Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రికెటర్లకు కాంట్రాక్టు సొమ్ము ఇవ్వని బీసీసీఐ
ముంబయి : ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు గత పది నెలలుగా కాంట్రాక్టు క్రికెటర్లకు వేతనాలు ఇవ్వటం లేదు. 2019 అక్టోబర్లో నూతన కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. అప్పట్నుంచి 27 మంది స్టార్ క్రికెటర్లకు తొలి త్రైమాసిక బకాయిలు విడుదల చేయలేదు. బీసీసీఐ ఏ ప్లస్, ఏ, బి, సి విభాగాల్లో 27 మంది క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. రూ. 7 కోట్ల వార్షిక వేతనంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రాలు ఏ ప్లస్ విభాగంలో ఉన్నారు. ఏ, బి, సీ విభాగాల ఆటగాళ్లకు వరుసగా రూ.5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ.1 కోటి అందజేయాలి. వార్షిక కాంట్రాక్టు తొలి త్రైమాసిక బకాయిలకు తోడు మ్యాచ్ ఫీజులు సైతం క్రికెటర్లకు దక్కలేదు. రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20 మ్యాచులకు (డిసెంబర్ 2019 నుంచి) మ్యాచ్ ఫీజులు రావాల్సి ఉంది. టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వాల్సి ఉంది.
దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు సైతం ఆలస్యమైన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగానే మ్యాచ్ ఫీజుల్లో ఆలస్యమని బోర్డు వివరణ ఇచ్చినా.. గత పది నెలలుగా స్టార్ క్రికెటర్లకు తొలి త్రైమాసికం బకాయిలు సైతం విడుదల కాకపోవడానికి ఇతర కారణాలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. 2019 డిసెంబర్ నుంచి బీసీసీఐకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లేడు. గత నెల రోజులుగా సీఈవో, క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్లు లేరు. అడ్మినిస్ట్రేషన్లో కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఫీజులు, బకాయిల విడుదలలో ఎనలేని జాప్యం జరుగుతుందని తెలుస్తోంది.