Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప ఛేదనలో హైదరాబాద్ చతికిల
- పంజాబ్ ఖాతాలో మరో ఉత్కంఠ గెలుపు
దుబాయ్ (యుఏఈ)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస విజయాల మ్యాజిక్ కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ప్రతి మ్యాచ్లో నెగ్గాల్సిన స్థితిలో ఆ జట్టు అద్భుతాలు చేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్పై 126 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న పంజాబ్, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఆఖరు మూడు ఓవర్లలో అద్భుతం చేసిన పంజాబ్ 12 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. డెవిడ్ వార్నర్ (35, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), జానీ బెయిర్స్టో (19, 20 బంతుల్లో 4 ఫోర్లు), విజరు శంకర్ (26, 27 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా సన్రైజర్స్కు షాక్ తప్పలేదు. మనీశ్ పాండే (15), విజరు శంకర్ (26) క్రీజులో ఉండగా 16 ఓవర్లలో 100/3తో విజయంపై దీమాగా కనిపించిన హైదరాబాద్.. మనీశ్ పాండే నిష్క్రమణతో మ్యాచ్ను పంజాబ్కు కోల్పోయింది. 19.5 ఓవర్లలో హైదరాబాద్ 114 పరుగులకే కుప్పకూలింది. సీజన్లో ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించింది. అంతకముందు బిగ్ హిట్టర్లతో కూడిన కింగ్స్ను సన్రైజర్స్ బౌలర్లు 126 పరుగులకే పరిమితం చేశారు. వంద వికెట్ల క్లబ్లో చేరిన సందీప్ శర్మ (2/29), జేసన్ హౌల్డర్ (2/27), స్పిన్నర్ రషీద్ ఖాన్ (2/14) నిప్పులు చెరగటంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. విధ్వంసకారుడు నికోలస్ పూరన్ (32 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా క్రీజులో నిలిచినా.. ఏం చేయలేకపోయాడు.
పక్కా వ్యూహంతో...! : బిగ్ హిట్టర్లతో కూడిన పంజాబ్పై హైదరాబాద్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. సూపర్ ఫామ్లో ఉన్న కెఎల్ రాహుల్ (27, 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)ను స్పిన్ గన్ రషీద్ ఖాన్తో సాగనంపిన వార్నర్.. ప్రమాదకర క్రిస్ గేల్ (20, 20 బంతుల్లో 2 ఫోర్ల, 1 సిక్స్)కు జేసన్ హౌల్డర్తో చెక్ పెట్టాడు. తండ్రి మరణాన్ని దిగమింగి నేడు బరిలోకి దిగిన మన్దీప్ సింగ్ (17, 14 బంతుల్లో 1 ఫోర్) వికెట్తో వంద వికెట్ల క్లబ్లో అడుగుపెట్టిన సందీప్ శర్మ.. అదే ఉత్సాహంలో గ్లెన్ మాక్స్వెల్నూ వెనక్కి పంపాడు. వరుస బంతుల్లో క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ను గ్లెన్ మాక్స్వెల్ (12) మరోసారి నిరాశపరిచాడు. సందీప్ శర్మ ఓవర్లో మాక్స్వెల్ పెవిలియన్కు చేరుకున్నాడు. నం.4 బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ (32 నాటౌట్) ఓ ఎండ్లో మౌనంగా ఉండిపోయాడు. ఆఖరు బంతి వరకు అతడు క్రీజులో నిలిచినా.. స్వేచ్ఛగా బ్యాటు ఝులిపించే అవకాశం సన్రైజర్స్ బౌలర్లు ఇవ్వలేదు. దీపక్ హుడా (0), క్రిస్ జోర్డాన్ (7)లు వెన్వెంటనే పెవిలియన్కు చేరుకున్నారు. బౌలర్లు చెలరేగిన పిచ్పై పంజాబ్ 126 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, సందీప్ శర్మ, జేసన్ హౌల్డర్లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ ఇన్నింగ్స్ : 126/7 ( నికోలస్ పూరన్ 32 నాటౌట్, రాహుల్ 27, రషీద్ ఖాన్ 2/14, సందీప్ శర్మ 2/29)
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 114/10 (డెవిడ్ వార్నర్ 35, విజయ్ శంకర్ 26, క్రిస్ జోర్డాన్ 3/17, అర్షదీప్ సింగ్ 2/23).