Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్ క్రికెట్ లో కరోనా కలకలం
క్రైస్ట్చర్చ్ (న్యూజిలాండ్) : పాకిస్థాన్ క్రికెట్ శిబిరంలో కోవిడ్19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రెండో రౌండ్ కోవిడ్19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో మరో ముగ్గురు క్రికెటర్లు కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు. మరో ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్లో పది మంది ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ' క్వారంటైన్లో ఆరో రోజు పరీక్షల కోసం 46 మంది పాకిస్థాన్ క్రికెట్ బృందం నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. 42 మందికి నెగెటివ్ రాగా, ముగ్గురికి పాజిటివ్ తేలింది. ఒకరి పరీక్ష ఫలితం పెండింగ్లో ఉంది. ఈ ముగ్గురికి గతంలోనే కోవిడ్ సోకిందా? ఇక్కడ వైరస్ బారిన పడ్డారా? అనే విషయంపై ఆరోగ్య అధికారులు విచారిస్తున్నారు' అని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 18న న్యూజిలాండ్, పాకిస్థాన్ తొలి టీ20 ఆరంభం కావాల్సి ఉంది. డిసెంబర్ 10 నుంచే పాకిస్థాన్ వార్మప్ మ్యాచులు మొదలవ్వాలి. క్వారంటైన్లోనే ప్రాక్టీస్కు తొలుత అనుమతులు లభించినా, కోవిడ్ 19 పాజిటివ్ కేసులతో న్యూజిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్థాన్ క్రికెట్ బృందాన్ని పూర్తిగా క్వారంటైన్కే పరిమితం చేసింది. పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్తో వైరస్ వ్యాప్తి ముప్పు లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే.. ఆ జట్టు వార్మప్ కోసం మైదానంలోకి అడుగుపెట్టనుంది.
వీసాలపై హమీ ఇవ్వాలి : 2021 టీ20 ప్రపంచకప్లో ప్రాతినిథ్యం వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలు మంజూరు చేసేందుకు భారత్, ఐసీసీ నుంచి లిఖిత పూర్వక హామీ రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీం ఖాన్ పేర్కొన్నాడు. ' 2021 టీ20 ప్రపంచకప్పై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్లో కరోనా మహమ్మారి దృష్ట్యా వరల్డ్కప్ను యుఏఈకి మార్చవచ్చు. భారత్లోనే నిర్వహించాల్సి వచ్చినప్పుడు, పాకిస్థాన్ జట్టుకు వీసాలు మంజూరుపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్తో ద్వైపాక్షిక సిరీస్లపై ఎటువంటి ఆశాభావం లేదు. అందుకే రానున్న ఐసీసీ క్యాలెండర్లో పాకిస్థాన్ ఓ ఐసీసీ ఈవెంట్ ఆతిథ్యం కోసం పోటీపడనుంది' అని వసీం ఖాన్ తెలిపాడు.