Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెంచ్ ఓపెన్కు ప్రభుత్వ అనుమతి
పారిస్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలపై పడింది. బయో బబుల్ వాతావరణంలో ఇప్పుడు క్రీడలు పున ప్రారంభమైనా, స్టేడియంలోకి అభిమానులకు ప్రవేశం నిరాకరిస్తున్నారు. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఓపెన్ ప్రేక్షకులు లేకుండానే ముగిసింది. ఫ్రెంచ్ ఓపెన్ సైతం అదే తరహాలోనే ముగుస్తుందనే అనుకున్నారు. కానీ మట్టికోర్టు గ్రాండ్స్లామ్ టోర్నీ వీక్షించేందుకు ప్రతి రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు ఫ్రాన్స్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ను 5.2 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ఏడాది అభిమానుల హాజరు 3 శాతమే కానుంది. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహణ ప్రాంగణం 25 ఎకరాల్లో ఉంది. కోవిడ్ నివారణ చర్యలు తీసుకుని కనీసం 11, 500 మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయగలమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రభుత్వానికి నివేదించారు. కనీసం రోజుకు 5 వేల మందికైనా అనుమతి లభిస్తుందని ఆశించారు. కానీ వెయ్యి మందికే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి ఏటా టిక్కెట్ల ద్వారా 20 శాతం ఆదాయం లభించేది. ఇప్పుడా ఆ ఆదాయానికి గండి పడింది. ఫ్రెంచ్ ఓపెన్ అర్హత మ్యాచులు సెప్టెంబర్ 21 నుంచి ఆరంభమయ్యాయి. సెప్టెంబర్ 27 నుంచి ప్రధాన టోర్నీ ఆరంభం కానుంది.