Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పది రోజుల్లో నాలుగు సార్లు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు. వరుసగా రెండు సార్లు కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్గా తేలితేనే, యుఏఈ విమానం ఎక్కేందుకు అనుమతి. యుఏఈలో అడుగుపెట్టిన అనంతరం మరో రెండుసార్లు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే బయో సెక్యూర్ బబుల్లోకి స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి. ఐపీఎల్2020 నిర్వహణ ప్రణాళికల్లో బీసీసీఐ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
-ఐపీఎల్ క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు
-నెగెటివ్ వస్తేనే యుఏఈ విమానంలో ఎంట్రీ
-ఇండియన్ ప్రీమియర్ లీగ్కు బీసీసీఐ ప్రణాళికలు
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సర్వ సన్నద్ధం అవుతోంది. కరోనా వైరస్ ప్రమాదకర ఘంటికల్లో బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహణకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి సలహాలు సైతం తీసుకుంటోంది. ఐపీఎల్ తుది షెడ్యూల్, బయో సెక్యూర్ బబుల్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)లపై నిర్ణయం తీసుకునేందుకు ఆగస్టు 2న ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఇదివరకే షెడ్యూల్, నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు పంచుకున్న బీసీసీఐ..ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐపీఎల్ 2020 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. క్రికెటర్లకు కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల దగ్గర్నుంచి, ఇతర అన్ని అంశాల్లో శాస్త్రీయ జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తుంది.
నెగెటివ్ వస్తేనే.. ప్రవేశం : బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో వెస్టిండీస్తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను ఇంగ్లాండ్ విజయవంతంగా నిర్వహించింది. ఐర్లాండ్తో వన్డేలు, పాకిస్థాన్ టెస్టు సిరీస్లకు సైతం బయో బబుల్లో నిర్వహించనుంది. బుడగ సృష్టికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న చర్యలు, ఇతర సాంకేతిక అంశాల్లో సూచనలను బీసీసీఐ కోరుకుంటోంది. ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను యుఏఈకి తీసుకెళ్లనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుగానే దుబారుకు చేరుకోనుంది. అందుకు బీసీసీఐ కొన్ని నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక విమానం ఎక్కేందుకు ప్రతి ఆటగాడు వరుసగా రెండు సార్లు కోవిడ్ పరీక్షలో నెగెటివ్గా తేలాలి. లేదంటే ప్రత్యేక విమానంలో ప్రవేశం లేదు. ఇక యుఏఈకి చేరుకున్న తర్వాత క్వారంటైన్ సమయంలో మరో రెండు సార్లు కోవిడ్ రోగ నిర్థారణ పరీక్షల్లో నెగెటివ్గా తేలాలి. అప్పుడే బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తారు. లేదంటే స్వీయ ఐసోలేషన్లో ఉంచుతారు. ఈ మేరకు ప్రాంఛైజీలకు బీసీసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
దేశానికో ప్రత్యేక విమానం! : ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్రత్యేక విమానాల్లో క్రికెటర్లను యుఏఈకి తీసుకెళ్లేందుకు విమానయాన కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. భారత క్రికెటర్లతో కూడిన ప్రత్యేక విమానాలు దుబారుకి చేరుకోనున్నాయి. ఇదే సమయంలో ఐపీఎల్లో పాల్గొనాల్సిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లకు సైతం ఐపీఎల్ ప్రాంఛైజీలు ఉమ్మడిగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినా.. బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహణకు ప్రత్యేక విమానాలు తప్పనిసరి!. శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లను బిజినెస్ క్లాస్లో యుఏఈకి రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్ కారణంగా శ్రీలంక క్రికెటర్లు ఓ వారం ఆలస్యంగా యుఏఈకి రానున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు సెప్టెంబర్ తొలి వారంలో దుబారుకి చేరుకోనున్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు సైతం ఐపీఎల్లో ఆడేందుకు ఎదురుచూసు ్తన్నారు. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, క్రికెటర్లను యుఏఈకి చేర్చే ప్రణాళికపై కొంత సందిగ్థత కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రాంఛైజీలతో సంప్రదించి బీసీసీఐ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.