Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రంజీ సీజన్కు బీసీసీఐ ప్రణాళికలు
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభం కానేలేదు. దేశవాళీ సీజన్ ఆరంభం ఎప్పుడు అవుతుందనే విషయంలోనూ ఎవరికీ స్పష్టత లేదు. అయినా, 2020-21 దేశవాళీ సీజన్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధిక ప్రాధాన్యం ఇవ్వబోతుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. 2020-21 క్రికెట్ సీజన్ వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగే వీలుందని తెలుస్తోంది. ' దేశవాళీ క్రికెట్ పున ప్రారంభానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు దేశవాళీ సీజన్ను మొదలుపెట్టడం అసాధ్యం. మరోవైపు యుఏఈలో ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవాళీ షెడ్యూల్ రూపకల్పనకు పనిచేస్తున్నాం. నవంబర్లో దేశవాళీ సీజన్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశవాళీ సీజన్లో రంజీ ట్రోఫీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడున్న ఫార్మాట్లోనే నిర్వహిస్తామా? ఫార్మాట్లో మార్పులు చోటుచేసుకుంటాయా? అనేది తెలియదు. రంజీ ట్రోఫీకి ఎన్ని రోజుల షెడ్యూల్ అందుబాటులో ఉన్న విషయమూ తేలియదు. 2021 ఐపీఎల్ ఏప్రిల్-మేలోనే ఉంటే రంజీ ట్రోఫీ ఆరంభ, ముగింపు తేదిలపై స్పష్టత కోసం నిరీక్షించాల్సిందే' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
దేశవాళీ సీజన్లో అన్ని టోర్నీల్లో కలిపి మొత్తం 2036 మ్యాచులు నిర్వహించారు. దేశవాళీ సీజన్లో రంజీ ట్రోఫీకి అగ్రపీఠం ఇవ్వటంతో పాటు మహిళల క్రికెట్లో ప్రతి స్థాయిలో ఓ ముఖ్యమైన టోర్నీ ఉండేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది. రంజీ ట్రోఫీ సహా ఇతర టోర్నీల విషయంలో జోనల్ విధానం పాటించేందుకు అవకాశం ఉంది. జోన్ వారీగా ఒకే వేదికలో మ్యాచులు నిర్వహించటం సరైన విధానంగా భావిస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణ అనంతరం దేశవాళీ సీజన్ పున ప్రారంభంపై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు సమాచారం.