Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయుడు, డుప్లెసిస్ అర్థ సెంచరీలు
- ఆరంభ మ్యాచ్లో ముంబయికి భంగపాటు
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020
అబుదాబి : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్కు మరో ఓటమి. 2013 నుంచి 8 పర్యాయాలు తన ఆరంభ మ్యాచ్లో ముంబయి విజయాన్ని అందుకోలేదు. ఉత్కంఠ ఛేదనలో చెన్నై సూపర్కింగ్స్ బోణీ కొట్టింది. అంబటి రాయుడు (71, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), డుప్లెసిస్ (58 నాటౌట్, 44 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలో చెలరేగటంతో 163 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సౌరభ్ తివారి (42, 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), క్వింటన్ డికాక్ (33, 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 162/9 స్కోరు సాధించింది.
రాయుడు, డుప్లెసిస్ దంచేశారు : 163 పరుగుల ఛేదనలో సూపర్కింగ్స్కు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ. ఇన్నింగ్స్ ఆరో బంతికి షేన్ వాట్సన్ (4) వెనుదిరగగా. రెండో ఓవర్ ఆఖరి బంతికి మురళీ విజయ్ (1) వికెట్ కోల్పోయాడు. 6/2తో చెన్నై ఒత్తిడిలో కూరుకోగా.. ముంబయి స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. ప్రతికూల పరిస్థితుల్లో అంబటి రాయుడు, డుప్లెసిస్ ముంబయి బౌలర్లను ఎదురించారు. 14 ఓవర్లలో 115 పరుగులు జోడించారు. సూపర్కింగ్స్ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. ధనాధన్ షాట్లతో చెలరేగిన రాయుడు బుమ్రా ఓవర్లో విరుచుకుపడ్డాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిశాడు. 33 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన రాయుడు.. 71 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్లో డుప్లెసిస్ ఆఖరు వరకూ క్రీజులో కొనసాగాడు. రవీంద్ర జడేజా (10) అవుటైనా.. శామ్ కరణ్ (18, 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) విశ్వరూపం చూపించాడు.
దూకుడుకు కళ్లెం! : స్వల్ప స్కోర్ల మ్యాచ్లో టాస్ నెగ్గిన ధోని మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న సీమర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2020లో తొలి బంతి సంధించాడు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తొలి బంతినే ఫైన్ లెగ్ దిశగా బౌండరీతో ఘనంగా మొదలుపెట్టాడు. పవర్ప్లేలో ముంబయి దూకుడు ప్రదర్శించింది. డికాక్ (33) ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్ప్లేలో ముంబయి వేగంగా పరుగులు సాధించింది. క్రీజులో కుదురుకుంటున్న రోహిత్ శర్మను మిడ్ ఆఫ్లో ఆడేలా రెచ్చగొట్టిన ధోని.. చావ్లా బౌలింగ్లో డగౌట్కు చేర్చాడు. డికాక్ సైతం నిష్క్రమించటంతో సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. సౌరభ్ తివారీ భారీ షాట్లతో చెలరేగాడు. 92/2తో ముంబయి భారీ స్కోరు దిశగా సాగింది. రవీంద్ర జడేజా ఓవర్లో భారీగా పరుగులు పిండుకున్న తివారీ అర్థ సెంచరీ సాధించేలా కనిపించాడు. హార్దిక్ పాండ్య సైతం జడేజా ఓవర్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ సమయంలోనే ధోని కెప్టెన్సీ అనుభవం చూపించాడు. ఆఖరు ఓవర్లలో ముంబయి దూకుడుకు కళ్లెం వేశాడు. పొలార్డ్ (18), కృనాల్ పాండ్య (3) స్వేచ్ఛగా పరుగులు సాధించలేకపోయారు. దీంతో ముంబయి ఇండియన్స్ 162 పరుగులకే పరిమితం అయ్యింది.
సంక్షిప్త స్కోర్లు :
ముంబయి ఇండియన్స్ : 162/9 (సౌరభ్ తివారి 42, డికాక్ 33, ఎంగిడి 3/38, దీపక్ 2/32)
చెన్నై సూపర్కింగ్స్ : 166/5 (అంబటి రాయుడు 71, డుప్లెసిస్ 58, బౌల్ట్ 1/19, పాటిన్సన్ 1/27)