Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్ పర్యటన అంతర్యం ఏమిటి?
- గోపీ అకాడమీపై రమణ విసుర్లు ఎందుకు?
నవతెలంగాణ-హైదరాబాద్
2016 రియో ఒలింపిక్స్లో రజత పతకంతో యావత్ దేశం దృష్టిని తనవైపునకు తిప్పుకున్న బ్యాడ్మింటన్ తార పి.వి సింధు. ఒలింపిక్స్ రజతం సహా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో వరుస రజత, స్వర్ణ పతకాలతో పి.వి సింధు అంచనాలను అందుకోవటంలో ఎన్నడూ విఫలం కాలేదు. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, వ్యక్తిగత కోచ్ కిమ్ జీ హ్యూన్ (దక్షిణ కొరియా)లు సింధు విజయాల్లో ముఖ్య భూమిక వహించారు. 2020 టోక్యో ఒలింపిక్స్కు సైతం గోపీచంద్ పర్యవేక్షణలోనే సిందు ప్రత్యేకంగా సాధన చేస్తోంది. హైదరాబాద్లోనే జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. మిగతా షట్లర్లు సారు నూతన అకాడమీలో శిక్షణ పొందుతుండగా.. సింధుకు గోపీచంద్ ప్రత్యేకంగా తన అకాడమీలోనే శిక్షణ ఇస్తున్నారు. అయినా, ఉన్నట్టుండి పది రోజుల క్రితం పి.వి సింధు హైదరాబాద్ను వీడింది. లండన్లోని గ్యాటరాడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో సింధు శిక్షణ పొందుతుంది. పి.వి సింధు హఠాత్తుగా లండన్కు వెళ్లడానికి గల కారణాలపై ఆంగ్ల పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కుటుంభ సభ్యులతో విభేదాల్లేవని సింధు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. అయితే, ఇక్కడే ఓ చిన్న తర్కం వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో సింధు ఏమైనా దాస్తోందా?అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అకాడమీపై ఆరోపణలు ఎందుకు? : హైదరాబాద్ అకాడమీలో సౌకర్యాలు, చీఫ్ కోచ్ గోపీచంద్తో ఎటువంటి ఇబ్బంది లేదని సింధు సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. కానీ అంతకుముందే సింధు తండ్రి పి.వి రమణ అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశాడు. '2018 ఆసియా క్రీడల తర్వాత సింధు కోసం కోచ్ గోపీచంద్ సమయం కేటాయించటం లేదు. హైదరాబాద్లో ఆమెకు నాణ్యమైన శిక్షణ లభించటం లేదు. సాధనలో నైపుణ్యమైన భాగస్వామిని కోచ్ ఏర్పాటు చేయటం లేదు. దీంతో సింధు విసుగు చెందింది' అని రమణ స్వయంగా వెల్లడించారు. నిజంగానే సింధు ఫిట్నెస్, న్యూట్రిషన్ కోసమే లండన్కు వెళితే.. ఆమె తండ్రి అదే విషయాన్ని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, చీఫ్ కోచ్పై, అకాడమీలో సౌకర్యాలపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా మీడియాలో విభేదాల కథనాలను తిప్పికొట్టిన సింధు.. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
అక్కడ నాణ్యమైన శిక్షణా?! : అంతర్జాతీయ బ్యాడ్మింటన్ తారలు సొంతంగా టోర్నీలకు ప్రయాణం చేస్తారు. సైనా నెహ్వాల్, పి.వి సింధులు మాత్రమే తల్లిదండ్రులతో కలిసి టోర్నీలకు వెళతారు. ఏడేండ్ల అంతర్జాతీయ కెరీర్లో పి.వి సింధు తొలిసారి తల్లిదండ్రులు లేకుండా ఓ విదేశీ పర్యటనకు వెళ్లింది. హైదరాబాద్లో శిక్షణకు నాణ్యమైన భాగస్వామి లేడని సింధు తండ్రి ఆరోపించారు. లండన్లో సింధుకు నాణ్యమైన షట్లర్స్తో సాధన చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్లో ఇంగ్లాండ్ అభివృద్ది చెందింది కానీ బ్యాడ్మింటన్లో ఇంగ్లాండ్లో చెప్పుకోదగిన షట్లర్లు లేరు. ఆది నుంచి బ్యాడ్మింటన్లో ఆసియా దేశాలతో హవా. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ నుంచి ఒక్క షట్లర్ సైతం కనీసం టాప్-20లో లేరు. అక్కడ ఆమెకు నాణ్యమైన ప్రాక్టీస్ పార్ట్నర్ లభించటం హాస్యాస్పదమే అవుతుంది.
25 ఏండ్ల పి.వి సింధు 2020 టోక్యో ఒలింపిక్స్ (2021) కోసం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ క్యాలెండర్కు మరో 3 నెలల సమయం ఉండటంతో ఫిట్నెస్, న్యూట్రిషన్పై ఫోకస్ పెట్టేందుకు ఇదే సరైన సమయం అని సింధు భావించి ఉండవచ్చు. నిజంగానే అదే కారణమైతే.. వివాదాలకు తావులేకుండా ముందే ఆ విషయాన్ని చెప్పవచ్చు. కానీ ముందు రమణ ఆరోపణలు చేయటం, వాటిని ఖండించకుండా సింధు విభేదాలు లేవని ప్రకటన చేయటంతో.. ఈ మొత్తం వ్యవహారంలో సింధు ఏమైనా దాచిపెడుతోందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి సింధునే సమాధానం చెప్పాలి!.