Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీతో పంజాబ్ ఢీ నేడు
- కుంబ్లే, పాంటింగ్ జట్ల పోరుపై ఆసక్తి
- రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హంగామా దుబారుకి చేరుకుంది. అబుదాబిలో ఆరంభమైన ఐపీఎల్ 13 సీజన్.. ఆదివారం ప్రధాన వేదికకు వచ్చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్లు నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో తమ తొలి మ్యాచ్లో పోటీపడేందుకు సిద్ధపడుతున్నాయి. ముఖాముఖి రికార్డు కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు అనుకూలంగా ఉండగా.. తాజా బలాబలాల ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
దుబాయ్ (యుఏఈ)
ఐపీఎల్లో ఎప్పటికప్పుడు కెప్టెన్, కోచ్లను మార్చే అలవాటున్న ప్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఐపీఎల్ 2020 సీజన్ అందుకు మినహాయింపు కాదు. కెప్టెన్గా కెఎల్ రాహుల్, కోచ్గా అనిల్ కుంబ్లే బాధ్యతలు అందుకున్నారు. ఇక ఐపీఎల్లో ముగ్గురు విదేశీ క్రికెటర్లతోనే హ్యాపీగా ఆడేయగల ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్. దేశవాళీ ప్రతిభావంతులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ విదేశీ క్రికెటర్లపై పెద్దగా ఆధారపడి లేదు. ఆట పరంగా ఢిల్లీ వర్సెస్ పంజాబ్లో కింగ్స్దే పైచేయిగా ఉంది. గత ఐదు మ్యాచుల్లో నాలుగింట పంజాబ్ పంజా విసరగా.. చివరి మ్యాచ్లో క్యాపిటల్స్ పైచేయి సాధించింది. మైదానంలో పోటీపరంగా పంజాబ్, ఢిల్లీ పోరులో పెద్ద ఆసక్తికర పోటీ లేదు!. కానీ తెరవెనుక ఉన్న వ్యక్తుల పరంగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. ఇద్దరు క్రికెట్ జెంటిల్మెన్స్ చీఫ్ కోచ్లుగా కొనసాగుతున్న జట్లు నేడు దుబారులో తలపడనున్నాయి. ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్ క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పంజాబ్, ఢిల్లీ పోరు కాస్తా.. కుంబ్లే వర్సెస్ పాంటింగ్గా మారిపోయింది!.
ఢిల్లీకి స్పిన్ అండ : ఢిల్లీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. పంజాబ్ మాజీ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఢిల్లీ అమ్ములపొదిలో చేరిపోయాడు. ఐపీఎల్లో సూపర్రికార్డు కలిగిన అమిత్ మిశ్రా, యువ స్పిన్నర్లు సందీప్ లామిచెనె, అక్షర్ పటేల్లు ఢిల్లీ జట్టులో ఉన్నారు. నెమ్మదిగా స్పందించే దుబారు పిచ్పై స్పిన్ ప్రభావం ఉండనుంది. పేస్ విభాగంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు సఫారీ యువ సంచలనం కగిసో రబాడ ప్రమాదకారులు. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మయర్లతో ఎంతో బలోపేతంగా ఉంది. పొట్టి ఫార్మాట్లో పంత్, హెట్మయర్, అయ్యర్, షా, ధావన్లు భారీ లక్ష్యాలను ఛేదించటంలో, భారీ లక్ష్యాలను నిర్దేశించటంలో దిట్ట. నేటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్సే ఫేవరేట్.
బిగ్ హిట్టర్ల అడ్డా : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో అంతా బాగానే ఉంది, కానీ బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మహ్మద్ షమి ఒక్కడిపైనే పేస్ భారం ఉంది. యువ పేసర్ రవి బిష్ణోరు, బంగ్లా స్పిన్నర్ ముజీర్ రెహమాన్, కృష్ణప్ప గౌతమ్లు ప్రతిభావంతులే కానీ అనుభవం లేదు. ఇక బ్యాటింగ్ లైనప్లో పంజాబ్ నిజంగానే కింగ్స్. కెప్టెన్ కెఎల్ రాహుల్ కెరీర్ ఫామ్లో ఉన్నాడు. నం.3 బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ గత ఏడాదిగా గొప్పగా రాణిస్తున్నాడు. 40 ఏండ్ల క్రిస్ గేల్ ఈ సీజన్లో పంజాబ్ తరఫున కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇంగ్లాండ్తో ఆఖరు వన్డేలో చిచ్చరపిడుగులా చెలరేగిన గ్లెన్ మాక్స్వెల్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. 2014 యుఏఈలో మొదలైన ఐపీఎల్లో మాక్స్వెల్ 16 మ్యాచుల్లో 552 పరుగులు చేశాడు. దీంతో తాజా సీజన్లో మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, క్రిస్ జోర్డాన్లు సైతం పంజాబ్లో ఉన్నారు. స్వల్ప స్కోర్లు నమోదయ్యే పిచ్పై బిగ్ హిట్టర్లు మెరిస్తేనే పంజాబ్కు ఫలితం.
తుది జట్లు (అంచనా) :
ఢిల్లీ క్యాపిటల్స్ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాష్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్కీపర్), షిమ్రోన్ హెట్మయర్, అలెక్స్ కేరీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ లామిచినె, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, కృష్ణప్ప గౌతమ్, ముజీబ్ రెహమాన్, రవి బిష్ణోరు, మహ్మద్ షమి.