Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టత
- హర్షం వ్యక్తం చేసిన మన క్రికెటర్లు
ముంబయి : ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన రద్దు. సీనియర్ సెలక్షన్ కమిటీ నియామకం లేదు. మహిళల క్రికెట్ వ్యవహరాలు చూసుకునే జనరల్ మేనేజర్ లేరు. 2021 వరల్డ్కప్ సన్నాహకంలో టీమ్ ఇండియా ఎప్పుడు మైదానంలోకి వస్తుందనే స్పష్టత కరువు. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని బిసీసీఐ.. మహిళల క్రికెట్పై చిన్నచూపు చూస్తోందనే విమర్శలు మొదలు. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్2020 యుఏఈలో నిర్వహిస్తున్నారు. బయో సెక్యూర్ బబుల్లో మహిళల ఐపీఎల్కు చోటు ఉంటుందా? అనే విషయంలోనా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సౌరవ్ గంగూలీ ఆదివారం మహిళా క్రికెటర్లకు తీపి కబురు చెప్పాడు. నాలుగు జట్లతో కూడిన మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీ (మహిళల ఐపీఎల్) కచ్చితంగా ఉంటుందని వెల్లడించాడు. ఐపీఎల్ నాకౌట్ దశ షెడ్యూల్లో మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నారు.
నవంబర్1-10న మహిళల ఐపీఎల్ : మహిళల ఐపీఎల్ షెడ్యూల్ను గంగూలీ ప్రకటించాడు. నవంబర్ 1-10 వరకు మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీ ఉంటుందని స్పష్టం చేశారు. 'మహిళల టీ20 చాలెంజర్ సిరీస్ నవంబర్1-10న జరిగే అవకాశం ఉంది. మహిళల ఐపీఎల్కు ముందు క్రికెటర్ల శిక్షణ శిబిరం నిర్వహిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెటర్ల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేయదలచుకోలేదు. అది మెన్స్, ఉమెన్స్ క్రికెట్కూ వర్తిస్తుంది. కోవిడ్-19 కారణంగా జాతీయ క్రికెట్ అకాడమి సైతం మూసివేశాం. భారత మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం ఉంటుంది, ఆ విషయం కచ్చితంగా చెప్పగలను' అని గంగూలీ పేర్కొన్నాడు. 2021 ఫిబ్రవరిలో మహిళల వన్డే వరల్డ్కప్ న్యూజిలాండ్లో జరుగనుంది.
మెగా ఈవెంట్కు ముందు మిథాలీరాజ్సేన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో వన్డే సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ బృందం ప్రణాళిక రచిస్తోంది.
మహిళల బిగ్బాష్తో ఢ : ఎట్టకేలకు భారత మహిళల క్రికెట్పై ఓ తీపికబురు వచ్చినా.. అది ప్రపంచ మహిళా క్రికెటర్లకు ఏమాత్రం రుచించటం లేదు. మహిళల బిగ్బాష్ లీగ్ అక్టోబర్ 17-నవంబర్ 29 వరకు జరుగనుంది. మహిళల ఐపీఎల్ నవంబర్ 1-10న జరుగనుంది. ప్రపంచ మహిళల క్రికెట్లో ప్రతిష్టాత్మక రెండు టీ20 లీగ్లు ఏకకాలంలో జరుగటంలో మహిళల క్రికెట్కే నష్టమే కానీ మేలు జరుగదని క్రికెటర్లు వాపోతున్నారు. గంగూలీ ప్రకటనతో భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్లు ట్వీట్టర్ వేదికగా సంతోషం వ్యక్తపరిచారు. ప్రపంచ మహిళా క్రికెట్ స్టార్స్ అలీసా హీలే, సుజీ బేట్స్, జెస్సీకా జొనాస్లు మహిళల ఐపీఎల్ షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఐపీఎల్కు ఇతర దేశాల క్రికెటర్లు, బిగ్బాష్ లీగ్కు భారత క్రికెటర్లు ఎంతో అవసరమని అలీసా హీలే అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతున్న మహిళల క్రికెట్కు ఇది మేలు చేయదని ట్వీట్ చేసింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం మహిళల ఐపీఎల్ మే నెలలో జరగాలి. కానీ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్2020 వాయిదా పడిన సంగతి తెలిసిందే. బిగ్బాష్ లీగ్ సమయంలో జరుగుతుండటంతో ఈ సీజన్లో మహిళల ఐపీఎల్లో అందరూ భారత క్రికెటర్లే కనువిందు చేయనున్నారు!.