Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసహనం
సిడ్నీ : రోహిత్ శర్మ గాయం, ఆస్ట్రేలియాతో టెస్టులకు అందుబాటుపై కొనసాగుతున్న అస్పష్టత, అనిశ్చితి వాతావరణంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. ' సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు మాకు ఓ ఈమెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయం కారణంగా రోహిత్ శర్మ ఆసీస్ టూర్కు అందుబాటులో లేడని దాని సారాంశం. గాయం దారితీయనున్న పరిస్థితులపై రోహిత్ శర్మకు అవగాహన కల్పించామని, అందుకు అతడు అంగీకారం తెలిపాడని ఈమెయిల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడాడు. దీంతో ఆస్ట్రేలియాకు అతడు వస్తున్నాడనే మేము అనుకున్నాం. రోహిత్ శర్మ అందరితో పాటు ఆస్ట్రేలియాకు ఎందుకు ప్రయాణం చేయలేదనే సమాచారం మాకు లేదు. ఈ అంశంపై మాకు ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రోహిత్ శర్మ కోసం ఎదురుచూపుల ఆట ఆడుతున్నాం. మళ్లీ మాకు అందిన సమాచారం రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడి ఫిట్నెస్ను పరీక్షించారు, డిసెంబర్ 11న మరోసారి పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. గందరగోళ వాతావరణం, అస్పష్టత మంచిది కాదు' అని విరాట్ కోహ్లి తెలిపాడు.