Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25,000 మంది హాజరుకు అవకాశం
- ఆడిలైడ్ లో గులాబీ టెస్టు మ్యాచ్
- న్యూ ఇయర్లో సిడ్నీ, గబ్బా టెస్టులు
- భారత్, ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ విడుదల
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, క్రికెట్ స్టేడియాలకు దూరమైన అభిమానులు అతి త్వరలోనే మళ్లీ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు మైదానాలకు తిరిగి రానున్నారు. భారత్, ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులకు స్టేడియంలో అనుమతి ఇవ్వనున్నారు. మెల్బోర్న్లో 25,000 మంది అభిమానులతో బాక్సింగ్ డే సమరానికి క్రికెట్ ఆస్ట్రేలియా రంగం సిద్ధం చేస్తోంది.
కాన్బెర్రా (ఆస్ట్రేలియా)
ప్రపంచ క్రికెట్ అభిమానులకు క్రికెట్ ఆస్ట్రేలియా తీపి కబురు చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుకు అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. క్వీన్స్లాండ్ ప్రభుత్వంతో చర్చల వైఫల్యం అనంతరం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వంతో మంతనాలు జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సిడ్నీలో ఇరు జట్ల క్వారంటైన్, ప్రాక్టీస్ సెషన్కు ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనల కారణంగా సిరీస్ షెడ్యూల్ ప్రకటనకు ఎన్నో దశలను దాటుకుని, ఎట్టకేలకు పర్యటన వివరాలను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 27న సిడ్నీలో తొలి వన్డేతో ఆరంభం కానున్న ఆసీస్ టూర్.. జనవరి 19న గబ్బా టెస్టు చివరి రోజుతో ముగియనుంది.
రెండు ప్రాక్టీస్ మ్యాచులు : టీమ్ ఇండియా విదేశీ గడ్డపై తొలి డే నైట్ టెస్టు ఆడనుంది. ఆడిలైడ్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ టెస్టు మ్యాచ్కు కోహ్లిసేన సిద్ధం కానుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్కు ముందు కోహ్లిసేన రెండు బంతులతో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. తొలుత రెడ్ బాల్తో వార్మప్ ఆడనుండగా..తర్వాత గులాబీ బంతితో మరో వార్మప్ ఆడనున్నారు. భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య ఈ వార్మప్ మ్యాచులు జరుగనున్నాయి.
అభిమానులకు అనుమతి : భారత్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుతో క్రికెట్ మైదానాలకు అభిమానులు తిరిగి రానున్నారు. మెల్బోర్న్లో అభిమానుల ప్రవేశానికి క్రికెట్ ఆస్ట్రేలియా విక్టోరియా ప్రభుత్వంతో క్రీయాశీల చర్చలు జరుపుతోంది. ' విక్టోరియా ప్రభుత్వం, క్రికెట్ ఆస్ట్రేలియాలు అత్యాధునిక కోవిడ్ నివారణ ప్రణాళికలను అమలు చేసి, అభిమానులు హాజరయ్యేలా చూస్తాయి. మ్యాచ్కు ముందు ఎంత మందికి అనుమతించాలనే విషయంపై స్పష్టత రానుంది. 25 వేల మంది అభిమానుల ప్రవేశానికి అనుమతి లభించవచ్చు' అని విక్టోరియా క్రీడా మంత్రి మార్టిన్ పకులా తెలిపారు.
భార్యలకు అనుమతిపై త్వరలో నిర్ణయం! : బయో సెక్యూర్ బబుల్లో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా సిరీస్కు క్రికెటర్ల కుటుంబాలను అనుమతించటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)లు ఈ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా, బయో ప్రోటోకాల్ సహా ఇతర అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ బయో బబుల్కు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న క్రికెటర్లు.. మరో మూడు నెలలు బయో బబుల్లో భార్యలకు దూరంగా ఉండాల్సి వస్తే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు బయో బబుల్లో కుటుంబ సభ్యులను అనుమతించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే : నవంబర్ 27, సిడ్నీ
రెండో వన్డే : నవంబర్ 29, సిడ్నీ
మూడో వన్డే : డిసెంబర్ 2, కాన్బెర్రా
తొలి టీ20 : డిసెంబర్ 4, కాన్బెర్రా
రెండో టీ20 : డిసెంబర్ 6, సిడ్నీ
మూడో టీ20 : డిసెంబర్ 8, సిడ్నీ
తొలి టెస్టు : డిసెంబర్ 17-21, ఆడిలైడ్
రెండో టెస్టు : డిసెంబర్ 26-30, మెల్బోర్న్
మూడో టెస్టు : జనవరి 7-11, సిడ్నీ
నాల్గో టెస్టు : జనవరి 15-19, బ్రిస్బేన్