Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా దేశాల నిష్క్రమణల ఫలితం
- ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ థామస్, ఉబర్ కప్ టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది. కరోనా కారణంగా 2020 థామస్, ఉబర్కప్ ఆలస్యంగా షెడ్యూల్ చేయబడింది. అక్టోబర్ 3-11న డెన్మార్క్ వేదికగా థామస్, ఉబర్ కప్లు నిర్వహించేందుకు బిడబ్ల్యూఎఫ్ తొలుత నిర్ణయించింది. ఇటీవల కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా నమోదు అవుతున్నాయి. టోర్నీలో పాల్గొనే షట్లర్ల ఆరోగ్య భద్రతపై అనుమానాలతో ఇండోనేషియా, థారులాండ్, తైవాన్, హాంగ్కాంగ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలు థామస్, ఉబర్ కప్ నుంచి వైదొలిగాయి. జపాన్, చైనాలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బ్యాడ్మింటన్ పవర్హౌస్ ఆసియా దేశాలు దూరం కావటంతో థామస్, ఉబర్ కప్ కళ తప్పనున్నాయి. అగ్రజట్లు లేకుండా థామస్, ఉబర్ కప్లు నిర్వహించటం టోర్నీ స్థాయికి తగ్గించటమేనని బ్యాడ్మింటన్ నిపుణులు పెదవి విరిచారు. ఈ పరిస్థితుల్లో థామస్, ఉబర్ కప్లను 2021 టోక్యో ఒలింపిక్స్ తర్వాత నిర్వహించటమే మేలని బిడబ్ల్యూఎఫ్ భావిస్తోంది. మాజీ వరల్డ్ నం.1, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ సైతం థామస్,ఉబర్ కప్లను కరోనా మహమ్మారి సమయంలో నిర్వహించటం అంత అవసరమా? అని ప్రశ్నించింది. మరికొంత షట్లర్లు సైతం సైనా దారిలోనే టోర్నీలో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్య భద్రతపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మరిన్ని దేశాలు టోర్నీ నుంచి తప్పుకోవడానికి ముందే థామస్, ఉబర్ కప్లను వాయిదా వేస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ 2021లోనే వెల్లడిస్తామని బిడబ్ల్యూఎఫ్ మంగళవారం ప్రకటనలో తెలిపింది.