Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కెరీర్పై డెవిడ్ వార్నర్ పునరాలోచన
-ఏదేని ఫార్మాట్కు వీడ్కోలు పలికే ఛాన్స్?
-బయో బబుల్లో కుటుంబానికి లేని చోటు
మెల్బోర్న్ : కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ క్రికెట్ మూడు నెలలుకు పైగా నిలిచిపోయింది. బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్ పున ప్రారంభం అవుతోంది. కరోనా తీసుకొచ్చిన ప్రమాదంతో ఎన్నో విధాలుగా రాజీపడి క్రికెట్ మైదానంలోకి ప్రవేశించింది. దీంతో క్రికెటర్లతో పాటు అభిమానులు సంతోషిస్తున్నారు. కరోనా సమయంలో క్రికెట్ సిరీస్లు బయో సెక్యూర్ బబుల్లోనే జరుగుతున్నాయి. ఈ పరిణామంతో క్రికెటర్లు నెలలుగా కుటుంబాలకు దూరం కావాల్సి వస్తోంది. ఒత్తిడితో కూడుకున్న అంతర్జాతీయ కెరీర్లో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. కానీ బయో సెక్యూర్ బబుల్ (బుడగ) వాతావరణంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ప్రవేశం లేదు. ఈ అంశం పలువురు క్రికెటర్లను వీడ్కోలు దిశగా తీసుకెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. వరుస సిరీస్లు ఆడాల్సిన నేపథ్యంలో నెలలుగా కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతో కష్టం. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ డెవిడ్ వార్నర్ అంటున్నాడు. కోవిడ్-19 తరుణంలో ఇంగ్లాండ్తో సిరీస్, ఐపీఎల్ 2020, భారత్తో సిరీస్లపై వాస్తవిక అంశాలను వార్నర్ స్పృశించాడు.
కుటుంబ బాధ్యత ఉంది : 'నాకు ముగ్గురు కూతుళ్లు, భార్య ఉన్నారు. వారికి నేను ఎంతో చేయాల్సి ఉంటుంది. నా క్రికెట్ కెరీర్లో వారిది సింహభాగం పాత్ర. మనం ఎప్పుడైనా కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెట్, ఇతర అవాంఛిత అంశాలతో కూడిన సమయంలో మన నిర్ణయాలను ఆచిచూచి తీసుకోవాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ ఇక్కడ (ఆస్ట్రేలియా) జరగటం లేదు. ఇప్పుడది వాయిదా వేయబడింది. భారత్లో టీ20 వరల్డ్కప్ సమయానికి నేను పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి నా పరిస్థితి ఏమిటీ, నా పిల్లలు ఏ స్కూల్లో చేరాలి వంటి విషయాలు నా కెరీర్ను ప్రభావితం చేయనున్నాయి. ఇది కేవలం క్రికెట్ ఎప్పుడు ఆడాలి, ఎంత క్రికెట్ ఆడాలనేది కాదు. నాకు సంబంధించి ఇది పెద్ద కుటుంబ నిర్ణయం. క్రికెట్ కోసం పర్యటనల్లో ఉంటాం. బయో సెక్యూర్ బబుల్తో కుటుంబాలకు అనుమతి ఉండదు. సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మనం వెళ్లినచోటకి కుటుంబాన్ని తీసుకెళ్లే విలాసం ఇక ఉండదు' అని డెవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు.
డెవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆగస్టులో ఇంగ్లాండ్తో సిరీస్, ఐపీఎల్13, భారత్తో సిరీస్కు డెవిడ్ వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితుల్లో మార్పులు కనిపించకపోతే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ విషయంలో లేదా ఏ ఫార్మాట్లో కొనసాగాలనే విషయంలో డెవిడ్ వార్నర్ కచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.