Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడ్నీలో కోహ్లిసేనకు క్వారంటైన్
సిడ్నీ (ఆస్ట్రేలియా)
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. భారత క్రికెట్ క్వారంటైన్కు కొన్ని వారాలుగా క్వీన్స్లాండ్ ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపిన సీఏ, ఇటీవలే న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం భారత క్రికెట్ జట్టుతో పాటు, ఆస్ట్రేలియా క్రికెటర్లు నేరుగా సిడ్నీకి చేరుకుని అక్కడే క్వారంటైన్లో ఉండేందుకు ఆ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో కోహ్లిసేన క్వారంటైన్పై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్టు అయ్యింది. న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన వివరాలను సీఏ తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపనుంది. బీసీసీఐ నుంచి గ్రీన్ సిగల్ లభించగానే పర్యటన షెడ్యూల్ను సీఏ అధికారికంగా వెల్లడించనుంది.
టెస్టులే ఆఖర్లో..! : ముసాయిదా షెడ్యూల్ ప్రకారం కొత్త ఏడాదిలో సిడ్నీ న్యూ ఇయర్ టెస్టు అనంతరం.. భారత్, ఆస్ట్రేలియాలు మూడు మ్యాచుల వన్డే సిరీస్లో పాల్గొనాలి. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో... సిరీస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్తో ఆరంభం కానుంది. సిడ్నీలో క్వారంటైన్ ముగించుకోనున్న కోహ్లిసేన అక్కడే తొలి రెండు వన్డేలు ఆడనుంది. అనంతరం కాన్బెర్రాలోని మనుక ఓవల్లో చివరి వన్డే, తొలి టీ20 జరుగనున్నాయి. చివరి రెండు టీ20లకు మళ్లీ సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనుంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ డే నైట్ గులాబీ టెస్టుతో ఆరంభం కానుంది. ఆడిలైడ్లో డిసెంబర్ 17-21న గులాబీ టెస్టు మ్యాచ్, డిసెంబర్ 26-30న బాక్సింగ్ డే టెస్టు మెల్బోర్న్లో జరుగనుంది. కరోనా నేపథ్యంలో మెల్బోర్న్లో బాక్సింగ్ డే సాధ్యపడకుంటే, ఆడిలైడ్ తొలిసారి బాక్సింగ్ డేకు వేదిక కానుంది. న్యూ ఇయర్ టెస్టు జనవరి 7-11న సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15-19న బ్రిస్బేన్లో జరుగనుంది. బీసీసీఐ సైతం అంగీకారం తెలిపితే, త్వరలోనే పర్యటన షెడ్యూల్పై అధికారిక ముద్ర పడనుంది.