Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ పరిస్థితులను పరిశీలిస్తున్నాం
- బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
కోల్కత : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతోంది. భారత్లో కరోనా వైరస్ కేసులు 60 లక్షలు దాటేసింది. మరణాలు సైతం లక్షకు చేరువవుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది జనవరి-మార్చిలో జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ సిరీస్కు సైతం యుఏఈ వేదిక కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. యుఏఈ వేదికగా క్రికెట్ మ్యాచుల నిర్వహణకు ఈసీబీతో బీసీసీఐ ఇటీవల ఒప్పందం సైతం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. యుఏఈలో ఇంగ్లాండ్ సిరీస్ వార్తలపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. ' భారత్, ఇంగ్లాండ్ సిరీస్ను భారత్లోనే నిర్వహించటం బోర్డు ప్రథమ ప్రాధాన్యత. భారత పిచ్లపై నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. యుఏఈలో మూడు స్టేడియాలు ఉన్నాయి. అటువంటిదే ముంబయిలోనూ ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్లో సైతం బయో సెక్యూర్ బబుల్ సృష్టించగలం' అని గంగూలీ అన్నాడు.
ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్కు సలహాలు ఇవ్వటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందనే విమర్శలను గంగూలీ కొట్టిపారేశాడు. ' 2019 సీజన్లో అయ్యర్కు సాయపడ్డాను. ఇప్పుడు నేను బోర్డు అధ్యక్షుడిని కావచ్చు, కానీ నేను భారత్కు 500 (424) మ్యాచులు ఆడాననే విషయం మరువద్దు. అందుకే నేను ఏ యువ ఆటగాడితోనైనా మాట్లాడగలను. అది శ్రేయాష్ అయ్యర్ కావచ్చు, విరాట్ కోహ్లి కావచ్చు. ఎవరు సలహా అడిగినా, నేను సిద్దంగానే ఉంటాను' అని దాదా విమర్శలను తిప్పికొట్టాడు.