Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ లో తొలి శతకం
- బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం
కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జూలు విదిల్చాడు. కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 132 పరుగులు చేసి చివరివరకూ అజేయంగా నిలిచాడు. అర్ధశతకాన్ని 36 బంతుల్లో, శతకాన్ని 62 బంతుల్లో పూర్తి చేశాడు. రాహుల్ చివర్లో చెలరేగడంతో పంజాబ్జట్టు ఆఖరి 30 బంతుల్లో 80 పరుగులు చేయగల్గింది.
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 206 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు 109 పరుగులకే కుప్పకూలింది. దీంతో పంజాబ్ జట్టు 97 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్(132 నాటౌట్) శతకంతో చేలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ముందు వికెట్లను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు. దీంతో పవర్-ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రాహుల్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
చివర్లో రాహుల్ హవా..
చివరి 5 ఓవర్లలో రాహుల్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 84, 89 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్లను కోహ్లీ జారవిడవడంతో మరింత రెచ్చిపోయాడు. వెంట వెంటనే రెండుసార్లు రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడడంతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో 62 బంతుల్లోనే సెంచరీని బాదాడు. సెంచరీ 12 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో పూర్తి చేశాడు. సెంచరీ పూర్తిచేసుకున్నాక రాహుల్ గేర్ మార్చాడు. డేల్ స్టెయిన్ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 26 రన్స్ రాబట్టాడు. దూబే వేసిన 20వ ఓవర్లో కరుణ్ నాయర్(15) ఒక ఫోర్, రాహుల్ వరుసగా ఒక ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి 23 రన్స్ రాబట్టాడు. బెంగళూరు బౌలర్లలో శివమ్ దూబేకు రెండు, చాహల్కు ఒక వికెట్ దక్కాయి.
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పడిక్కల్(1), ఫిలిప్పే(0), కోహ్లీ(1) ఘోరంగా విఫలమయ్యారు. సుందర్(30), డివిలియర్స్(28) మాత్రమే రాణించారు. మురుగన్, బిష్ణోరుకు మూడేసి, కాట్రెల్కు రెండు, షమి, మ్యాక్స్వెల్కు తలా ఒక వికెట్ దక్కాయి.
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రాహుల్
ఐపీఎల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మన్గా రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. బెంగళూరుపై వ్యక్తిగత స్కోర్ రెండు పరుగుల వద్ద రాహుల్ 2వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా.. రాహుల్ 60 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.