Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డర్ గవాస్కర్ సిరీస్పై ఇయాన్ చాపెల్
- విరాట్ కోహ్లి లేకపోవటం పెద్ద లోటు
- అయినా, ఓ కుర్రాడికి ఇదో గొప్ప అవకాశం
భారత్, ఆస్ట్రేలియాలు ముఖాముఖి సమరం వారంలోకి అడుగుపెట్టాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రమాద ఘంటికలు ఓ వైపు భయపెడుతూనే ఉన్నప్పటికీ.. బయో సెక్యూర్ బబుల్లో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు జోరుగా సాధన చేస్తున్నారు. ఐపీఎల్ ఫామ్లో ఉన్న ఇరు జట్ల క్రికెటర్లకు తొలుత వన్డే, టీ20 సిరీస్లు పెద్ద సవాల్ విసరబోవు. ధనాధన్ ఉత్సాహంలో ఉన్న క్రికెటర్లు ఈ రెండు సిరీస్లను ఆడుతూ పాడుతూ ముగించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఫలితమే, ముందు రాబోయే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ పాయింట్ల పద్దతిలో మార్పులొచ్చిన తరుణంలో అగ్ర జట్లు తలపడే సిరీస్పై అందరి చూపులు నెలకొన్నాయి. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో విజయాన్ని శాసించే అంశాలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
71 ఏండ్ల భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియాకు ఎన్నడూ సాధ్యపడలేదు. సిరీస్లను డ్రా చేసుకోవడమే గొప్ప విజయం అనే పరిస్థితి. ఆధునిక క్రికెట్లో టీమ్ ఇండియా ప్రపంచ అగ్రగామిగా ఎదిగినా, కంగారూ నేలపై టెస్టు సిరీస్ లేని లోటు అలాగే మిగిలిపోయింది. గత పర్యటనలో విరాట్ కోహ్లి బృందం ఆ లోటును భర్తీ చేసింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించి 2-1తో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించింది. కేప్టౌన్ బాల్ టాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్లు లేని బలహీన ఆస్ట్రేలియాను భారత్ ఓడించిందనే విమర్శ గట్టిగా ఉంది. గత పర్యటనలో 71 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన కోహ్లిసేన.. తాజా సిరీస్లో వరుస సిరీస్ విజయంతో విమర్శకుల నోటికీ తాళం వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లి తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండటం పర్యాటక టీమ్ ఇండియాకు అతిపెద్ద ప్రతికూలాంశం. అయినా, భారత జట్టు సిరీస్ నిలుపుకునేందుకు తగిన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. డిసెంబర్ 17న ఆడిలైడ్లో డే నైట్ గులాబీ బంతితో తొలి టెస్టు ఆరంభం కానుంది. టెస్టు సిరీస్ను శాసించనున్న పలు అంశాలపై ఇయాన్ చాపెల్ ఓ వ్యాసంలో ఇలా రాసుకొచ్చాడు...!
భారత్ కు ప్రయోజనం : ఈ ఏడాది వేసవి అల్లకల్లోలం. మహమ్మారి ప్రభావిత క్రికెట్ ఆస్ట్రేలియా.. భారత్తో సిరీస్ షెడ్యూల్ పర్యాటక జట్టుకే ఉపయుక్తంగా ఉంది. గత సిరీస్ విజయాన్ని పునరావృతం చేయాలనే టీమ్ ఇండియా తపనకు సిరీస్ షెడ్యూల్ అనుకూలంగా ఉంది. క్వారంటైన్లోనూ సాధనకు అనుమతులు లభించటంతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ ఇండియాకు మరింత ప్రాక్టీస్ దక్కనుంది. లాక్డౌన్లో భారత క్రికెటర్లకు సాధన చేసుకునే అనుమతి ఉంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పిచ్లపై ఏ లెంగ్త్లలో బంతులే వేయాలనే అంశంపై వారు కసరత్తు చేసే ఉంటారు. అలాగే బ్యాట్స్మెన్ సైతం అసహజ బౌన్స్కు ఏ విధంగా బదులివ్వాలనే కోణంలో సాధన చేసే ఉంటారు. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో షార్ట్ పిచ్లకు వికెట్ కాపాడుకుంటే సరిపోదు, ఆ బంతులకు పరుగులు సైతం చేయాలి. షార్ట్ బంతులకు ఓ బ్యాట్స్మెన్ పరుగులు చేయనంత వరకు, అతడిపై బౌలర్లు అదే అస్త్రంతో దాడి చేస్తూనే ఉంటారు. నిలకడగా షార్ట్ బంతులు ఎదుర్కొనే బ్యాట్స్మన్, తన ఫుట్వర్క్లో అనిశ్చితి చవిచూస్తాడు. అదే షార్ట్ బంతులకు బ్యాట్స్మన్ బాగా స్పందిస్తే.. బౌలర్లు వెంటనే ఫుల్ లెంగ్త్ బంతులకు వెళ్లిపోతారు. ఆ బంతులకు పరుగులు చేయటం బ్యాట్స్మన్కు చాలా తేలికైన పని.
ఎంపికే అసలు రహస్యం : బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు భారత సెలక్టర్లు ఎంపిక చేసిన బృందం సిడ్నీ లాక్డౌన్ సమయంలో బౌన్సీ పిచ్లపై బౌన్సర్లను ఎదుర్కొనేందుకు అదనపు, కొత్త తరహా నైపుణ్యం అందిపుచ్చుకు నేందుకు ప్రయత్నం చేయాలి. అలాకాకుండా, ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవంతో లేనిపోని అపోహలకు లోనుకాకూడదు. ఇక్కడ గత వేసవి సీజన్లో జో బర్న్స్, విల్ పొవొస్కిలు చాలా చక్కటి ప్రదర్శన చేశారు. అటువంటి భాగస్వామ్యాలు చాలా కీలకం. వాటిని ఏమాత్రం తక్కువ చేసి చూడకూడదు. ఇదే సమయంలో ఓ భాగ స్వామ్యంపై ఎక్కువగా విలువ కట్టకూడదు.
మానసికంగా సమస్యలు చవి చూస్తున్న బర్న్స్ స్థానంలో పొవొస్కిని ఆసీస్ టెస్టు సిరీస్లో ప్రయోగించాలి. అప్పుడు మార్నస్ లబుషేన్, కామరూన్ గ్రీన్ తరహాలో అతడూ కొత్త ఆయుధం అవుతాడు. భారత్కు సైతం విరాట్ కోహ్లి వెళ్లిపోగానే సెలక్షన్ సమస్యలు తెలెత్తుతాయి. విరాట్ కోహ్లి లేకపోవటంతో భారత బ్యాటింగ్ లైనప్లో పెద్ద లోటు ఏర్పడనుంది. అది మరో యువ ఆటగాడికి లభించిన చక్కటి అవకాశంగా సైతం చూడాలి. భారత్, ఆస్ట్రేలియాలు ఇప్పటికే ఎంపికలో సగం పని పూర్తి చేసుకున్నాయి. బోర్డర్-గవాస్కర్ సిరీస్ను సొంతం చేసుకునేందుకు అది సరిపోదు. ఇరు జట్లకూ సమాన అవకాశాలు ఉన్న సిరీస్లో తుది జట్టు ఎంపికలో తెలివిగా వ్యవహరించిన జట్టునే విజయం వరించనుంది.