Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ గాయంపై గౌతం గంభీర్
న్యూఢిల్లీ : రోహిత్ శర్మ గాయంపై రచ్చ కొనసాగు తూనే ఉంది. ఎడమ కాలి తొడ కండరం గాయంతోనే ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఆడిన రోహిత్ శర్మను తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. బీసీసీఐ వైద్య బృందం పరిశీలన అనంతరం టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు. టెస్టు జట్టులో మాత్రమే భాగమైన పుజారా, రహానె, సాహాలు దుబారు నుంచి నేరుగా సిడ్నీకి పయనమైనా.. రోహిత్ శర్మ మాత్రం ముంబయికి వచ్చాడు. రోహిత్ శర్మ గాయం, ఫిట్నెస్ పురోగతి, ఎప్పుడు జట్టుతో చేరతాడనే అంశాల్లో తనకు ఏమాత్రం సమాచారం లేదని వన్డే సిరీస్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లి మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. జట్టులో సమాచార స్పష్టత లేకపోవటం గౌతం గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి కెప్టెన్ విరాట్ కోహ్లికి రోహిత్ శర్మ సమాచారం పంచుకోవాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'ఇది దురదృష్టకరం. ఎందుకంటే విరాట్ కోహ్లి కెప్టెన్. రోహిత్ గాయంపై ఎటువంటి సమాచారం లేదని మీడియాకు చెప్పాడు. ఈ అంశంలో ఫిజియో, చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్లు ముఖ్యమైన వ్యక్తులు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి గాయం గురించి విరాట్ కోహ్లికి అప్డేట్ ఇవ్వాల్సింది. జట్టులో సీనియర్ క్రికెటర్ల మధ్య సమాచారం లేకపోవటం, ఎక్కడో ఏదో సమన్వయం దెబ్బతింటోంది' అని గంభీర్ అన్నాడు. ' తొలుత రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాల్సింది. కమ్యూనికేషన్ లేకపోవటం నిరాశపరిచే అంశం. ఇప్పుడు ఎన్నో వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీకి సైతం ఓ వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటాను. అన్ని విషయాలను అక్కడ పంచుకుంటారు. ఇద్దరు సీనియర్ క్రికెటర్ల మధ్య సమాచార సమన్వయం లేకపోవటం బాధాకరం' అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.