Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో ఆసీస్ పర్యటనకు దూరం
- మరోవైపు ముంబయి నెట్స్లో సాధన
- విచిత్ర పరిస్థితిపై సోషల్ మీడియాలో విమర్శలు
టెస్టుల్లో ఓపెనర్గా నిలదొక్కుకున్నాడు. ఐదు రోజుల ఆటలోనూ అతడు ఇప్పుడు కీలకమే. వన్డే, టీ20ల్లో అతడి విలువను లెక్కగట్టేందుకు కొలమానాలు సరిపోవు. అతడే హిట్మ్యాన్ రోహిత్ శర్మ. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్కు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ గాయంతో రెండు మ్యాచులకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ దూరమని సెలక్షన్ కమిటీ ప్రకటించిన గంటలోపే.. అబుదాబిలో రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటం విమర్శలకు తావిస్తోంది. అసలు రోహిత్ శర్మకు ఏమైంది?!
నవతెలంగాణ-హైదరాబాద్
భారత వన్డే, టీ20 వైస్ కెప్టెన్, టెస్టు ఓపెనర్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఆడే భారత జట్లను సునీల్ జోషి సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు ఐపీఎల్లో గాయపడ్డారు. దుబారు నుంచి నేరుగా బెంగళూర్కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఈ ఇద్దరు పేసర్లను సైతం సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మను సైతం సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. గాయంతో ఆసీస్ టూర్కు దూరమైన భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ విషయంలో ఎటువంటి పేచీ లేకపోయినా.. రోహిత్ శర్మ విషయంలోనే బీసీసీఐ పారదర్శకత పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాయం ఎలా అయ్యింది : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎడమ కాలి తొడ కండరం గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్లో తొలి సూపర్ ఓవర్లో డికాక్ తోడుగా మహ్మద్ షమి యార్కర్లను ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. ఆఖరు బంతికి గాయానికి గురయ్యాడు. అందుకే చివరి బంతికి రెండో పరుగు తీయటంలో ఇబ్బంది పడ్డాడు.. ఆ బంతి తర్వాతి నుంచి రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి రాలేదు. కీరన్ పొలార్డ్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా.. వరుసగా చెన్నై, రాజస్థాన్ మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు.
బీసీసీఐ, ప్రాంఛైజీ పట్టు : రోహిత్ శర్మ గాయం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీలు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనలో పిక్క గాయంతో రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే కాలికి తొడ కండరం గాయమైంది. జాతీయ జట్టుకు రోహిత్ శర్మ సేవలు అత్యంత కీలకం. దీంతో ఐపీఎల్లో తదుపరి మ్యాచుల్లో రోహిత్ శర్మను బరిలోకి దింపవద్దని బోర్డు సూచించినట్టు తెలుస్తోంది. కానీ దిగ్గజ ఆటగాడి సేవలను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ముంబయి మొగ్గుచూపుతోంది. రోహిత్ శర్మ లేకుంటే మైదానంలో ప్రత్యర్థులకు మానసికంగా పైచేయి ఉంటుంది. ఆ అనుకూలత ఇవ్వడానికి ముంబయి సిద్దంగా లేదు. కానీ జాతీయ జట్టు ప్రయోజనాలు ముందుకొచ్చినప్పుడు ఐపీఎల్ ప్రాంఛైజీ రాజీ పడక తప్పదు. కానీ ముంబయి ఇక్కడ భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
అదేంటీ.. ఆడుతున్నాడే?! : రోహిత్ శర్మ గాయం విషయంలో బీసీసీఐ పారదర్శకత పాటించలేదని మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ' బీసీసీఐ వైద్య బృందం రోహిత్ ఫిట్నెస్ను పర్యవేక్షిస్తుందని' ఏక వ్యాఖ్య ప్రకటన చేసింది. ' రోహిత్ శర్మకు ఎటువంటి గాయం అయ్యిందనే విషయంలో కొంత పారదర్శకత, కొంత ఓపెన్నెస్ ఉంటే అందరికీ బాగుండేది. ఎందుకంటే రోహిత్కు ఏమైందో తెలుసుకునే హక్కు భారత క్రికెట్ అభిమానులకు ఉంది' అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన గంట వ్యవధిలోనే అబుదాబిలో ముంబయి ఇండియన్స్ నెట్ నెషన్లో రోహిత్ శర్మ ప్రత్యక్షమయ్యాడు. ఫుల్ స్వింగ్తో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడని ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియాలో తెలిపింది. లీగ్ దశ మ్యాచులకు దూరమైనా.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో రోహిత్ శర్మ ఆడతాడని ప్రాంఛైజీ అనుకుంటోంది. నవంబర్ తొలి వారంలో ఆడనున్న రోహిత్ శర్మ.. నవంబర్ చివరి వారంలో జరుగనున్న మ్యాచ్కు గాయంతో దూరం కావటం ఏమిటనే ప్రశ్న అభిమానులను తొలిచివేస్తోంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే.. అతడిని నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా రోహిత్ శర్మ గాయం విషయంలో బీసీసీఐ పారదర్శకత పాటించి ఉండాల్సింది.