Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక హోటల్లో ఒక ప్రాంఛైజీయే
- బయో బుడగలోనే కుటుంబ సభ్యులు
- ఐపీఎల్ 2020 మార్గదర్శకాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రతిరోజు పతాకశీర్షిక అవుతోంది!. కరోనా మహమ్మారి సమయంలో యుఏఈలో జరుగనున్న ఐపీఎల్ క్రికెటింగ్ అంశాలపై కాకుండా, రాజకీయ కారణాలతో దుమారం రేపుతోంది. ఐపీఎల్లో విదేశీ స్పాన్సర్షిప్లు కొనసాగటంపై అతివాద జాతీయవాద గ్రూప్లు రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బయో సెక్యూర్ బబుల్ (బుడగ)పై ప్రాంఛైజీలకు బీసీసీఐ మరింత స్పష్టత ఇస్తోంది.
ఐపీఎల్ 13 సీజన్ నిర్వహణ క్రతువులో బీసీసీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. యుఏఈకి బయల్దేరడానికి ముందు, యుఏఈకి చేరుకున్న తర్వాత, బయో సెక్యూర్ బబుల్లోకి ప్రవేశించడానికి ముందు, బయో బుడగలో అడుగుపెట్టిన అనంతరం.. ఇలా అన్ని దశల్లో, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సమగ్రమైన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు.. ప్రాంఛైజీలు, బీసీసీఐ, ఈసీబీ (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) మధ్య సమాచార సమన్వయం వంటి అంశాలతో కూడిన స్టాండర్ట్ అపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ను ఐపీఎల్ సోమవారం ప్రాంఛైజీలకు పంపించింది. 53 రోజుల ఐపీఎల్లో చేయాల్సినవి, చేయకూడనివి, ప్రయాణం, బస, శిక్షణ విషయంలో సవివరణ సూచనలు చేసింది. సెప్టెంబర్ 19-నవంబర్ 10 వరకు యుఏఈలోని దుబారు, అబుదాబి, షార్జా నగరాల్లో ఐపీఎల్ 2020 నిర్వహిస్తున్నట్టు సంగతి తెలిసిందే. ఐపీఎల్ను విదేశీ గడ్డపై నిర్వహిం చేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ప్రవేశంపై తుది నిర్ణయాన్ని ప్రాంఛైజీలకే వదిలేసిన బీసీసీఐ.. సాధ్యమైనంత తక్కువ సంఖ్యతో తుది బృందం ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ప్రతి ప్రాంఛైజీలో కచ్చితంగా ఓ వైద్యాధికారి ఉండాలని బోర్డు నిబంధన పెట్టింది. ప్రతి దశలోనూ ఆటగాళ్లకు వైద్యాధికారి కోవిడ్19పై అవగాహన పెంచనున్నాడు.
కోవిడ్ పరీక్ష నిబంధనలు
క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ఇతర అధికారులకు చేయనున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షలపై ఇదివరకే బోర్డు నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యుఏఈ విమానం ఎక్కడానికి ముందు 24 గంటల విరామంతో రెండు సార్లు కోవిడ్19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్గా రావాలి. యుఏఈలోకి అడుగుపెట్టిన అనంతరం 7 రోజులు కచ్చితమైన క్వారంటైన్లో గడపాలి. ఈ సమయంలో 1, 3, 6 రోజుల్లో కోవిడ్19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తారు. ఈ మూడింటిలోనూ నెగెటివ్గా వచ్చిన వారినే ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్లోకి అనుమతిస్తారు. ఏ దశలోనైనా ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్, ఐసోలేషన్లో ఉంచుతారు. అనంతరం మూడు సార్లు కోవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా వస్తే బయో బబుల్లోకి తీసుకుంటారు. భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, నేపాల్, న్యూజిలాండ్) నుంచి నేరుగా యుఏఈకి చేరుకునే క్రికెటర్లు, సహాయక సిబ్బందికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. యుఏఈ విమానం ఎక్కడానికి 96 గంటల ముందు రెండో ఆర్టీ పీసీఆర్ పరీక్షలో నెగెటివ్గా వచ్చి ఉండాలి. యుఈఏలోకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు నేరుగా హోటల్కు వెళ్లకూడదు. విమానాశ్రయంలోనే మరోసారి కోవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడూ నెగెటివ్ వస్తేనే ప్రాంఛైజీ బస చేస్తోన్న హోటల్లోకి రానిస్తారు. ఐపీఎల్ ఆతిథ్య నగరాలు దుబారు, అబుదాబి, షార్జాల్లో స్థానిక మార్గదర్శకాలను పాటించనున్నారు. అబుదాబిలోకి వచ్చే ప్రయాణికులు గత 48 గంటల్లో కోవిడ్19 నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలి. అబుదాబిలో మ్యాచులు ఆడే ఆటగాళ్లు ప్రయాణ సమయానికి రెండు రోజుల ముందు పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం 53 రోజుల లీగ్లో ప్రతి ఐదు రోజులకు ఓసారి కోవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసుకోవాలి.
ఈ ఐదు రోజుల పరీక్ష జరిగిన రెండు రోజుల్లోనే అబుదాబి మ్యాచ్ ఉంటే మళ్లీ పరీక్ష చేయరు. ఆ పరీక్ష చేసిన 3, 4 రోజుల తర్వాతైనే మరోసారి పరీక్ష చేసుకుని అబుదాబికి ప్రయాణం చేస్తారు.
లీగ్లో పాజిటివ్ కేసు వస్తే..
53 రోజుల ఐపీఎల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఓపీల్లో వివరించారు. ప్రతి ఐదు రోజులకు ఓసారి పరీక్ష చేయనుండటం, జియో ట్రాకింగ్ ఉండనుండటంతో ఎవరైనా పాజిటివ్గా తేలినా ఇతరులకు వ్యాపించే ప్రమాద శాతం తక్కువగా ఉండనుంది!. పాజిటివ్ వచ్చిన క్రికెటర్ లేదా ఇతర సిబ్బందిని తొలుత బయో సెక్యూర్ బబుల్ నుంచి బయటకు తీసుకొస్తారు. ప్రాంఛైజీ బస చేస్తున్న హౌటల్లోనే ఐసోలేషన్ కోసం ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఐసోలేషన్ అనంతరం కోవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తే మళ్లీ బబుల్లోకి ప్రవేశం కల్పిస్తారు.
ఎవరూ బుడగ దాటొద్దు
జోఫ్రా ఆర్చర్ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ నిర్వాహకులు ముందుగానే బయో సెక్యూర్ బుడగ దాటి బయటకు వెళ్లకూడదని నిబంధనలు పెట్టారు. టోర్నీ జరుగుతున్న సమయంలోనూ ఆటగాళ్లు ఎవరూ సన్నిహితంగా మెలిగేందుకు అవకాశం లేదు. హోటల్ రూమ్ నుంచి బయటకు వస్తే కచ్చితంగా ఎన్95 (వాల్వ్ లేనిది) మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ వేసుకునే సహచర క్రికెటర్లతో మాట్లాడాలి. అవసరమైతేనే హోటల్ రూమ్ నుంచి బయటకు రావాలి. క్రికెటర్లకు గాయాలు అయినప్పుడు నిబంధనల్లో కొంత మినహాయింపు ఉంటుంది. ఎక్స్ రే, స్కానింగ్ తీయాల్సి వచ్చినప్పుడు కోవిడ్ 19 మార్గదర్శకాలు పాటించాలి. ఇతరులను కలువకూడదు.
ఓ హోటల్కు ఓ ప్రాంఛెజీ : బీసీసీఐ
మార్గదర్శకాల ప్రకారం ఎనిమిది ప్రాంఛైజీలు ఎనిమిది హోటళ్లలో బస చేయనున్నాయి. బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా ఏదేని రిసార్ట్, లేదా హోటల్ను పూర్తిగా బుక్ చేసుకోవాలని ప్రాంఛైజీలకు బోర్డు సూచించింది. అది సాధ్యపడకుంటే, కనీసం హోటల్లో ప్రాంఛైజీకి ప్రత్యేక అవుట్, ఇన్ గేట్లు ఉండేలా.. ఇతరులకు అటువైపు ప్రవేశం లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.