Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ క్రికెట్ నిబంధనలపై అభ్యంతరం
- ఈశాన్య రాష్ట్ర జట్లకు ఇబ్బందికరం
ముంబయి: జూనియర్ క్రికెట్ స్థాయిలో (అండర్-16, అండర్-19, అండర్-23) ముగ్గురు అతిథి ఆటగాళ్లు ఆడేందుకు ఇంతవరకూ ఉన్న సౌలభ్యాన్ని బీసీసీఐ ఇటీవల రద్దు చేసింది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసుకోవటం రాష్ట్ర క్రికెట్ సంఘాల బాధ్యత. అతిథి ఆటగాళ్ల నిబంధనతో రాష్ట్ర సంఘాలు ఆ బాధ్యత విస్మరిస్తున్నాయని.. సొంతంగా కుర్ర క్రికెటర్లను తయారు చేసుకోవాలని బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సూచించింది. జూనియర్ క్రికెట్ స్థాయిలో క్రికెటర్ల అన్వేషణకు, అభివృద్ధికి రాష్ట్ర సంఘాలు బీసీసీఐ నుంచి ప్రత్యేక నిధులు సైతం అందుకుంటున్నాయి. ఏండ్లుగా నిలదొక్కుకున్న రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇది పెద్ద సమస్య కాదు. కానీ జస్టిస్ లోధా కమిటీ సిఫారసులతో బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలుగా ఏర్పడిన ఈశాన్య రాష్ట్రాలు, పుదుచ్చేరి క్రికెట్ సంఘాలకు ఈ నిబంధన సమస్యగా మారుతోంది. కేవలం రెండేండ్ల కాలంలో సొంతంగా యువ క్రికెటర్లను తయారు చేసుకోవటం కష్టమైన పని. 80 ఏండ్లుగా కొనసాగుతున్న రాష్ట్ర క్రికెట్ సంఘాలతో పోటీపడేందుకు మాకు ఈ నిబంధన ప్రతిబంధకంగా మారిందని పుదుచ్చేరి, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లు బీసీసీఐకి విషయాన్ని తెలియజేశాయి. అస్సాం క్రికెట్ సంఘం సైతం త్వరలోనే బోర్డుకు లేఖ రాయనుంది. ఈ రాష్ట్ర క్రికెట్ సంఘాలు ప్రతిభాన్వేషణ కార్యక్రమాలతో యువ క్రికెటర్లను తయారు చేస్తున్నాయి, కానీ అతిథి ఆటగాళుకొత్త జట్టును మైదానంలో నడిపించగలరని విశ్వసిస్తున్నారు. అతిథి ఆటగాళ్ల గైర్హాజరీతో కొత్త జట్లు మైదానంలో ఆశించిన రీతిలో రాణించలేవని, కొత్త రాష్ట్ర సంఘాలకు మరింత సమయం అవసరమని బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నాడు. కరోనా వైరస్ సమయంలో ఈ ఏడాది దేశవాళీ క్యాలెండర్లో అండర్-16, అండర్-19, అండర్-23 క్రికెట్కు పెద్దగా చోటు లభించే అవకాశం లేదు. సీనియర్ క్రికెట్ స్థాయిలో అతిథి ఆటగాళ్ల సేవలను అన్ని రాష్ట్రాలు వాడుకునే అవకాశం ఉంది.