Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్దిక్ పాండ్య, జడేజా అర్థ సెంచరీలు
- రాణించిన నటరాజన్, బుమ్రా, ఠాకూర్
- ఛేదనలో ఆస్ట్రేలియా 289 ఆలౌట్
- 2-1తో వన్డే సిరీస్ కంగారూల వశం
ఎట్టకేలకు ఓ విజయం వరించింది. వన్డేల్లో వరుస ఐదు పరాజయాలకు టీమ్ ఇండియా బ్రేక్ వేసింది. భారీ స్కోర్ల మనుకా ఓవల్లో 302 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకుంది. 152/5తో కష్టాల్లో ఉన్న భారత్ను హార్దిక్ పాండ్య (92 నాటౌట్), రవీంద్ర జడేజా (66 నాటౌట్)లు స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్లతో 302/5కు చేర్చారు. అరంగ్రేట సీమర్ నటరాజన్, బుమ్రా, షార్దుల్ ఠాకూర్ రాణించటంతో ఆస్ట్రేలియా ఛేదనలో 289 పరుగులకే కుప్పకూలింది. 13 పరుగులతో విజయం సాధించిన కోహ్లిసేన వన్డే సిరీస్లో వైట్వాష్ ప్రమాదం నుంచి బయటపడింది. కాన్బెర్రాలో ఓటమి చెందినా, 2-1తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
కాన్బెర్రా (ఆస్ట్రేలియా)
భారత్కు ఊరట లభించింది. నామమాత్రపు మూడో వన్డేలో కోహ్లిసేన 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' హార్దిక్ పాండ్య (92 నాటౌట్, 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (66 నాటౌట్, 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఆరో వికెట్కు 150 పరుగుల భారీ భాగస్వామ్యంతో కదం తొక్కటంతో తొలుత భారత్ 302/5 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియాను భారత పేసర్లను అడ్డుకున్నారు. 289 పరుగులకే ఆలౌట్ చేశారు. నటరాజన్, బుమ్రా, షార్దుల్ ఠాకూర్లు ఏడు వికెట్లు పడగొట్టి ప్రతాపం చూపించారు. అరోన్ ఫించ్ (75, 82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు), గ్లెన్ మాక్స్వెల్ (59, 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా ఆసీస్కు పరాజయం తప్పలేదు. 2-1తో వన్డే సిరీస్ ఆసీస్ వశం కాగా.. రెండు మెరుపు సెంచరీలు సాధించిన స్టీవ్ స్మిత్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
పేసర్ల ప్రతాపం : సిడ్నీలో ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయలేకపోయిన బౌలర్లు.. కాన్బెర్రాలను కంగారూల దూకుడుకు కళ్లెం వేశారు. సిరీస్లో ఆ జట్టును తొలిసారి 300 పరుగుల మార్క్ దాటకుండా చేశారు. 303 పరుగుల ఛేదనలో ఆ జట్టును పవర్ ప్లేలోనే దెబ్బకొట్టిన భారత్.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. అరంగ్రేట పేసర్ నటరాజన్, బుమ్రా, షార్దుల్ ఠాకూర్లు ఆసీస్ పతనాన్ని శాసించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫామ్లో ఉన్న మార్నస్ లబుషేన్ (7)ను నటరాజన్ అవుట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. భీకర ఫామ్లో ఉన్న స్టీవ్ స్మిత్ (7)ను షార్దుల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. స్లిప్స్లో ధావన్ క్యాచ్ నేలపాలు చేయటంతో ఓపెనర్ అరోన్ ఫించ్ (75, 82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్థ సెంచరీతో ఆసీస్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మోయిసిస్ హెన్రిక్స్ (22), కామెరూన్ గ్రీన్ (21)లు సైతం అవుట్ కావటంతో ఆసీస్ 158/5తో కష్టాల్లో పడింది. కానీ గ్లెన్ మాక్స్వెల్ (59, 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), అలెక్స్ కేరీ (38, 42 బంతుల్లో 4 ఫోర్లు), అష్టన్ ఆగర్ (28, 28 బంతుల్లో 2 ఫోర్లు) భారత్ను భయపెట్టారు. కండ్లుచెదిరే యార్కర్తో మాక్స్వెల్ కథకు బుమ్రా ముగింపు పలకగా.. ఆగర్ను నటరాజన్ పెవిలియన్కు చేర్చాడు. అలెక్స్ రనౌట్ కావటంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగింది. 49.3 ఓవర్లలోనే ఆసీస్ను ఆలౌట్ చేసింది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదు చేసిన ఆస్ట్రేలియా.. మానుకా ఓవల్లో 289 పరుగులకే పరిమితం అయ్యింది.
పాండ్య, జడేజా జోరు : భారీ స్కోర్ల సిడ్నీలో టాస్ ఓడి, మ్యాచ్పై సగం ఆశలు కోల్పోయిన భారత్.. కాన్బెర్రాలో కీలక టాస్ను సొంతం చేసుకుంది. అయినా, టాప్ ఆర్డర్ నుంచి ఆశించిన ఆరంభం దక్కలేదు. 152/5తో టీమ్ ఇండియా స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్య (92 నాటౌట్, 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (66 నాటౌట్, 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఆరో వికెట్కే అజేయంగా 150 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి మెరుపులతో భారత్ 302 పరుగుల స్కోరు చేయగల్గింది. అయినా, ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు అది కనీసం 40 పరుగులు తక్కువే. ఆఖరు ఓవర్లలో పేసర్లపై విరుచుకుపడిన జడేజా, పాండ్య బౌండరీల రూపంలో వేగంగా పరుగులు పిండుకున్నారు. 4 ఫోర్లతో 55 బంతుల్లో పాండ్య అర్థ సెంచరీ సాధించగా.. రవీంద్ర జడేజా నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 బంతుల్లోనే అర్థ శతకం అందుకున్నాడు. అర్థ సెంచరీల తర్వాత వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడారు. పాండ్య, జడేజా భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పింది. అంతక ముందు టాప్ ఆర్డర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (63, 78 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించాడు. 64 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి.. ఓపెనర్ శుభ్మన్ గిల్ (33) కాస్త సహకారం లభించింది. శిఖర్ ధావన్ (16) నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ (19), కెఎల్ రాహుల్ (5)లు మరోసారి అంచనాలను అందుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఆగర్ (2/44) రాణించాడు. హజిల్వుడ్, అబాట్, జంపాలకు తలా ఓ వికెట్ దక్కింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) ఆగర్ (బి) అబాట్ 16, శుభ్మన్ గిల్ (ఎల్బీ) ఆగర్ 33, విరాట్ కోహ్లి (సి) కేరీ (బి) హజిల్వుడ్ 63, శ్రేయాస్ అయ్యర్ (సి) లబుషేన్ (బి) జంపా 19, కెఎల్ రాహుల్ (ఎల్బీ) ఆగర్ 5, హార్దిక్ పాండ్య నాటౌట్ 92, రవీంద్ర జడేజా నాటౌట్ 66, ఎక్స్ట్రాలు : 08, మొత్తం : (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302.
వికెట్ల పతనం : 1-26, 2-82, 3-114, 4-123, 5-152.
బౌలింగ్ : హజిల్వుడ్ 10-1-66-1, గ్లెన్ మాక్స్వెల్ 5-0-27-0, సీన్ అబాట్ 10-0-84-1, కామెరూన్ గ్రీన్ 4-0-27-0, ఆస్టన్ ఆగర్ 10-0-44-2, ఆడం జంపా 10-0-45-1, మోయిసిస్ హెన్రిక్స్ 1-0-7-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : మార్నస్ లబుషేన్ (బి) నటరాజన్ 7, అరోన్ ఫించ్ (సి) ధావన్ (బి) జడేజా 75, స్టీవ్ స్మిత్ (సి) రాహుల్ (బి) ఠాకూర్ 7, మోయిసిస్ హెన్రిక్స్ (సి) ధావన్ (బి) ఠాకూర్ 22, కామెరూన్ గ్రీన్ (సి) జడేజా (బి) కుల్దీప్ యాదవ్ 21, అలెక్స్ కేరీ (రనౌట్) 38, గ్లెన్ మాక్స్వెల్ (బి) బుమ్రా 59, ఆస్టన్ ఆగర్ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 28, సీన్ అబాట్ (సి) రాహుల్ (బి) ఠాకూర్ 4, ఆడం జంపా (ఎల్బీ) బుమ్రా 4, జోశ్ హజిల్వుడ్ నాటౌట్ 7, ఎక్స్ట్రాలు : 17, మొత్తం : (49.3 ఓవర్లలో ఆలౌట్) 289.
వికెట్ల పతనం : 1-25, 2-56, 3-117, 4-123, 5-158, 6-210, 7-268, 8-278, 9-278, 10-289.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 9.3-0-43-2, నటరాజన్ 10-1-70-2, షార్దుల్ ఠాకూర్ 10-1-51-3, కుల్దీప్ యాదవ్ 10-0-57-1, రవీంద్ర జడేజా 10-0-62-1