Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ క్రికెటర్లను ప్రోత్సహించని మహి
- బెడిసికొట్టిన జీవితకాల వ్యూహం
దుబాయ్ (యుఏఈ)
శివం మావి, కమలేశ్ నాగర్కోటి.. కోల్కత నైట్రైడర్స్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్తో పోటీపడి ఆకట్టుకున్న యువ క్రికెటర్లు. ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్.. నిలకడ చూపించకపోయినా, కొన్ని మ్యాచుల్లోనైనా మేమున్నామంటూ అబ్బురపరిచే ప్రదర్శనలు చేశారు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలయర్స్లు ఫామ్ అందుకోవడానికి ముందు బెంగళూర్ బ్యాటింగ్ భారం మోశాడు అరంగేట్ర ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్. పంజాబ్ తరఫున యువ స్పిన్నర్ రవి బిష్ణోరు తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్వచ్ఛంగా భారత దేశవాళీ ప్రతిభపైనే భారం వేసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ ఇలా ప్రత జట్టు యువ క్రికెటర్లపై పెట్టుబడి పెట్టింది. కొన్ని జట్లు అవకాశాలు ఇవ్వకపోయినా.. ఆటగాళ్ల వేలంలో తిరిగి సొంతం చేసుకుని కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూశాయి. కానీ ఐపీఎల్లో యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వని, కుర్రాళ్లపై నమ్మకం ఉంచని ఏకైక ప్రాంఛైజీ చెన్నై సూపర్కింగ్స్!.
సీనియర్లకే ధోని ఓటు:
బయో బబుల్లో ఉండలేక ఈ సీజన్కు దూరమైన స్టార్ ఆటగాడు సురేశ్ రైనా. అతడు తప్పుకోగానే.. ఆ జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మెరుస్తాడనే అంచనాలు స్వయంగా ఆ ప్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్ వేశాడు. కరోనా కారణంగా ఆరంభ మ్యాచులకు దూరమైన రుతురాజ్కు ఆ తర్వాత సైతం ఊహించిన అవకాశాలు లభించలేదు. రెండేండ్ల పాటు చెన్నై సూపర్కింగ్స్ డ్రెస్సింగ్రూమ్లో ఉన్న రుతురాజ్ను 2020 సీజన్లో గానీ ప్రయోగించలేదు మహి. ఇక ఆ జట్టులోని మరో ఆటగాడు జగదీశణ్. అతడి పరిస్థితీ ఇదే. రెండేండ్లలో ఒక్క అవకాశమూ లభించలేదు. ఈ సీజన్లో అవకాశం ఇచ్చినా.. అతడిపై ఏమాత్రం నమ్మకం ఉంచలేదు ధోని. అన్ని జట్లు యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తూ.. ఆత్మవిశ్వాసం కల్పిస్తుండగా ధోని అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. నిజానికి ఈ సీజన్లోనే 13 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో దేశవాళీ ప్రతిభను ప్రోత్సహించిన పాపాన పోలేదు ధోని.
యువ క్రికెటర్లలో సత్తా చాటగల మెరుపు కనిపించలేదని, అందుకే వారిని తుది జట్టులోకి తీసుకోలేదని సీజన్లో ఏడో ఓటమి అనంతరం ధోని చెప్పుకొచ్చాడు. మేము కొన్ని మార్పులు చేసి చూశాం, కానీ నిజానికి అవి కోరుకోనివి. నిలకడగా మార్పులు, చేర్పులు అంత మంచివి కావు. కుర్రాళ్లు నిలదొక్కుకునేందుకు ఓ నాలుగైదు మ్యాచులు, మళ్లీ వారి స్థానంలో నిరూపించుకునే వారికి మరో 4-5 అవకాశాలు ఇస్తే.. అక్కడికే పుణ్య కాలం కాస్త గడిచిపోతుంది. ఈ సీజన్లో మాకు ఏదీ కలిసి రాలేదు. సీనియర్ క్రికెటర్లను తప్పించి యువకులను తుది జట్టులోకి తీసుకొచ్చేందుకు వారిలో ఆ మెరుపు కనిపించలేదు అని ధోని స్టార్స్సోర్ట్స్తో తెలిపాడు.
భారత జట్టులోనూ అదే ముద్ర:
భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు అత్యంత విజయవంతమైన కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, ఎం.ఎస్ ధోని. మూడు ఐసీసీ ట్రోఫీలతో (2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) ఎం.ఎస్ ధోని భారత క్రికెట్లోనే ప్రపంచ క్రికెట్లోనూ మరో కెప్టెన్కు సాధ్యపడని రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా ఎం.ఎస్ ధోని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచినా.. జట్టు నిర్మాణం పరంగా ధోనికి సున్నా మార్కులే పడతాయి. గంగూలీ యువ క్రికెటర్లను జాతీయ జట్టులోకి తీసుకొచ్చి మ్యాచ్ విన్నర్లుగా ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించాడు. అందుకే సెహ్వాగ్, యువరాజ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మ్యాచ్ విన్నర్లు ధోని జట్టులో ఉన్నారు. కానీ అదే ధోని కెప్టెన్గా విరాట్ కోహ్లికి గొప్ప యువ క్రికెటర్లను అందించలేదు. జాతీయ జట్టు కెప్టెన్గానూ ధోని ప్రతిసారీ దిగ్గజాలనే నమ్ముకున్నాడే కానీ, భవిష్యత్లో దిగ్గజం అవుతాడని ఎవరినీ ప్రోత్సహించలేదు. ఐపీఎల్లోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎం.ఎస్ ధోని. 12 సీజన్లలో 8 సార్లు ఫైనల్స్, మూడు టైటిళ్లతో ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన ఏకైక జట్టుగా చెన్నై సూపర్కింగ్స్ ది తిరుగులేని ప్రస్థానం. కానీ ఐపీఎల్ సీజన్ 13లో కుర్రాళ్లపై విశ్వాస లేమి చెన్నై రికార్డు చిరిగేలా చేసింది. ఏడు పరాజయాలతో చెన్నై సూపర్కింగ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కూ దూరమైన తొలి జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్కూ వీడ్కోలు పలికిన ఎం.ఎస్ ధోని నుంచి ఐపీఎల్లో తాలా అభిమానులు కోరుకున్న ప్రదర్శన కచ్చితంగా ఇది కాదు. కానీ కెప్టెన్గా ఎం.ఎస్ ధోని జీవిత కాలం అనుసరించిన మార్గం ఇప్పుడు తిప్పికొట్టింది ఏం చేస్తాం!.