Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పస లేని పేస్, స్పిన్ దాడి
- ఆసీస్కు సవాల్ విసరలేని దుస్థితి
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దళంలో టీమ్ ఇండియా ముందు వరుసలో కొనసాగుతోంది. రెండు కొత్త బంతులతో వికెట్కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సత్తా ఉన్న పేసర్లు భారత్ సొంతం. మిడిల్ ఓవర్లలో మ్యాజికల్ స్పెల్స్తో మ్యాచ్పై నియంత్రణ సాధించగల స్పిన్నర్లు టీమ్ ఇండియాలో ఉన్నారు. అయినా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచుల్లో బారత బౌలర్లు తేలిపోయారు. నిజానికి, సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ విధ్వంసానికి టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం నుంచి సమాధానమే లేదు. ఇటీవల కాలంలో భారత బౌలర్లు ఇంత పేలవంగా తేలిపోవటం ఇక్కడే చూశాం. ఐపీఎల్ ఫామ్ నుంచి వన్డే సిరీస్లో ఆడుతున్న భారత బౌలర్లకు ఏమైంది? ఎందుకు ప్రభారహితంగా మారిపోయారు?!.
నవతెలంగాణ క్రీడావిభాగం
374/6, 389/4.. సిడ్నీ వన్డే మ్యాచ్లో భారత బౌలర్లపై ఆస్ట్రేలియా సాధించిన భారీ స్కోర్లు. సహజంగానే సిడ్నీ బ్యాటింగ్కు స్వర్గధామం. పరుగుల వరద పారే పిచ్పై 320-330 పరుగులను అంచనా వేయవచ్చు. జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్లతో కూడిన బౌలింగ్ లైనప్తో ఆ స్కోరును 300కు సైతం కుదించవచ్చు. కానీ సిడ్నీలో అది సాధ్యం కాలేదు సరికదా, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగారు. అనుభవం లేని అండర్-19 బౌలర్లను ఎదుర్కొనట్టు అలవకోగా బుమ్రా దళంపై విరుచుకుపడ్డారు. ప్రధాన బౌలర్లు జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్లు పూర్తిగా తేలిపోయారు. వరుసగా రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు సమర్పించుకుని, ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయింది. ఐపీఎల్ ఫామ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన భారత బౌలర్లకు అసలు ఏమైంది?! లోపం ఎక్కడుంది?!.
స్వింగ్ స్టర్ లోటు తెలుస్తోందా?! :
2019 వన్డే వరల్డ్కప్లో భారత్ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచీ భారత బౌలర్ల ప్రదర్శన ఏమంత బాగాలేదు. ప్రత్యేకించి పవర్ ప్లేలో భారత పేసర్లకు కోరలు లేకుండా పోయాయి. 2020లో భారత్ ఎనిమిది వన్డేలు ఆడింది. ఈ మ్యాచుల్లో కోహ్లిసేన పవర్ ప్లేలో కేవలం మూడు వికెట్లు పడగొట్టింది. 2019 ఆరంభంలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్లు మాత్రమే భారత్ కంటే దారుణమైన బౌలింగ్ సగటు కలిగి ఉన్నాయి. తొలి పది ఓవర్లలో భారత్ సగటు 51.52. 36 మ్యాచుల్లో భారత్ 15 మ్యాచుల్లో పది ఓవర్లలో వికెట్ తీసుకోలేదు. వాటిలో 19 మ్యాచుల్లో భువనేశ్వర్ కుమార్ ఆడాడు. అతడు ఆడిన మ్యాచుల్లో పవర్ ప్లే సగటు 33.73కి మెరుగైంది. భువనేశ్వర్ కుమార్ లేని 17 మ్యాచుల్లో భారత్ పవర్ ప్లేలో ఎనిమిది వికెట్లు తీసుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ భువనేశ్వర్ కుమార్ ఆడటం లేదు. 2019 చాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమ్ ఇండియా అత్యుత్తమ వన్డే జట్టుగా అవతరించింది. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్లు మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ జోడీ 27 మ్యాచుల్లో బరిలోకి దిగగా.. భారత్ 20 మ్యాచుల్లో విజయాలు సాధించింది.
ఆరో బౌలర్ సేవలు ఏవీ? : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తరహాలో భారత జట్టులో బహుముఖ ప్రజ్ఞాశాలురైన క్రికెటర్లు లేరు. భారత జట్టులో ప్రత్యేక బ్యాట్స్మెన్లు, ప్రత్యేక బౌలర్లు మాత్రమే ఉన్నారు. హార్దిక్ పాండ్య రూపంలో పేస్ ఆల్రౌండర్ ఉన్నాడు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. బంతితో, బ్యాట్తో మెరిసిన సందర్భాలు అతి తక్కువ. మిడిల్ ఓవర్లలో అదనపు బౌలింగ్ వనరు అందుబాటులో ఉండటం కీలకం. వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్య.. రెండో వన్డేలో బంతి అందుకున్నాడు. ప్రధాన బౌలర్లు విఫలమైన వేళ పాండ్య బౌలింగ్ సేవలు పెద్దగా ఉపయోగపడలేదు. మహ్మద్ షమి 1/73, బుమ్రా 1/79, సైని 0/70, చాహల్ 0/71తో రెండో వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. తొలి వన్డేలో మహ్మద్ షమి 3/59 రాణించగా.. బుమ్రా 1/73, నవదీప్ సైని 1/83, చాహల్ 1/89లు తేలిపోయారు.
కెప్టెన్సీ వైఫల్యం సైతం :
సాధారణ జట్టుతోనూ అసామాన్య ఫలితాలు రాబట్టగలవాడే ఉత్తమ నాయకుడు. ఉత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. చెత్త ప్రదర్శనలు చేయటంతో ఆ వైఫల్య బాధ్యత నాయకుడు తీసుకోవాలి. ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్లు జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలను రెండు వైపులా ఎదుర్కొంటున్నారు. పవర్ ప్లేలో ఈ ఇద్దరికి వికెట్ దక్కని సమయంలో నవదీప్ సైనికి బంతిని అందించాడు విరాట్ కోహ్లి. ఫలితంగా, అప్పటివరకు నియంత్రణలో ఉన్న రన్రేట్ కాస్త పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. బుమ్రా, షమిలకు వికెట్ లభించన వేళ.. పవర్ ప్లేలో స్పిన్ను ప్రయత్నించటం ప్రత్యామ్నాయ ఆలోచన. పేస్లో సమర్థులకు వికెట్ దక్కని చోట, సైనికి వికెట్ వేటలో బంతిని ఇవ్వటం కోహ్లి నాయకత్వ వ్యూహ వైఫల్యానికి నిదర్శనమే. తొలి వన్డేలో నిరాశపరిచిన సైని స్థానంలో నటరాజన్, షార్దుల్ ఠాకూర్ను ఆడించకుండా, రెండో వన్డేలోనూ సైనిని కొనసాగించాడు. సిడ్నీ పిచ్లో సరైన లెంగ్త్లో బంతులు వేయటంలో, నిలకడగా ఆసీస్ బ్యాట్స్మెన్కు పరీక్ష పెట్టడంలో బుమ్రా దళం విఫలమైంది. సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే బుధవారం కాన్బెర్రాలో జరుగనుంది. వేదిక మారటంతో భారత బౌలర్ల ప్రదర్శన సైతం మారుతుందా? లేక మూడో వన్డేలో మరింత భారీ స్కోరు సమర్పించుకుంటారా? చూడాలి.