Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజీఎం ఆమోదం కోరనున్న బీసీసీఐ
- ఒలింపిక్స్లో క్రికెట్పైనా చర్చ
- 24న బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో రెండు కొత్త ప్రాంఛైజీలు రానున్నాయి!. 2021 ఐపీఎల్న నుంచే పది ప్రాంఛైజీలతో లీగ్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసక్తి చూపుతోంది. రెండు కొత్త ప్రాంఛైజీల ఏర్పాటుకు బీసీసీఐ తొలుత వార్షిక సర్వ సభ్య సమావేశం ఆమోదం తీసుకోనుంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చటంపైనా బీసీసీఐ చర్చ జరుపనుంది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 24న బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఐపీఎల్ 2020 ముగిసిన నాటి నుంచే ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీలపై వార్తలొచ్చాయి. రెండు ప్రాంఛైజీలు కాకపోయినా, కనీసం ఒక్క కొత్త ప్రాంఛైజీని అయినా కొత్త సీజన్కు జోడించాలని బీసీసీఐ భావిస్తోంది. 2008లో ఎనిమిది జట్లతో మొదలైన ఐపీఎల్.. అదే ఫార్మాట్లో కొనసాగుతోంది.
రెండు గ్రూపులుగా..? : 2011లో కోచి టస్కర్స్, పుణె వారియర్స్ చేరికతో ఐపీఎల్లో తొలిసారి పది జట్లు పోటీపడ్డాయి. ఆ సీజన్లో గ్రూపు దశ మ్యాచులే 94కు చేరటంతో లీగ్ సుదీర్ఘంగా సాగింది. పది జట్ల ఐపీఎల్ ఖాయమైతే.. పది జట్లను ఐదేసి జట్లుగా రెండు గ్రూపులుగా విభిజిస్తారు. ప్రతి జట్టు తన గ్రూపులోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది. ఇతర గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్లో ఆడుతుంది. ఐదో జట్టుతో రెండు మ్యాచులు ఆడనుంది. దీంతో లీగ్ దశలో ప్రతి జట్టు ఆడే మ్యాచులు 14గానే ఉండనున్నాయి. 2013లో తొమ్మిది జట్లు ఆడిన సీజన్లో లీగ్ దశలో 76 మ్యాచులు జరిగాయి. ఇక ఒలింపిక్స్లో క్రికెట్ చేరితే.. బీసీసీఐ విధాన పరమైన నిర్ణయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నాడాతో బీసీసీఐ సహకరిస్తున్నా.. ఒలింపిక్స్లో క్రికెట్ ఉంటే, కచ్చితంగా వాడా నిబంధనలకు లోబడి పనిచేయాలి. ఈ విషయాలను వార్షిక సర్వ సభ్య సమావేశంలో చర్చించి బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుంది.