Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత పేసర్ ఇషాంత్ శర్మ
న్యూఢిల్లీ : భారత క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ. రానున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా లంబో వంద టెస్టుల మైలురాయిని అందుకోనున్నాడు. కానీ ఇషాంత్ శర్మ కెరీర్లో 80 వన్డేలే ఆడాడు. చివరగా 2016 జనవరిలో 50 ఓవర్ల ఆటలో మెరిశాడు. వన్డే, టీ20లపై ఇషాంత్ శర్మ ఆశలు వదులుకోలేదు, అలాగని జట్టు ప్రణాళికల్లో లేడు. కానీ వరల్డ్ కప్ విజేత జట్టులో భాగస్వామి కావాలని ఉందని ఇషాంత్ శర్మ అన్నాడు. ' అవును, వరల్డ్కప్ గెలిచిన జట్టులో ఆడటాన్ని మిక్కిలి ప్రేమిస్తాను. వరల్డ్కప్ నెగ్గిన జట్టులో ఆడటం భిన్నమైన అనుభూతి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఆడుతున్నాం. టెస్టుల్లో అదీ ప్రపంచకప్ వంటిదే. కానీ వన్డే వరల్డ్కప్కు ఉండే ఆదరణ, మజా వేరు' అని ఇషాంత్ శర్మ అన్నాడు. దీప్దాస్ గుప్తా క్రికెట్బాజీ షోలో ఇషాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
గణాంకాలు లెక్కచేయను
' కెప్టెన్గా ఎం.ఎస్ ధోని ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. నా కెరీర్ 50-60 టెస్టుల తర్వాత సైతం నా స్థానంలో మరో పేసర్ కోసం చూస్తున్నామని నాకు చెప్పలేదు. నిజం చెప్పాలంటే 97 టెస్టులు ఆడినా.. ఇప్పటికీ సగటు, స్రయిక్రేట్ అర్థం కావు. ఈ గణాంకాల గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. నాకు అవి అర్ధం కానప్పుడు, నేనెందుకు బాధపడాలి? కెప్టెన్ చెప్పిన వ్యూహం ప్రకారం భారత్ తరఫున బౌలింగ్ చేస్తున్నాను. 20 ఓవర్లలో 40 పరుగుల్చి.. మిగతా పని స్పిన్నర్లకు వదిలేస్తున్నాను. నాకు అదే ప్రధానం. నా బౌలింగ్ సగటు 37 అనేది నాకు ముఖ్యం కాదు. అందుకే కెప్టెన్గా ధోని ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు' అని ఇషాంత్ అన్నాడు. 97 టెస్టుల్లో ఇషాంత్ శర్మ 297 వికెట్లు పడగొట్టాడు. సగటు 32.39. రెండేండ్ల క్రితం ఇషాంత్ శర్మ సగటు 36.55 (79 టెస్టుల్లో). గొప్ప ప్రదర్శనలతో ఇషాంత్ శర్మ సగటును మెరుగుపర్చుకున్నాడు.
చిన్న పిల్లాడిలా ఏడ్చాను
' 2013 అక్టోబర్లో మొహాలీలో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ మ్యాచ్లో ఫాల్క్నర్ నా ఓవర్లో 30 పరుగులు పిండుకుని ఆసీస్ను గెలిపించాడు. అప్పుడు నా జట్టును, దేశాన్ని మోసం చేశానని ఫీలయ్యాను. 2-3 వారాలు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎంతగానో ఏడ్చాను. నా గర్ల్ఫ్రెండ్కు ఫోన్ చేసి చిన్న పిల్లాడిలా ఏడ్చాను. ఆ మూడు వారాలు నాకు కాళరాత్రులే. భోజనం చేయటం మానేశాను. పెద్దగా నిద్రపట్టేది కాదు. టీవీ పెట్టగానే నా గురించి విమర్శలే. అది మరింత వేధనకు గురిచేసేది. నాలో మార్పునకు కారణమైన ఆ ఘటనను ఆశీర్వాదం అనుకుంటున్నా. మనమేంటో తెలసుకునేందుకు ఒక్కోసారి భారీ కుదుపు అవసరం. ఫాల్క్నర్ ఊచకోతతో నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. 2013 నుంచి అన్ని విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. నేను సరిగా రాణించకుంటే.. నా వద్దకు వచ్చి ఫర్వాలేదు, ఇలాంటి సహజమే అని చెప్పేవారు. ఇప్పుడు అటువంటి మాటలను వినిపించుకోవటం లేదు. బాధ్యత తీసుకోవటం నేర్చుకున్నాను. నేను తప్పు చేస్తే అది నేనే చేశానని బాధ్యత వహిస్తున్నాను. నీ పనులకు నీవు బాధ్యత వహించినప్పుడు ఆడిన ప్రతిమ్యాచ్లో జట్టును గెలిపించేందుకు ఆడతాం' అని ఇషాంత్ శర్మ అన్నాడు.