Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీసీసీఐ నూతన విధానం ప్రకటన
ముంబయి : భారత క్రికెట్లో వయో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన విధానం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్లో ప్రధానంగా వయో పరిమితి టోర్నీల్లో ఎక్కువగా మోసాలు వెలుగు చూస్తున్నాయి. అవకాశాలు దక్కించుకునేందుకు పుట్టిన రోజు ధృవపత్రాల్లో అవకతవకలు చేస్తున్నారు. అండర్-13, అండర్-17, అండర్-19, అండర్-23 క్రికెట్ టోర్నీల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. గతంలో ఇటువంటి మోసాలకు కఠిన శిక్షలు విధించిన బీసీసీఐ.. భవిష్యత్లో అటువంటి అక్రమాలకు తావులేకుండా నూతన విధానం ప్రకటించింది. ఇప్పటికే ఇటువంటి మోసాలకు పాల్పడిన ఆటగాళ్లుతమంతట తాము బీసీసీఐకి తెలియజేస్తే ఎటువంటి శిక్ష లేకుండా అర్హత ఉన్న వయో గ్రూప్లో ఆడే అవకాశం కల్పిస్తారు. లేదంటే, రెండేండ్ల పాటు ఏ స్థాయి క్రికెట్లోనూ ఆడకుండా నిషేధం విధించనున్నారు. శాశ్విత నివాసం (దేశం) విషయంలో బోర్డును తప్పుదోవ పట్టించిన ఆటగాళ్ల విషయంలో ఈ వెసులుబాటు ఉండదు. ' వయో పరిమితి క్రికెట్లో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు బీసీసీఐ సమగ్ర విధానం రూపొందించింది. రానున్న దేశవాళీ సీజన్కు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మోసాలకు పాల్పడితే రెండేండ్ల నిషేధం విధిస్తాం' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ' క్రికెట్లో వయో మోసాలు తీవ్రమైన అంశం. ఈ మోసాలతో వయో పరిమితి క్రికెట్ ప్రతికూలతలు చవిచూస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆటగాళ్లు అందరూ బీసీసీఐ మార్గదర్శకాలను పాటించాలని కోరుతున్నాను' అని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.