Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోపీచంద్ అకాడమీ వీడిన స్టార్ షట్లర్
- సరైన సదుపాయాల్లేవని సింధు తండ్రి ఆరోపణ
- కోచ్ గోపీచంద్ తో విభేదాల్లేవని సింధు వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్
2012-2014 సైనా నెహ్వాల్ కెరీర్లో చిరస్మరణీయ విజయాలకు చిరునామా. 2012 ఒలింపిక్స్ కాంస్యం సహా ఎన్నో విజయాలు, గొప్ప పురోగతి సాధించింది సైనా. కానీ 2014 బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్ ముగిసిన అనంతరం కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీ వీడింది. బెంగళూర్లోని ప్రకాశ్ పదుకొణె అకాడమీలో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంది. గోపీచంద్, సైనా నెహ్వాల్ ఎపిసోడ్ బ్యాడ్మింటన్కు మంచి చేయలేదు. గోపీచంద్కు సింధు రూపంలో మరో చాంపియన్ లభించినా.. సైనా నెహ్వాల్ పూర్వ వైభవం సాధించలేదు.
2016-2019 తెలుగు తేజం పి.వి సింధు శిఖర సమాన విజయాలు సాధించిన సమయం. ఒలింపిక్స్ రజతం, ప్రపంచ చాంపియన్షిప్స్లలో వరుసగా రజత, స్వర్ణ పతకాలు సింధు సొంతం చేసుకుంది. భారత క్రీడా ముఖచిత్రంపై నాన్ క్రికెటింగ్ స్టార్గా ఎదిగింది. సరిగ్గా 2021 ఒలింపిక్స్కు ఏడాది ముందు కోచ్ పుల్లెల గోపీచంద్ను పి.వి సింధు వీడింది. ఆరేండ్ల క్రితం సైనా నెహ్వాల్ చేసిన తప్పిదమే ఇప్పుడు సింధు పునరావృతం చేసిందా? లేక సైనా మాదిరిగా కాకుండా సింధు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుందా? ఇప్పుడు ఇదే భారత బ్యాడ్మింటన్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశం.
సదుపాయాలు లేవు! : 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం కఠోర సాధన చేసిన సింధు.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ లో పూర్తిగా ఇంటికి పరిమితమైంది. లాక్డౌన్ అనంతరం సైతం హైదరాబాద్ లో క్రీడా పోటీలకు, శిక్షణకు అనుమతులు ఆలస్యం కావటంతో మరికొంత కాలం స్టేడియానికి దూరమైంది. హైదరాబాద్లో జాతీయ శిక్షణ శిబిరం ఆరంభం కావటంతో, ఒలింపిక్ మెడల్ ఆశావహులతో పాటు సింధు సైతం హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి హాజరైంది. టోక్యోలో స్వర్ణంపై కన్నేసిన సింధుకు గోపీచంద్ అకాడమీలో సరైన సాధన లభించటం లేదని ఆమె తండ్రి పి.వి రమణ ఆరోపించారు. ' ఇక్కడ (హైదరాబాద్లో) సింధుకు సరైన సాధన జరుగటం లేదు. 2018 ఆసియా క్రీడల తర్వాత, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సింధు ట్రైనింగ్పై అంతగా ఆసక్తి చూపించటం లేదు. సింధుకు గోపీచంద్ సరైన ప్రాక్టీస్ భాగస్వామిని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ సింధుకు నాణ్యమైన ప్రాక్టీస్ లభించటం లేదు. ఇక్కడ సౌకర్యాలు, సదుపాయాలపై సింధు విసుగుచెందింది' అని పి.వి రమణ పేర్కొన్నారు.
విభేదాల్లేవ్! : తండ్రి పివి రమణ వ్యాఖ్యలతో నష్టనివారణ చర్యలకు దిగింది పి.వి సింధు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వ్యవహారంపై సింధు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ' నా న్యూట్రీషన్, రికవరీ అవసరాల నిమిత్తం లండన్కు వచ్చాను. ఇక్కడ గాటోట్రేడ్ స్పోర్ట్స్ సౌన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నాను. నా తల్లిదండ్రుల అంగీకారంతోనే ఇక్కడికి వచ్చాను. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు. నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన మా అమ్మానాన్నలతో నాకు విభేదాలు ఏముంటాయి?. మా కుటుంబ సభ్యులతో ప్రతి రోజు మాట్లాడుతున్నాను. వారి మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా కోచ్ గోపీచంద్తో నాకు ఎటువంటి సమస్యలు లేవు. గోపీచంద్ అకాడమీలో సౌకర్యాలపైనా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు' అని పి.వి సింధు తెలిపింది. పివి సింధు తండ్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు గోపీచంద్ నిరాకరించారు. ' సింధు తండ్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడాలని అనుకోవటం లేదు. నాకు తెలిసిన వరకు, లండన్లో ట్రైనింగ్ కోసం ఆమె వెళ్లింది. 8-10 వారాల అనంతరం తిరిగి వస్తానని సింధు చెప్పింది. ఆమె ఇక్కడికి రాగానే టోర్నీలకు కోసం రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది' అని గోపీచంద్ అన్నారు.