతాకోకచిలుకలను.
ఈ సీతాకోకచిలుకలు తమ రంగురంగుల రెక్కలతో మనల్ని మురిపించడమే కాదు పర్యావరణ పరంగా కూడా అత్యంత ప్రయోజన కారులు. నిజానికి వీటి పర్యావరణ సేవలను మనం పరిగణలోనికి తీసుకుంటే సంవత్సరానికి కొన్ని బిలియన్ డాలర్లుగా వుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా 28000 జాతులకు పైగా సీతాకోకచిలుకలు వున్నాయి. వానిలో ఎక్కువభాగం అంటే 80% వరకూ వృక్షవైవిధ్యం ఎక్కువగా వున్న సమసీతోష్ణ, ఉష్ణ మండల ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనికి కారణం సీతాకోక చిలుకలు జీవ పరిణామంలో పుష్పించే మొక్కలతో పాటే 200 మిలియన్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాయి.
సీతాకోకచిలుకలూ - వృక్ష వైవిధ్యం
ఒక ప్రాంతంలోని సీతాకోకచిలుక జాతులను బట్టి ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలను అంచనా వేయవచ్చు. ఎక్కువ రకాల జాతుల సీతాకోకచిలుకలు తిరుగాడుతుంటే ఆ ప్రాంతంలో ఎక్కువ రకాల జాతుల మొక్కలు కూడా ఉన్నట్టు అంచనాకు రావచ్చు. సీతాకోకచిలుకలకు ఉన్న ఒక ప్రత్యేకత వల్ల ఇది సాధ్యం అవుతుంది. సీతాకోకచిలుకలు అన్ని రకాల మొక్కలపై గుడ్లు పెట్టవు ఒక జాతి సీతాకోకచిలుక తన లార్వాలకు తగిన ఆహారం ఇవ్వగల మొక్కలపైనే గుడ్లు పెడతాయి. సీతాకోకచిలుక జాతిని బట్టి మొక్కజాతి మారుతుంది. వీటిని లార్వల్ ఫుడ్ ప్లాంట్స్ అంటారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో అతిపెద్దదైన బ్లూమర్మోన్ అనే సీతాకోకచిలుక రూటేసికుటుంబానికి చెందిన నిమ్మజాతి, వెలగ, మారేడు మొక్కలున్న చోట ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రకాశవంతమైన ఎరుపు నలుపు రంగుల్లో మెరిసిపోయే క్రింసన్ రోజ్, కామన్ రోజ్ అనే సీతాకోక చిలుకలు ఒక ప్రాంతంలో తిరుగాడుతుంటే ఆ ప్రాతంలో అరిస్టలోకియేసి కుటుంబానికి చెందిన నల్ల ఈశ్వరి, గాడిద గడపాకు వంటి తీగె జాతులున్నాయని గుర్తించవచ్చు. నెమలి ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే కామన్ బాండెడ్ పీకాక్ పట్టణాల్లో కనపడదు ఎందుకంటే అక్కడ వాటికవసరమైన బిల్లుడు మొక్కలు వుండవు కాబట్టి. అలాగే కామన్జే , టైల్డ్ జే వంటి సీతాకోక చిలుకలు అడవుల్లో కనపడవు ఎందుకంటే అశోక సంపెంగ వంటి మొక్కలు అడవిలో వుండవు కాబట్టి. ఇలా ఒక ప్రాంతంలోని వృక్షవైవిధ్యాన్ని అక్కడ ఉన్న సీతాకోక చిలుక జాతుల ద్వారా గుర్తించ వచ్చన్న మాట. బాగుంది కదూ.
సీతాకోకచిలుకల ఫలదీకరణ సేవలు
సీతాకోకచిలుకలు ఒక పూవు నుండి మరొక పూవు మీదకు ఎగురుతూ పూవులు ఫలించి కాయలుగా మారడానికి దోహదం చేస్తాయి. పుష్పాలలోని పరాగ రేణువులు పుష్పం యొక్క అండ కోశాన్ని చేరకుండా ఫలదీకరణం జరుగదు. అనేక పుష్పించే మొక్కలు పరాగసంపర్కం అనే ఈ ప్రక్రియ కోసం గాలిపైన, కీటకాలపైన ఆధార పడతాయి. పరాగసంపర్కం విజయ వంతంగా జరిపే కీటకాల్లో మొదటి స్థానం తేనెటీగలదైతే రెండవ స్థానం మన సీతాకోకచిలుకలదే. ఈ పని అడవుల్లో మనుషులు చేయాలంటే ఎంత కష్టం ఎంత ఖర్చు ఆలోచించండి. ఒక వేళ సీతాకోక చిలుకలు గానీ అంతరించి పోతే అనేక మొక్కల్లో ఫలదీకరణ జరుగక కొన్ని వృక్షజాతులు అంతరించి పోయే ప్రమాదం కూడా వున్నది.
ఆహారగొలుసులో సీతాకోకచిలుక
సీతాకోకచిలుకలతో సంపద్వంతంగా ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలోని సాలీడ్లు, తొండలు, బల్లులు, పక్షుల వంటి మాంసా హారులకు విలువైన మాంసకృత్తులను సమకూరుస్తాయి. కొన్ని సీతాకోక చిలుకలు ప్రౌఢ దశలోనూ, లార్వా దశలోనూ వీటికి ఆహారంగా మారుతాయి. ఉదాహరణకు బ్రిటన్, ఐర్లండ్ లలో బ్లూటిట్స్ అనే పక్షులు ఏటా 50 బిలియన్ల సీతాకోకచిలుకల, మాత్స్ లకు సంబంధించిన గొంగళి పురుగులను తింటాయట. అంటే ఆహారపు గొలుసు నుండి సీతాకోకచిలుకలను తీసివేస్తే ఆమేరకు వాటిపై ఆధారపడిన ఇతర జీవులూ నశించిపోతాయన్నమాట.
సీతాకోకచిలుకలు పర్యావరణ సూచికలు
సీతాకోకచిలుకలు వాతావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులకు కూడా వేగంగా స్పందిస్తాయి. వాటి సంఖ్యలోని హెచ్చు తగ్గులను బట్టి ఆ ప్రాంతంలోని పర్యావరణ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ఇతరజీవరాశుల కంటే కీటకజాతులు 8 రెట్లు వేగంగా నశిస్తాయట. గత 10 సంవత్సరాల్లో సీతాకోకచిలుకలు 53% నశించిపోయాయట. అంటే పర్యావరణం ఎంత వేగంగా క్షీణిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు.
సీతాకోకచిలుకల వలస విచిత్రం
సీతోష్ణ స్థితిగతులకు అనుగుణంగా పక్షుల్లాగా సీతాకోకచిలుకలు కూడా వలస వెళతాయి. అత్యధిక దూరం వలసవెళ్ళే సీతాకోక చిలుకలుగా ఉత్తరఅమెరికా ఖండంలోని 'మోనార్క్' సీతాకోకచిలుకలు. ఉత్తరమెరికా ఖండం నుండి దక్షిణమెరికా పర్వత ప్రాంతానికి వెళ్ళి సీతాకాలం గడిపి తిరిగి అమెరికా ఖండానికి చేరతాయి. ఈ ప్రయాణం దాదాపు 4000 కిలోమీటర్లు వుంటుంది. ఇంత సున్నితమైన జీవి అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వలసలో మరొక విచిత్రం ఏమంటే ఈ వలస రిలే పద్దతిలో జరుగుతుంది. వలస వెళ్ళడం ప్రారంభంనుండి పూర్తయ్యేటప్పటికి 4 నుండి 5 తరాలు మారుతాయి. అయినా ఒక తరం మొదలు పెట్టిన ప్రయాణాన్ని తరువాతి తరాలు కొనసాగించి గమ్యాన్ని చేరతాయి. ఆశ్చర్యంగా లేదూ. ఈ ఆశ్చర్యం మనకే కాదు వీటికి మార్గదర్శనం చేసే శక్తులేవో అర్ధం కాక శాస్త్రవేత్తలూ పరిశోధిస్తున్నారు.
ఇలా సీతాకోకచిలుకలు మనసుకు ఆనందాన్నిస్తూ, పర్యావరణంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తూ, బట్టర్ఫ్లై పార్కుల ద్వారా టూరిజానికి ఆలంబన నిస్తూ, బట్టర్ఫ్లై ఫార్మింగ్ ద్వారా అనేక మందికి ఉపాది కల్పిస్తూ వున్న రంగుల అద్భుతాలను అంతరించి పోకుండా చూసుకోవడం మన విధి. కాదంటారా !
జి.గోపాలకృష్ణ
9290146187