Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ ఆస్ట్రేలియా నూతన ప్రణాళికలు
కాన్ బెర్రా : ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లిసేన ఎక్కడ క్వారంటైన్ చేయాలనే విషయంపై సందిగ్దం కొనసాగుతూనే ఉంది. ఆడిలైడ్ ఓవల్లో టీమ్ ఇండియా క్వారంటైన్లో ఉంటుందని తొలుత క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. కానీ ఆస్ట్రేలియాలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీఏకు సానుకూల స్పందన లభించటం లేదు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు సీఏ నూతన వేదికలను అన్వేషించింది. సిడ్నీ, కాన్బెర్రాలలో వన్డే, టీ20 సిరీస్ నిర్వహణ సహా సిడ్నీలో భారత క్రికెట్ జట్టుకు క్వారంటైన్ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో సీఏ చర్చలు జరుపుతోంది. 'భారత క్రికెటర్లు, ఐపీఎల్ నుంచి తిరగొచ్చే ఆస్ట్రేలియా క్రికెటర్ల క్వారంటైన్ కోసం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వాన్ని సీఏ సంప్రదించింది. సీఏ ప్రతిపాదను ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నారు. హెల్త్, పోలీస్ విభాగాలు ప్రతిపాదనను చూస్తున్నాయి. భారత క్రికెట్ జట్టు పర్యటన మా క్వారంటైన్ నిబంధనలను ప్రభావితం చేయలేదు' అని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర క్రీడా మంత్రి స్టువర్ట్ తెలిపాడు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే పర్యటన వివరాలను బీసీసీఐకి పంపనుంది సీఏ. బీసీసీఐ పచ్చజెండా ఊపిన తర్వాతే పర్యటన షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. భారత క్రికెట్ జట్టు క్వారంటైన్ కోసం క్వీన్స్లాండ్, సౌత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలను సైతం సీఏ సంప్రదించింది. సిడ్నీలో మూడు వన్డేలు, ఓ టీ20 జరుగనుండగా.. కాన్బెర్రాలో రెండు టీ20 నిర్వహించనున్నారు. సిడ్నీ వేదికగా ఇప్పటికే మహిళల బిగ్బాష్ లీగ్కు సన్నాహాకాలు చేశారు. ఇప్పుడు భారత్తో సిరీస్లో నాలుగు మ్యాచుల నేపథ్యంలో మహిళల బిగ్బాష్ లీగ్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 2020 నవంబర్ 10న ఫైనల్స్తో ముగియనుంది. మరుసటి రోజు దుబారు నుంచి భారత, ఆస్ట్రేలియా క్రికెటర్లు సిడ్నీకి చేరుకుంటారు!.