Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ లైవ్స్ మ్యాటర్కు దూరంగా బీసీసీఐ
- వివక్షకు వ్యతిరేకంగా క్రికెట్ బోర్డుల ఏకం!
'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' కరోనా మహమ్మారి పడగ నీడలోనూ ప్రపంచాన్ని కుదిపేసింది. వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో వీధుల్లో నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. బయో బబుల్లో క్రికెట్ పున ప్రారంభంతో.. అక్కడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కనిపించింది. భావి తరాలైనా వివక్ష రహిత సమాజం చూడాలనే గొప్ప సంకల్పంతో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ను సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు తోడ్పడే సాధనంగా భావిస్తున్నారు. అందులో భాగంగా, క్రికెటర్లు అందరం సమానమనే నినాదాన్ని బలంగా వినిపిపించేందుకు నడుం బిగించారు. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ విషయంలో నిస్తేజంగా ఉంది. వివక్షపై గళమెత్తేందుకు బీసీసీఐ ఎందుకు సంకోచిస్తోంది?!
శ్రీనివాస్ దాస్ మంతటి
భారత్, ఆస్ట్రేలియా సిరీస్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం సిడ్నీలో కోహ్లిసేనతో కంగారూలు తలపడనున్నారు. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది అందరూ బూట్లు లేకుండా మైదానంలోకి రానున్నారు. క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది అందరూ ఓ వలయంలో నిల్చోని.. ఆస్ట్రేలియా ఆదిమ జాతులు, తొలి తరం కంగారూ ప్రజలను గుర్తు చేసుకోనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీస్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నినాదంతో క్రికెటర్లు మోకాలిపై కూర్చున్నారు. త్వరలో ఆరంభం కానున్న వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్లోనూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్కు మద్దతు కొనసాగనుంది!. ప్రతి క్రికెట్ బోర్డు జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ముందుకొచ్చాయి. ధనిక క్రికెట్ బోర్డు,
వంద కోట్ల భారత్ను ప్రభావితం చేయగల సూపర్స్టార్స్ను కలిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాతి వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు ముందుకు రావటం లేదు.
ఐపీఎల్లోనూ అదే ఒరవడి : కరోనా మహమ్మారిలో వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీస్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వార్తల్లో నిలిచింది. నల్ల జాతీయులపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్కు మద్దతు ఇవ్వాలని క్రికెటర్లు కోరారు. కానీ సెప్టెంబర్ 19న ఆరంభమైన ఐపీఎల్ 2020 బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్రస్తావన లేకుండానే నవంబర్ 10న ముగిసింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 21 బంతుల్లో 60 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య అర్థ సెంచరీ అనంతరం, మోకాలిపై కూర్చోని పిడికిలి బిగించాడు. డగౌట్లో కూర్చున్న ముంబయి ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ సైతం పిడికిలి బిగించాడు. ఐపీఎల్లో అయినా, భారత క్రికెట్లోనైనా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కనిపించిన తొలి సన్నివేశం అదే. హార్దిక్ పాండ్యతోనే ఆ మద్దతు మొదలై, అతడితోనే ముగిసిపోయింది.
సొంత సమస్యలైనా పట్టవా?! : ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాన్ని సొంతం చేసుకుంది. వెస్టిండీస్తో మొదలుకుని అన్ని సిరీస్ల్లో మద్దతు తెలిపింది. ఐపీఎల్కు ముందు ఇంగ్లాండ్తో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం బ్లాక్ లైవ్స్ మ్యాటర్కు మద్దతుగా మోకాలిపై కూర్చోలేదు. అప్పట్లో ఆసీస్ క్రికెటర్ల వ్యవహారంపై చర్చ నడిచింది. కానీ కంగారూ క్రికెటర్లు భిన్నంగా ఆలోచన చేశారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు, జాతి వివక్షకు నిరసన తెలపటం ఇంటి నుంచే ఆరంభం కావాలని అనుకున్నారు. అందుకోసం ఆస్ట్రేలియా ఆదిమ జాతులకు గుర్తుగా జాతీయ జట్టు జెర్సీని రూపొందించారు. ఆదిమ గిరిజన జాతులకు గౌరవ సూచకంగా ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బూట్లు లేకుండా వలయాకారంలో నిల్చోనుంది. దీంతో ఆస్ట్రేలియాలోని ఆదిమ జాతులను గౌరవించటంతో పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా గళం వినిపించినట్టు అవుతుందని ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ తెలిపాడు. భారత్తో వన్డే సిరీస్ మొదలుకుని ప్రతి సిరీస్ ఆరంభంలో ఆస్ట్రేలియా ఈ సంప్రదాయాన్ని పాటించనుంది.
రాజకీయ కారణాలున్నాయా? : బ్లాక్ లైవ్స్ మ్యాటర్కు మద్దతు తెలపటం, సొంత దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షపై గళం విప్పటం ఇలా ఈ రెండు అంశాలను బీసీసీఐ పక్కనపెట్టింది. భారత్లో కుల వివక్ష వికృత రూపాలు ఇటీవల కాలంలో అమానుష సంఘటలకు దారితీస్తున్నాయి. అమెరికాలో నల్ల జాతీయులపై జరిగిన, జరుగుతున్న దాడుల కంటే దారుణమైన, ప్రమాదకర దాడులు ఇక్కడ బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలపై జరుగుతున్నాయి. వివక్షకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు కనిపించటం లేదు. అందుకే సమాజంలో మార్పు తీసుకురావటం, ఆలోచనల్లో మార్పుతోనే వివక్షను రూపుమాపవ చ్చని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చూస్తున్నాం. భారత ప్రజలను ఏకం చేయగల శక్తి కలిగిన అరుదైన అయుధం క్రికెట్. వివక్షకు వ్యతిరేకంగా భారత క్రికెటర్లు ప్రచారం చేస్తే, కచ్చితంగా మార్పు కనిపించే అవకాశం ఉంది. అయినా, ఆ దిశగా బీసీసీఐ ఆలోచన చేయటం లేదు. స్వేచ్ఛాయుత ప్రపంచం దిశగా వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో, భారత్ తిరోగమనంలో పయనించటం బాధాకరం. భారత్లో మళ్లీ సంకుచిత ఆలోచనలు, వివక్ష పోకడలు శృతి మించుతున్నాయి. ఇటువంటి సమయంలో వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పటం క్రికెటర్ల బాధ్యత. కానీ బీసీసీఐలో పాగా వేసిన రాజకీయ శక్తులు ఆ దిశగా అడుగు పడకుండా అడ్డుపడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.