Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి మాజీ స్కోరర్ల విన్నపం
ముంబయి: జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు, నూతన రాజ్యాంగం అమలుతో సుమారు 17 మంది స్కోరర్లు ఉద్యోగాలు కోల్పోయారు!. బీసీసీఐ అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏండ్లుగా జస్టిస్ లోధా కమిటీ నిర్దేశించింది. దీంతో 60 ఏండ్లు పైబడిన సీనియర్ స్కోరర్లను రాత్రికి రాత్రే తొలగిస్తూ బీసీసీఐ గతంలో గులాబీ పత్రాలు పంపించింది. ఊహించని వీడ్కోలు లభించిన 17 స్కోరర్లకు బీసీసీఐ పెన్షన్ లేదా ఏకకాల ప్రయోజనాలు అందలేదు. ఏండ్లుగా బీసీసీఐతో పనిచేసిన స్కోరర్లను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారని మాజీ స్కోరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ సౌకర్యం కల్పించటం, ఏకకాల ప్రయోజనాలు ఇవ్వటం, రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచటం వంటి డిమాండ్లలో కొంతకాలంగా స్కోరర్లు బీసీసీఐ ఉన్నతాధికారులు, ఆఫీస్ బేరర్లకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అయినా, బోర్డు నుంచి ఎటువంటి స్పందన రావటం లేదు. సౌరవ్ గంగూలీకి సైతం మాజీ స్కోరర్లు లేఖలు రాశారు. ఇకనైనా మా సమస్యలు విని, పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ స్కోరర్లు బీసీసీఐ అధ్యక్షుడిని కోరుతున్నారు. ఇదిలా ఉండగా బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ' స్కోరర్లు బీసీసీఐ ఉద్యోగులు కాదు. ఏడాదికి 30-40 మ్యాచులకే స్కోరర్లు పని చేస్తారు. మ్యాచ్లకు అందుబాటులో ఉండమనే స్కోరర్లకు బోర్డు చెప్పగలదు, రాలేమని చెప్పే స్వేచ్ఛ స్కోరర్లకు ఉంటుంది. క్రికెట్ బోర్డుతో స్కోరర్లు ఫ్రీలాన్సర్లుగా పని చేస్తారు. ఇతర సమయాల్లో, వారు కోరుకుంటే మ్యాచ్ సమయాల్లోనూ వారి పనులు చేసుకోవచ్చు. వారికి బోర్డు పెన్షన్ ఇవ్వటం కుదరదు. వేతనాల విష యంలో ఇప్పటికే పలుమార్లు పెంపుదల చేశారు' అని రత్నాకర్ శెట్టి అన్నాడు. బీసీసీఐ ఉద్యోగులు కాని స్కోరర్లకు బీసీసీఐ పదవీ విరమణ వయసు నిబంధన ఏవిధంగా వర్తిస్తుందనే విషయం బోర్డు నాయకత్వమే చెప్పాలి.