Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సోషల్ వ్యతిరేకతతో మొబైల్ కంపెనీ యోచన
-ఐపీఎల్ ప్రాంఛైజీల్లో వివో గురించి చర్చ
-ఆసక్తిరేపుతున్న ఐపీఎల్ విదేశీ స్పాన్సర్షిప్స్
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఖాళీ స్టేడియాల్లో జరుగనుంది. బయో సెక్యూర్ బబుల్లో నాకౌట్ లేదా ఆఖరు దశ మ్యాచులకు 20 శాతం అభిమానులకు ప్రవేశం కల్పించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నా, ప్రాంఛైజీలకు ఆదాయం సంపాదించే టికెట్ల అమ్మకాలు ఈ సీజన్లో అదృశ్యం కానున్నాయి. టికెట్ల ఆదాయం కోల్పోనున్న ప్రాంఛైజీలకు నష్టపరిహారం ఇవ్వాలని లేదా సీజన్ ప్రాంఛైజీ ఫీజును తగ్గించాలని ఓ ఐపీఎల్ ప్రధాన ప్రాంఛైజీ బీసీసీఐని డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే ఐపీఎల్ ప్రాంఛైజీ ఇతర ప్రాంఛైజీల్లో ఆందోళనకు కారణమయ్యే వార్తను పంచుకుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో తన హక్కుల నుంచి వైదొలగనున్నదని సోమవారం ఇతర ప్రాంఛైజీలతో చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. పూర్తిగా కాకున్నా, కనీసం ఈ ఏడాది లీగ్కు వివో దూరం కానుందని సదరు ప్రాంఛైజీ చెప్పినట్టు తెలుస్తోంది.
నిష్క్రమణ అనివార్యం : జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య గొడవ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో భావోద్వేగాలు రేపింది. సరిహద్దు దేశంపై వాణిజ్య యుద్ధం చేయాలని సోషల్ మీడియా ఉద్యమం మొదలైంది. అనంతరం ప్రభుత్వం సైతం 59 చైనా యాప్లపై నిషేధం విధిస్తూ ఆ నినాదాలకు బరింత బలం చేకూర్చింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సైతం విదేశీ కంపెనీలతో బంధాన్ని తెంచుకోవాలనే వాదన మొదలైంది. ప్రజల అభీష్టం మేరకు విదేశీ కంపెనీల స్పాన్సర్షిప్లపై సమీక్ష చేస్తామని అప్పట్లో ఐపీఎల్ జీసీ తెలిపింది. కానీ అటువంటి సమావేశం జరుగలేదు. ఇటీవల ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు, స్టాండర్డ్ అపరేటివ్ ప్రోసీజర్స్ రూపకల్పన కోసం జరిగిన సమావేశంలో విదేశీ కంపెనీల స్పాన్సర్షిప్లు కొనసాగుతాయని తెలిపింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతివాద జాతీయవాదులు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. ఏకంగా ఐపీఎల్పైనే నిషేధం విధించాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఈ పరిణామాలు వివో నిష్క్రమణను అనివార్యం చేస్తున్నాయని తెలుస్తోంది.
ఇప్పుడు ఎవరోస్తారు? : కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా తప్పుకుంటే, వివో స్థానంలో ఎవరొస్తారనే ప్రశ్నకు బదులు దొరకటం కష్టమే. 2016లో పెప్సికో స్థానాన్ని భర్తీ చేస్తూ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది. ఐదేండ్ల కాలానికి రూ.2199 కోట్లతో భారీ బిడ్ దాఖలు చేసి హక్కులు పొందింది. బీసీసీఐకి ఏటా రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఇందులో 45 శాతం పన్ను రూపంలో ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయి. వివో-ఐపీఎల్ ఒప్పందం బలమైన రక్షణ కవచాలతో కూడుకున్నది. ఒప్పందాన్ని ఎవరు అతిక్రమించినా, న్యాయపరంగా భారీ నష్టం చవిచూడాల్సి ఉంటుంది. మార్కెట్ పరంగా వివోకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రాజకీయపరంగా బీసీసీఐ ఒత్తిడి ఎదుర్కొంటుంది. దీంతో లీగల్ దారిలో కాకుండా సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం దిశగా వివో, బీసీసీఐ అడుగులు వేసే దిశగా చర్చలు ఉండనున్నాయని తెలుస్తోంది. ' కనీసం ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించేందుకు వివో సిద్ధంగా ఉంది. బీసీసీఐ, వివో చర్చలపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వివోకు, బీసీసీఐకి సొంత సమస్యలు ఉన్నాయి. ఇరువురు ఓ నిర్ణయానికి వచ్చేందుకు చర్చలు జరుగనున్నాయి' అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పెప్పికో రూ.396 కోట్ల ఒప్పందం 2016లో ముగిసింది. వివో రూ.2199 కోట్లతో బీసీసీఐ లాభాన్ని 450 శాతం పెంచింది. ఇప్పుడు వివో తప్పుకుంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం ఎవరు ముందుకొస్తారనేది ప్రశ్నార్థకం. బీసీసీఐ కనీసం 50 శాతం తక్కువకు 13వ సీజన్ టైటిల్ హక్కులను ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్త 19న ఐపీఎల్ 2020 ఆరంభం కానుంది. కరోనా మహమ్మారితో మార్కెట్ అనిశ్చితితో పడింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్కు ఎవరైనా వస్తారా? చూడాలి.