Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీలే
- దేశవాళీ సీజన్ తాత్కాలిక క్యాలెండర్
ముంబయి: దేశవాళీ క్రికెట్ సీజన్లో ప్రతి ఏడాది 2036 మ్యాచులు నిర్వహిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది దేశవాళీ మ్యాచుల సంఖ్య 1183కు కుదించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ బృందం దేశవాళీ తాత్కాలిక క్యాలెండర్ను సిద్ధం చేసింది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో ఇది అమల్లోకి రానుందని తెలుస్తోంది. ఈ ఏడాది దేశవాళీ సీజన్ జులై-ఆగస్టులో ఆరంభం కావాలి. కానీ కరోనా కారణంగా దేశవాళీ సీజన్కు బ్రేక్ పడింది. ఐపీఎల్ ముగిసిన పది రోజుల తర్వాత దేశవాళీ సీజన్ షురూ కానుంది. నవంబర్ 10తో ఐపీఎల్ 2020 ముగియనుంది. నవంబర్ 19 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో దేశవాళీ సీజన్ ఆరంభం కానుంది. 38 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి 109 మ్యాచులు ఆడనున్నారు. డిసెంబర్ 7న ఫైనల్స్ జరుగనున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్కు ఈ డిసెంబర్ లేదా జనవరిలో మెగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఆటగాళ్ల వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ డిసెంబర్ 13న ఆరంభం కానుంది. రంజీ ట్రోఫీలో జోన్ల విధానం అమలు చేయాలనే ఆలోచన ఉన్నా.. ఎప్పట్లానే 38 జట్లు ఐదు గ్రూపులుగా ఆడతాయి. మార్చి 10న ఫైనల్తో రంజీ ట్రోఫీ ముగియనుంది. గ్రూప్ ఏ, బి, సి, డిలుగా 38 జట్లు రంజీ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. గ్రూప్ డిలో ఈశాన్య రాష్ట్రాలు పోటీపడతాయి. ఏ, బి, సీ గ్రూప్ల నుంచి ఆరు జట్లు క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంటాయి.
మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్ కోసం డి, సి గ్రూప్ విజేతలతో ఏ, బి గ్రూప్ మూడో స్థానంలో నిలిచిన జట్లు పోటీపడతాయి. విజేతలు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంటారు. 50 ఓవర్ల ఫార్మాట్ విజరు హజారే ట్రోఫీకి ఈ సీజన్లో స్థానం లభించలేదు. మహిళల క్రికెట్లోనూ ముందుగా చెప్పినట్టు చాలెంజర్ సిరీస్లు లేవు. మహిళల టీ20 లీగ్లో 37 జట్లు పోటీపడనున్నాయి. ఇది నవంబర్లో ఆరంభం కానుంది. అండర్-16, అండర్-19, అండర్-23 జూనియర్ క్రికెట్ మ్యాచులు లేవు. కరోనా కారణంగా ఈ ఏడాది పూర్తి స్థాయి దేశవాళీ సీజన్కు ఆస్కారం లేదని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్నారు.