Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్ దీప్, గేల్ అర్థ సెంచరీలు
- కోల్ కతపై కింగ్స్ అలవోక విజయం
షార్జా (యుఏఈ)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాంచ్ పటాకా. చావోరేవో పరిస్థితుల్లో ఆ జట్టు వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. 150 పరుగుల ఛేదనలో ఆ జట్టు చెలరేగింది. మన్ దీప్ సింగ్ (66 నాటౌట్, 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), క్రిస్ గేల్ (51, 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి జోరుతో పంజాబ్ 8 వికెట్ల తేడాతో 18.5 ఓవర్లలో గెలుపొందింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ (28, 25 బంతుల్లో 4 ఫోర్లు) మెరిశాడు. అంతకముందు, మహ్మద్ షమి (3/35) షార్జాలో కొత్త బంతితో కోల్కత నైట్రైడర్స్ టాప్ ఆర్డర్ను కకావికలం చేసి ఆ జట్టు భారీ స్కోరు ఆశలను ఆవిరి చేశాడు. ఒకే ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7), దినేశ్ కార్తీక్ (0)లను అవుట్ చేసిన షమి కోల్కతను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ (57, 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40, 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు)లు రాణించారు. ఈ ఇద్దరూ నాల్గో వికెట్కు 81 పరుగులు జోడించారు. మిడిల్, డెత్ ఓవర్లలో పట్టు సాధించిన బౌలర్లు కోల్కతను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.
లెగ్ స్పిన్నర్లు వీర లెవల్! : 10/3తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కోల్కత అనూహ్యంగా ఎదురుదాడి చేసింది. రెండు వికెట్లతో జోరుమీదున్న మహ్మద్ షమినే అందుకు ఎంచుకుని మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేసి కొంతమేరకు సఫలమైంది. మహ్మద్ షమి మూడో ఓవర్లో మోర్గాన్ రెండు ఫోర్లు బాదగా.. శుభ్మన్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన లెగ్ స్పిన్నర్లు మురుగన్ అశ్విన్, రవి బిష్ణోరులకు ఈ జోడీ అదే రీతిలో స్వాగతం పలికింది. లెగ్ స్పిన్పై 9 బంతుల్లోనే ఈ జోడీ 22 పరుగులు పిండుకుంది. దీంతో కోల్కత భారీ స్కోరు దిశగా సాగింది. కానీ రవి బిష్ణోరు ఓవర్లో భారీ షాట్ ఆడిన మోర్గాన్ బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్ అయ్యాడు. అక్కడితో కోల్కత ఇన్నింగ్స్ మళ్లీ నత్తనడకన సాగింది. మోర్గాన్ తోడుగా భారీ సిక్సర్లు కొట్టిన గిల్.. అనంతరం నెమ్మదించాడు. క్రిస్ జోర్డార్, రవి బిష్ణోరు రెండేసి వికెట్లతో రాణించారు. సునీల్ నరైన్ (6), పాట్ కమిన్స్ (1) తేలిపోగా.. లాకీ ఫెర్గుసన్ (24 నాటౌట్, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కోల్కతను 150 పరుగుల మార్క్కు చేరువగా తీసుకొచ్చాడు.