Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ముంబయి ఇండియన్స్తో ఢీ
- విరాట్కు కెప్టెన్గా ఇది 150వ టీ20
దుబాయ్ : బయో బబుల్ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తొలిసారి అబుదాబి దాటి బయటకు వస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్తో మ్యాచ్ కోసం నేడు రోహిత్ శర్మ బృందం దుబాయ్ కి రానుంది. పెద్ద బౌండరీల అబుదాబిలో తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో భంగపడినా.. కోల్కతపై 195 పరుగుల భారీ స్కోరుతో ఔరా అనిపించింది. మరోవైపు సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో తొలి మ్యాచ్లో గెలుపొందిన బెంగళూర్.. తర్వాతి మ్యాచ్లో పంజాబ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న బెంగళూర్.. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోన్న ముంబయి ఇండియన్స్తో నేడు తలపడనుంది. పొట్టి ఫార్మాట్లో విరాట్ కోహ్లికి ఇది 150వ టీ20 మ్యాచ్ కానుంది. బెంగళూర్కు 112 మ్యాచుల్లో కెప్టెన్సీ వహించిన కోహ్లి.. భారత్కు 37 మ్యాచుల్లో నాయకత్వం వహించాడు. బ్యాట్స్మన్ గా తొలి రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లి విఫలమయ్యాడు. దీంతో మూడో మ్యాచ్లోనైనా తనదైన ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. విరాట్ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్, దేవ్దత్ పడిక్కల్ బెంగళూర్కు కీలకం కానున్నారు. అరోన్ ఫించ్ టాప్ ఆర్డర్లో మరింత బాధ్యత తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారిలు ఫామ్లో ఉన్నారు. కీరన్ పొలార్డ్, పాండ్య సోదరులు ఉండనే ఉన్నారు. బౌలింగ్లోనూ బెంగళూర్ కంటే మెరుగ్గా కనిపిస్తోన్న ముంబయి ఇండియన్స్ నేడు మ్యాచ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.