Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ కు వన్డే, టీ20 వైస్ కెప్టెన్సీ
- టెస్టు జట్టులో పృథ్వీ, రాహుల్, గిల్
- గాయంతో రోహిత్, ఇషాంత్ అవుట్
- టెస్టు జట్టులో మహ్మద్ సిరాజ్కు చోటు
- ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్ల ప్రకటన
కెఎల్ రాహుల్. భారత భవిష్యత్ కెప్టెన్గా దిగ్గజాల కితాబు అందుకుంటున్న కన్నడ క్రికెటర్. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్ జాతీయ జట్టు నాయకత్వం దిశగా తొలి అడుగు వేశాడు. గాయంతో రోహిత్ శర్మ అందుబాటులో లేని వేళ విరాట్ కోహ్లి డిప్యూటీ బాధ్యతలు సెలక్షన్ కమిటీ కెఎల్ రాహుల్కు అప్పగించింది. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనతో కోల్పోయిన టెస్టు జట్టులో చోటు.. తాజాగా తిరిగి సాధించాడు. టెస్టు జట్టులో పృథ్వీ షా, రాహుల్, శుభ్మన్ గిల్లు నిలువగా.. ఐదు రోజుల ఫార్మాట్లో హార్దిక్ పాండ్యకు చోటు దక్కలేదు.
ముంబయి : సునీల్ జోషి సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ తొలి సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొంది. స్టార్ ఇమేజ్ క్రికెటర్లతో జాతీయ జట్టును నింపకుండా... ప్రస్తుతం ఫామ్లో ఉన్న క్రికెటర్లను అవకాశం ఇచ్చేందుకు ఓ మంచి ప్రయత్నం చేసింది. భారత క్రికెట్ జట్టు నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ నవంబర్ 26 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు సహా నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. సోమవారం సమావేశమైన సెలక్షన్ కమిటీ ఆసీస్ పర్యటనకు వెళ్లనున్న మూడు జట్లను ఎంపిక చేసింది. సమృద్దిగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు వన్డే, టీ20 జట్టు నుంచి ఉద్వాసన పలికారు. ఐపీఎల్లో మెరిసిన సంజు శాంసన్కు సెలక్షన్ కమిటీ పట్టం కట్టింది. కెఎల్ రాహుల్ తోడుగా టీ20 ఫార్మాట్లో వికెట్ కీపర్గా ఎంపిక చేసింది. హిట్మ్యాన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్కు తోడు గాయంతో ఐపీఎల్కు దూరమైన ఇషాంత్ శర్మను సైతం సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. నవంబర్ 10న ఐపీఎల్ 2020 ఫైనల్స్ ముగియగానే భారత క్రికెటర్లు నేరుగా దుబారు నుంచి సిడ్నీకి బయల్దేరనున్నారు. హైదరాబాదీ పేసర్, ఐపీఎల్లో అదరగొడుతున్న మహ్మద్ సిరాజ్కు టెస్టు జట్టులో చోటు లభించింది.
ముగ్గురికీ ఛాన్స్ : ఉపఖండపు పిచ్లపై ఓపెనర్గా హిట్ కొట్టిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ పర్యటనలో ఆడలేదు. పృథ్వీ షా గాయంతో రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ ఓపెనర్గా కుదురుకున్నాడు. మూడో ఓపెనర్ బెర్త్ కోసం కెఎల్ రాహుల్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్లు పోటీపడుతుండగా.. రోహిత్ శర్మకు గాయం కారణంగా ముగ్గురికీ టెస్టు జట్టులో చోటు దక్కింది. సెంచరీతో అరంగేట్రం చేసిన పృథ్వీ షా, నిలకడగా రాణిస్తున్న శుభ్మన్ గిల్లు జట్టులో నిలిచారు. కెఎల్ రాహుల్ 2019 వెస్టిండీస్ పర్యటనలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 101 పరుగులే చేశాడు. శుభ్మన్ గిల్ భారత్-ఏ జట్టు తరఫున నాణ్యమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ముగ్గురు టెస్టు జట్టులో నిలవటంతో ఇక తుది జట్టులో చోటుపై ఉత్కంఠ రేగనుంది!. ఇక శస్త్రచికిత్స అనంతరం నేరుగా ఐపీఎల్లో ఆడుతున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పాత్రపైనా సెలక్షన్ కమిటీ చర్చించనుంది. సర్జరీ అనంతరం పాండ్య ఇప్పటివరకూ బౌలింగ్ వేయనేలేదు. ఐపీఎల్లో ముంబయి తరఫున స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గానే ఆడుతున్నాడు. సర్జరీ దృష్ట్యా బౌలింగ్ చేయాలనే ఆత్రుత చూపించటం సరికాదని ఆ జట్టు బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అన్నాడు. ఐదో బౌలర్గా కెప్టెన్కు అక్కరకు రాని హార్దిక్ పాండ్యను టెస్టు జట్టులో ఆల్రౌండర్ కోటాలో ఆడించేందుకు సెలక్షన్ కమిటీ సుముఖత వ్యక్తం చేయలేదు.
మెరుపులకు పట్టం : యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో నిలిచినా.. వన్డే, టీ20ల్లో చోటు గల్లంతు చేసుకున్నాడు. కెఎల్ రాహుల్, సంజు శాంసన్లు పంత్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్ వన్డే, టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. శుభ్మన్ గిల్ వన్డే జట్టులోనూ నిలువగా.. శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండేలు తమ స్థానాలు నిలుపుకున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా నాయకత్వంలో వాషింగ్టన్ సుందర్, చాహల్, జడేజా, మహ్మద్ షమి, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్లు వన్డే, టీ20ల్లో ఆడనున్నారు. ఐపీఎల్లో కోల్కత తరఫున మాయజాలం ప్రదర్శిస్తున్న తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి టీ20 జట్టులో చోటు దక్కింది.
రోహిత్, ఇషాంత్ అన్ ఫిట్ : గాయంతో ఐపీఎల్కు దూరమైన టీమ్ ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్పై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సెలక్షన్ కమిటీకి నివేదిక అందజేసింది. యుఏఈ నుంచి నేరుగా బెంగళూర్కు చేరుకున్నాడు. నవంబర్ 18 నుంచి ఇషాంత్ శర్మ బౌలింగ్ సాధన చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐకి పంపిన నివేదికలో తెలిపినట్టు సమాచారం. తొడ కండరాల గాయంతో ముంబయి ఇండియన్స్ చివరి రెండు లీగ్ మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ సైతం ఆసీస్ పర్యటనకు ఎంపిక కాలేదు. బీసీసీఐ వైద్య బృందం ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మల ఫిట్నెస్ను పర్యవేక్షించనుంది. ఫిట్నెస్ సాధించారని భావిస్తే, సిరీస్ మద్యలోనైనా ఈ ఇద్దరిని జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్లు;
టెస్టు జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్మన్ గిలన, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్.
వన్డే జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, షార్దుల్ ఠాకూర్.
టీ20 జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండే, హర్దిక్ పాండ్య, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి.
అదనపు బౌలర్లు : కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, టి. నటరాజన్.