Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో నికోలస్ పూరన్ మెరుపులు
- శిఖర్ ధావన్ వరుసగా రెండో శతకం
- ఢిల్లీ క్యాపిటల్స్పై పంజాబ్ గెలుపు
దుబాయ్ (యుఏఈ)
ఒత్తిడిలో పంజాబ్ మరో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. 165 పరుగుల ఛేదనలో కెఎల్ రాహుల్ (15), మయాంక్ అగర్వాల్ (5)లు త్వరగా నిష్క్రమించినా పంజాబ్ నిలిచింది. క్రిస్ గేల్ (29, 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) తుషార్ దేశ్పాండే ఓవర్లో 25 పరుగులతో విరుచుకుపడగా.. అశ్విన్ను రంగంలోకి దింపి ఢిల్లీ మ్యాచ్ రేసులో నిలిచింది. నికోలస్ పూరన్ (53, 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్థ సెంచరీకి తోడు గ్లెన్ మాక్స్వెల్ (32, 24 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. దీపక్ హుడా (15 నాటౌట్, 22 బంతుల్లో 1 ఫోర్), జేమ్స్ నీషమ్ (10 నాటౌట్, 8 బంతుల్లో 1 సిక్సర్)లు మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించారు. అంతకముందు శిఖర్ ధావన్ (106 నాటౌట్, 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు) మళ్లీ చెలరేగాడు. గబ్బర్ బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో గర్జించాడు. దుబారులో చెన్నై సూపర్కింగ్స్పై ఛేదనలో శతకబాదిన శిఖర్ ధావన్.. అదే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై సెంచరీ కొట్టాడు. ఐపీఎల్లో వరుస మ్యాచుల్లో సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మన్గా ధావన్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఓ ఐపీఎల్ సీజన్లో రెండు సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి (4), షేన్ వాట్సన్ (2), హషీమ్ ఆమ్లా (2), క్రిస్ గేల్ (2) సరసన శిఖర్ ధావన్ నిలిచాడు. శిఖర్ ధావన్ శతక జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్ 164/5 పరుగుల స్కోరు సాధించింది. పంజాబ్ పేసర్ మహ్మద్ షమి (2/28) రాణించాడు.
ధావన్ ఒక్కడే : 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు. పంజాబ్పై ధావన్ ఇన్నింగ్స్ ఇది. 59 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు. ఇవి మిగతా బ్యాట్స్మెన్ కలిసి చేసిన పరుగులు. శిఖర్ ధావన్ ఓ ఎండ్లో పంజాబ్ బౌలర్లపై పంజా విసిరినా.. మరో ఎండ్లో బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు భారీ స్కోరు చేయకుండా నియంత్రించారు. చెన్నైపై జోరును కొనసాగించిన శిఖర్ ధావన్ తొలి ఓవర్లో మాక్స్వెల్పై సిక్సర్తో దండయాత్ర మొదలుపెట్టాడు. 8 ఫోర్లు, ఓ సిక్సర్తో 28 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ధావన్.. 57 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా (7), కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (14), రిషబ్ పంత్ (14), మార్కస్ స్టోయినిస్ (9), షిమ్రోన్ హెట్మయర్ (10 నాటౌట్)లలో ఎవరూ మెరువలేదు. ధావన్ దూకుడుతో భారీ స్కోరు దిశగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్ను పంజాబ్ బౌలర్లు తెలివిగా కట్టడి చేశారు. డెత్ ఓవర్లలో మహ్మద్ షమి 12 బంతుల్లో 13 పరుగులే ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లాడు.
ఐపీఎల్ లో నేడు
కోల్కత X బెంగళూర్
వేదిక : అబుదాబి
సమయం : రాత్రి 7.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం...