Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లే ఆఫ్స్ బెర్త్ను ప్రభావం చేయగలదు
- అంపైర్ తప్పిదంపై పంజాబ్ సీఈఓ
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పేలవ అంపైరింగ్ గతంలో చూశాం. ఐపీఎల్ 13 సీజన్ రెండో మ్యాచ్లోనే అంపైరింగ్ తప్పిదాలు వివాదానికి దారితీయటం చర్చనీయాంశమైంది. ఉత్కంఠకర సూపర్ ఓవర్లో పంజాబ్ ఢిల్లీ గెలుపొందిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20 ఓవర్ల మ్యాచ్లో పంజాబ్, ఢిల్లీలు 157/8తో సమవుజ్జీలుగా నిలిచాయి. మయాంక్ అగర్వాల్ (89) అసమాన పోరాటం పంజాబ్కు విజయాన్ని అందించలేకపోయింది. అయితే, మయాంక్ మెరుపులతో పంజాబ్ సులువుగానే గెలుపొందేదే కానీ, 19వ ఓవర్లో రెండు పరుగులు దక్కాల్సిన చోట అంపైర్ తప్పుడు నిర్ణయంతో పంజాబ్కు ఒక్క పరుగు మాత్రమే లభించింది. ఆ ఒక్క పరుగు దక్కి ఉంటే పంజాబ్ నిర్ణీత ఓవర్ల మ్యాచ్లోనే విజయాన్ని నమోదు చేసేది. సోషల్ మీడియాలో అంపైరింగ్ నిర్ణయంపై విమర్శలు చెలరేగుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారికంగా మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్కు ఫిర్యాదు చేసింది. 'మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాం. మానవ తప్పిదాలను అర్థం చేసుకోగలం. కానీ ఐపీఎల్ వంటి వరల్డ్ క్లాస్ టోర్నీలో మానవ తప్పిదాలకు తావులేదు. ఈ తప్పిదం పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్పై ప్రభావం చూపించవచ్చు. మ్యాచ్లో ఓటమి అంటే ఓటమి. మానవ తప్పిదాలకు చోటులేకుండా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తారని ఆశిస్తున్నాను' అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీఈఓ సతీశ్ మీనన్ తెలిపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో కగిసో రబాడ బంతిని మయాంక్ అగర్వాల్ మిడ్ఆన్లో ఆడాడు. సులువుగానే రెండు పరుగులు తీశారు. కానీ క్రిస్ జోర్డాన్ క్రీజులో బ్యాట్ పెట్టకుండానే రెండో పరుగుకు వెళ్లాడని అంపైర్ నితిన్ మీనన్ ఒక్క పరుగే ఇచ్చాడు. మరో పరుగును షార్ట్ రన్గా ప్రకటించాడు. కానీ రీప్లేలో జోర్డాన్ క్రీజులో బ్యాట్ పెట్టినట్టు స్పష్టంగా కనిపించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంపైరే! : కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అంపైరింగ్ తప్పిదంపై ఢిల్లీ డేర్డెవిల్స్ మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాజీ కోచ్ వీరెందర్ సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్ ఫలితాన్ని శాసించిన అంపైర్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించాలని ట్వీట్ చేశాడు. ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటనతో ఏకీభవించటం లేదు. మ్యాచ్లో ఆ ఒక్క పరుగు నిర్ణయాన్ని తీసుకున్న అంపైర్కే ఆ అవార్డు దక్కాలి. మ్యాచ్ ఫలితాన్ని శాసించినది అదే' వీరూ విమర్శలు చేశాడు. ఆకాశ్ చోప్రా సైతం ట్విట్టర్లో విమర్శలు చేశాడు. ' ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ రేసు కఠినంగా ఉంటుంది. జట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పం. ఈ రెండు పాయింట్లతోనే పంజాబ్ ప్లే ఆఫ్స్కు దూరమైతే ఏంటి?' అని ప్రశ్నించాడు.
ఐపీఎల్లో అందుబాటులో ఉన్న సాంకేతికతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరు బంతిని మూడో అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. మూడు కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. ఒక్క కెమెరాలో మాత్రమే క్రిస్ జోర్డాన్ గీత దాటినట్టు కనిపించింది. మిగతా రెండు కెమెరాల్లో జోర్డాన్ క్లియర్ లైన్లో కనిపించాడు. అయినా, మూడో అంపైర్ ఆ బంతిని నోబాల్గా ప్రకటించడు.