Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరంగేట్ర అమ్మాయిల ఈవెంట్కు కరోనా ఎఫెక్ట్
- నవంబర్లో ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్ (యుఏఈ)
తొలి మహిళల అండర్-19 ప్రపంచకప్కు కరోనా మహమ్మారి సెగ తగిలింది. ఎన్నో ఏండ్లుగా వినిపిస్తోన్న డిమాండ్లకు ఐసీసీ క్యాలెండర్లో చోటు దక్కగా.. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అరంగేట్ర అమ్మాయిల అండర్-19 వరల్డ్కప్ వాయిదా పడే ప్రమాదంలో పడింది. 2021 జనవరిలో బంగ్లాదేశ్ ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అండర్-19 ప్రపంచకప్ను నిర్వహించే అవకాశాలు కనిపించటం లేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నవంబర్లో మహిళల అండర్-19 ప్రపంచకప్పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి కారణంగా 2020 మెన్స్ టీ20 వరల్డ్కప్, 2021 మహిళల వన్డే వరల్డ్కప్లను ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఈవెంట్లను ఐసీసీ 2022కు వాయిదా వేసింది. మహిళల అండర్-19 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఉపఖండంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఆతిథ్య బంగ్లాదేశ్లోనూ కరోనా మహమ్మారి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో అండర్-19 ప్రపంచకప్ నిర్వహించే అవకాశమే లేదు. నవంబర్లో భేటీ కానున్న ఐసీసీ బోర్డు కీలక నిర్ణయం వెలువరించనుంది. నిరుడు అక్టోబర్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో శశాంక్ మనోహర్ సారథ్యంలో మహిళల అండర్-19 ప్రపంచకప్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పుడు ఆ టోర్నీ కనీసం ఓ ఏడాది వాయిదా పడనుంది.