Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సంజు శాంసన్ కోచ్ బిజు జార్జ్
న్యూఢిల్లీ : ఐపీఎల్లో విధ్వంసక శతకాలు, దేశవాళీ క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్లకు కేరాఫ్ అడ్రస్ కేరళ యువ కెరటం సంజు శాంసన్. జింబాబ్వేతో టీ20లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సంజు శాంసన్ ప్రతిభకు తగ్గ అవకాశాలు లభించలేదు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు మళ్లీ జట్టులోకి వచ్చినా.. మైదానంలోకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చేందుకే పరిమితం అయ్యాడు. అవకాశం ఇవ్వకుండానే వెస్టిండీస్ సిరీస్కు జట్టు నుంచి తప్పించారు. సౌరభ్ గంగూలీ తర్వాత ఓ క్రికెటర్ ఎంపిక విషయం రాజకీయ అంశమైంది!. కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ విషయమై ట్వీట్టర్లో విమర్శలు చేశారు. సంజు శాంసన్ను తుది జట్టులోకి ఎందుకు ఎంపిక చేయరు? అని సెలక్షన్ కమిటీని ప్రశ్నించాడు. సాధారణ అభిమానులు సైతం సంజు శాంసన్కు అవకాశం ఇవ్వకుండా తప్పించటంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా సంజు శాంసన్కు రిషబ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరినీ తప్పించి కెఎల్ రాహల్ రేసులోకి వచ్చిన సంగతి సరేసరి!. సంజు శాంసన్ను కాదని రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలు లభించటంపై సంజు చిన్ననాటి కోచ్ బిజు జార్జ్ స్పందించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ' సంజు శాంసన్ సన్నిహితుడిగా నన్ను అడిగితే, అతడికి కచ్చితంగా మరిన్ని అవకాశాలు దక్కాల్సింది. టీమ్ ఇండియా ఆలోచన దృక్పథం ప్రకారం చూస్తే రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలు రావడానికి కారణం తొలుత అతడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్. రెండోది, జట్టు ప్రణాళికలు. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా.. లెఫ్ట్ ఆర్మ్ సీమర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాడని వారి భావన. ఇది నా అభిప్రాయం. నిర్ణయాధికారం జట్టు, కెప్టెన్, కోచ్లదే. ఏ ఆటగాడు జట్టుకు అవసరమో చీఫ్ సెలక్టర్ నిర్ణయిస్తాడు' అని బిజు జార్డ్ అన్నాడు. సంజు శాంసన్ 11 ఏండ్ల వయసులో సారు క్రికెట్ కోచ్ బిజు జార్జ్ వద్దకు వచ్చాడు. అప్పట్నుంచి, సంజు శాంసన్కు బిజు జార్జ్ క్రికెట్ పాఠాలు నేర్పుతూనే ఉన్నాడు. లాక్డౌన్లో కేరళ సీఎం ప్రత్యేక అనుమతితో బిజు జార్జ్, సంజు శాంసన్లు క్రికెట్ ట్రైనింగ్లో నిమగమయ్యారు.