Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్తో భారత్ రెండో వన్డే నేడు
- ఇప్పుడు ఓడితే సిరీస్ ఆశలు గల్లంతే
- సిరీస్ విజయంపై కంగారూ సేన కన్ను
- ఉ.9.10 నుంచి సోనీసిక్స్లో
మూడు మ్యాచుల సిరీస్లో ఉండే ఉత్కంఠ అదే. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడితే సిరీస్ ఆశలు గల్లంతు చేసుకునే దుస్థితిలో ఓ జట్టు నిలిస్తే.. వరుసగా రెండో విజయంతో సిరీస్పై దీమా సాధించే జట్టు మరోకటి. గత పర్యటనలో సిడ్నీకి వెనుకంజలో వచ్చినా.. విజయంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కోహ్లిసేన, నేడు సిరీస్పై ఆశలు నిలుపుకునేందుకు అమీతుమీ తేల్చుకోనుంది. అచ్చొచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో మరో విజయంతో కాన్బెర్రాకు చేరుకునే ముందే సిరీస్ విజయం సొంతం చేసుకోవాలని ఆతిథ్య కంగారూలు భావిస్తున్నారు. సిరీస్ వేటను నిర్ణయాత్మక పోరుకు తీసుకెళ్లాలని కోహ్లిసేన తహతహ లాడుతుండగా.. నేడు సిడ్నీలో రెండో వన్డే సమరం.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
రెండో వన్డేలోనే సిరీస్ ఫలితం ప్రభావితం కానున్న తరుణంలో.. నేడు సిడ్నీ క్రికెట్ స్టేడియంలో ఉత్కంఠ సమరానికి తెర లేవనుంది. సిడ్నీలో ఆడిన మ్యాచుల్లో రెండు సార్లే విజయం సాధించినా, కెప్టెన్ విరాట్ కోహ్లికి అక్కడ చెత్త రికార్డున్నా.. నేడు విజయం సాధిస్తేనే టీమ్ ఇండియా సిరీస్ రేసులో నిలువనుంది. లేదంటే కాన్బెర్రాలో కంగారూలు క్లీన్స్వీప్ కోసం ఆడనున్నారు. ఆ పరిస్థితి రానీయకుండా చూసుకునేందుకు కోహ్లిసేన నేడు బరిలోకి దిగుతోంది. పొట్టి ఫార్మాట్ జోరు నుంచి 50 ఓవర్ల ఆటకు అలవడేందుకు నేటి మ్యాచ్ కోహ్లిసేనకు సరిపోతుందని భావించవచ్చు. అలా కానీ పక్షంలో, సిరీస్ ఫలితం ఎలా ఉంటుందో టీమ్ ఇండియాకు బాగా తెలుసు. తొలి వన్డే విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియా నేడు సిరీస్ విజయంపై కన్నేసింది. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే నేడు సిడ్నీలో ఆరంభం కానుంది.
విరాట్ మెరిసేనా? : విరాట్ కోహ్లి ఫామ్ భారత్కు ఆందోళనకరంగా మారింది. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లి.. సిడ్నీలో మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచుల్లో అతడి అత్యధిక స్కోరు 21 మాత్రమే. తొలి వన్డేలోనూ విరాట్ అదే స్కోరు వద్ద వికెట్ కోల్పోయాడు. సిడ్నీ ఫోబియాను విరాట్ కోహ్లి అధిగమిస్తే టాప్ ఆర్డర్ నుంచి గట్టి పునాది ఆశించవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్ తక్కువ మ్యాచుల్లోనే ఆకట్టుకున్నాడు. ఓ మ్యాచ్లో వైఫల్యంతో అతడిపై వేలెత్తి చూపలేం. కానీ తొలి వన్డేలో అతడు వికెట్ కోల్పోయిన తీరు మాత్రం ఆక్షేపణీయం. జోశ్ హజిల్వుడ్ వేసిన షార్ట్ బంతిని ఆలస్యంగా ఆడిన అయ్యర్.. మూల్యం చెల్లించుకున్నాడు. షార్ట్ బంతులను అయ్యర్ ఇలాగే ఆడితే.. సిరీస్లో అతడి నుంచి పరుగులు ఆశించలేం. నేటి మ్యాచ్లో అయ్యర్ షార్ట్ బంతుల కోసం మెరుగ్గా సిద్ధమైతేనే మిడిల్లో అతడు మెరిసేది. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ తొలి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. నేడు అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశం లేకపోలేదు. లేదంటే, ఇప్పటికే ఇక్కడ పది ఓవర్లు వేసిన అనుభవం ఉన్న చాహల్ను రెండో వన్డేలోనూ కొనసాగించి ఫలితం రాబట్టవచ్చని కోహ్లి భావిస్తే చాహల్ మళ్లీ జడేజాతో కలిసి స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. పేస్ విభాగంలో నవదీప్ సైని స్థానంలో యువ యార్కర్ల సంచలనం టి.నటరాజన్ కెరీర్ తొలి వన్డేలో ఆడనున్నాడని చెప్పవచ్చు. ఓ మ్యాచ్లో విఫలమైతే.. తర్వాతి మ్యాచ్లో నిప్పులు చెరిగే రికార్డున్న జశ్ప్రీత్ బుమ్రా నేడు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను ఏ విధంగా నిలువరిస్తాడో చూడాలి.
సమస్యగా స్టార్క్! : పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పేసర్ మిచెల్ స్టార్క్ దిగ్గజం!. 500 ఓవర్లకు పైచిలుకు వేసిన పేసర్లలో అతడి గణాంకాలు అద్భుతం. అయినా, టీమ్ ఇండియాపై అతడికి మంచి రికార్డు లేదు. 12 మ్యాచుల్లో అతడి సగటు 34.70, ఎకానమీ రేటు 5.80, స్ట్రయిక్రేట్ 35.8గా ఉన్నాయి. తొలి వన్డేలో తొలి ఓవర్లోనే 20 పరుగులు ఇచ్చిన స్టార్క్.. ఏమాత్రం ఆకట్టుకోలేదు. జోశ్ హజిల్వుడ్, ఆడం జంపాలు బాధ్యత తీసుకుని భారత టాప్, మిడిల్ ఆర్డర్లను నిలువరించటంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును కాపాడుకుంది. లేదంటే ధావన్, పాండ్య జోరు ముందు శుక్రవారం భిన్నమైన ఫలితం వచ్చిఉండేది. నేడు మ్యాచ్లో మిచెల్ స్టార్క్ ఎటువంటి వ్యూహంతో వస్తాడనేది ఆసక్తికరం. బ్యాటింగ్ ఆర్డర్లో డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్లు ఫామ్లో ఉన్నారు. గాయపడిన ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ స్థానంలో మరో ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టులోకి రానున్నాడు. ఏ కోణంలో చూసినా సొంతగడ్డపై ఆసీస్ బలంగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో చూపిన ప్రదర్శననే మళ్లీ పునరావృతం చేస్తే మరో వన్డే ఉండగానే సిరీస్ ఆసీస్ పరం కావటం లాంఛనమే.
పిచ్, వాతావరణం : సహజ శైలిలోనే సిడ్నీ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. నేటి మ్యాచ్లోనూ అదే సీన్ రిపీట్ కానుంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్న సిడ్నీ వేసవిలో తొలుత బ్యాటింగ్ చేయనున్న జట్టు అనుకూలతలు పొందనుంది. ఇక్కడ ఛేదనలో విజయ శాతం అత్యంత స్వల్పం. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, కామరెనూ గ్రీన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అడం జంపా, జోశ్ హజిల్వుడ్.
భారత్ : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, టి. నటరాజన్, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రా.