Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాక్సింగ్ డే టెస్టుపై సీఏ
కాన్బెర్రా: ప్రపంచ క్రికెట్ చారిత్రక స్టేడియాల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఒకటి. సుమారు లక్ష మంది అభిమానులు వీక్షించేందుకు సీటింగ్ సామర్థ్యం మెల్బోర్న్ సొంతం. ఫిబ్రవరిలో ఇక్కడ జరిగిన మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్ను 86174 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రతి ఏడాది ఆసీస్ ఇక్కడ బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26) నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. మెల్బోర్న్ స్టేడియం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో భారత్తో బాక్సింగ్ డే టెస్టును మెల్బోర్న్ నుంచి ఆడిలైడ్కు తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా తొలి డే నైట్ గులాబీ టెస్టు మ్యాచ్కు ఆడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టు వేదిక మార్పు వార్తలపై క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ స్పందించారు. 'బీసీసీఐతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నాం. నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వటంపై నమ్మకంగా ఉన్నాం. ప్రస్తుతానికి సీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బాక్సింగ్ డే టెస్టు సమయానికి మెల్బోర్న్లో కోవిడ్19 కేసులు తగ్గుముఖం పట్టి, అభిమానులు సైతం స్టేడియానికి వస్తారని అనుకుంటున్నాం. పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా సీఏ చేయగలిగినంత చేస్తోంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు సైతం సిద్ధంగానే ఉన్నాయి. సీఏ క్రికెట్ క్యాలెండర్లో మెల్బోర్న్ ఐకానిక్ ఈవెంట్. మెల్బోర్న్లోనే బాక్సింగ్ డే టెస్టుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం' అని హాక్లీ అన్నాడు.