Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ డాక్టర్ల క్రికెట్ లీగ్
హైదరాబాద్: కరోనా వైరస్ను అరికట్టడంలో ముందుండి పోరాడుతున్న ప్రభుత్వ డాక్టర్ల కోసం ఏర్పాటు చేసిన టీ10 క్రికెట్ లీగ్ జోరుగా సాగుతున్నది. ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న క్రికెట్ లీగ్లో డాక్టర్లు ప్రొఫెషనల్ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. గెలుపు కోసం కడదాకా ప్రయత్నిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న టోర్నీలో రిమ్స్ ఆదిలాబాద్, ప్రభుత్వ డెంటల్ కాలేజీ(హైదరాబాద్), నిమ్స్, ఉస్మానియా-ఎ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ-బి జట్టుతో జరిగిన మ్యాచ్లో రిమ్స్ ఆదిలాబాద్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రిమ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. ఆ తర్వాత ఉస్మానియా 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 70 పరుగులకే పరిమితమైంది. మిగతా మ్యాచ్ల్లో జీఎమ్సీ మహబూబ్నగర్ జట్టుపై నిమ్స్ జట్టు 17 పరుగులతో, గాంధీ మెడికల్ కాలేజీపై ప్రభుత్వ డెంటల్ కాలేజీ(హైదరాబాద్) 7 పరుగులతో, జీఎమ్సీ సూర్యపేటపై ఉస్మానియా మెడికల్ కాలేజీ-ఎ జట్టు 31పరుగుల తేడాతో విజయాలు సాధించాయి. ఆదివారం జరిగే సెమీఫైనల్లో ప్రభుత్వ డెంటల్ కాలేజీ, రిమ్స్తో, నిమ్స్, ఉస్మానియా-ఎ జట్లు తలపడుతాయి. అంతకముందు రెండో రోజు పోటీలను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో త్వరలో రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురాబోత్నునట్లు మంత్రి చెప్పారు. కరోనా వైరస్పై పోరాడటంలో ప్రభుత్వ వైద్యులు కీలక పాత్ర పోషించారని, వారి శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి లీగ్ నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం మంత్రికి ఎవోలెట్ మోటార్స్ చైర్మన్ డాక్టర్ విద్యాసాగర్ స్కూటీని బహుకరించారు.