Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రెండు టెస్టులకు రోహిత్, ఇషాంత్ దూరం
- వచ్చే ఏడాదిలోనే ఈ ఇద్దరికీ ఆడే అవకాశం
బెంగళూర్ (కర్నాటక)
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు పర్యాటక టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ. సూపర్స్టార్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఆడిలైడ్ లో తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రానున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి లేని లోటును ఏ విధంగా భర్తీ చేయాలని ఇప్పటికే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతుంటే.. వారిపై మరో పిడుగు పడింది!. ఐపీఎల్లో గాయపడి బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్లో కొనసాగుతున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. పొత్తికడుపు కండరాల గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో నెట్స్లో బౌలింగ్ సాధన చేస్తున్నాడు. ఎడమ కాలి తొడ కండరం గాయం నుంచి పూర్తి ఫిట్నెస్ కోసం రోహిత్ శర్మ కష్టపడుతున్నాడు. వన్డే, టీ20 సిరీస్ ముగిసేలోపే ఈ ఇద్దరు సిడ్నీకి చేరుకుంటారని తొలుత అనుకున్నారు. కానీ, బీసీసీఐ నిర్ణయంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ వచ్చే ఏడాదే మైదానంలో అడుగుపెట్టనున్నారు.
ఐపీఎల్ నుంచి నేరుగా సిడ్నీకి చేరుకున్న భారత క్రికెటర్లకు క్వారంటైన్లో సాధన చేసే వెసులుబాటు దక్కింది. ఐపీఎల్లో క్రికెటర్లు బయో సెక్యూర్ బబుల్లో గడిపారు, అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన ఆంక్షలు తొలగించింది. కానీ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు బెంగళూర్లో బయో బబుల్లో సాధన చేయటం లేదు. దీంతో వారు తొలుత సిడ్నీకి చేరుకోగానే కఠినమైన 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అప్పుడే భారత్, ఆస్ట్రేలియా బయో సెక్యూర్ బబుల్లోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఉండనుంది. రానున్న 3-4 రోజుల్లో రోహిత్, ఇషాంత్ ఆసీస్కు చేరకుంటే.. తొలి టెస్టులో ఆడే అవకాశం కోల్పోతారని చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటిస్తున్న భారత క్రికెట్ బోర్డు.. డిసెంబర్ తొలి వారం తర్వాతే రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలను ఆస్ట్రేలియాకు పంపించనున్నట్టు తెలుస్తోంది. తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పేస్ విభాగంలో ఇప్పటికే జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనిలు అందుబాటులో ఉన్నప్పటికీ.. గత పర్యటనలో చారిత్రక విజయంలో ముఖ్య భూమిక వహించిన ఇషాంత్ శర్మ సేవలు కోల్పోవటం భారత జట్టుకు ప్రతికూలమే.