Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్19 ఫలితంతో ఊరట ొసిడ్నీకి చేరుకున్న ఇరు జట్లు
భారత, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్గా రావటంతో.. కంగారూ పర్యటనలో తక్షణ ఊరటగా పాజిటివ్ వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ పార్టీలో ఓ ఔత్సాహిక అభిమానిని రిషబ్ పంత్ ఆలింగం చేసుకున్నాడనే నిరాధారణ వార్తలతో ఐదుగురు భారత క్రికెటర్లను సీఏ ఐసోలేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా సహాయక సిబ్బంది సైతం కోవిడ్19 పరీక్షలో నెగెటివ్గా రావటంతో.. సోమవారం ఇరు జట్లు మూడో టెస్టు వేదిక సిడ్నీకి చేరుకున్నాయి.
నవతెలంగాణ-సిడ్నీ
భారత్, ఆస్ట్రేలియా సిరీస్లో వాతావరణం కాస్త చల్లబడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మెల్బోర్న్ టెస్టు అనంతరం న్యూ ఇయర్ పార్టీలో ఐదుగురు క్రికెటర్లు బయట హౌటల్లో డిన్నర్కు వెళ్లడం రెండు రోజులుగా క్రికెట్ వర్గాల్లో కలవరపాటుకు కారణమైంది. బయో సెక్యూర్ బబుల్ను దాటి క్రికెటర్లు తరచుగా బయటకు వెళ్లటమే కాదు, అభిమానులతో సన్నిహితంగా మెలగడాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణించింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైని, పృథ్వీ షాలను సీఏ ఐసోలేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. బయో సెక్యూర్ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడి, సిరీస్ను డోలాయమానంలో పడేసిన క్రికెటర్లు సహా ఇతర ఆటగాళ్లు తాజా కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్గా బయటపడ్డారు. ఐసోలేషన్లో ఉంచిన క్రికెటర్లలో ఎవరికీ పాజిటివ్ తేలినా.. బోర్డర్-గవాస్కర్ సిరీస్ భవిష్యత్ కచ్చితంగా పూర్తి భిన్నంగా ఉండేది.
జట్టుతో పాటే ఆ ఐదుగురు : బాక్సింగ్ డే టెస్టులో విజయంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండో టెస్టు సిరీస్ విజయం వేటలో టీమ్ ఇండియా ఫేవరేట్గా నిలిచింది. భారత్కు అన్ని విధాలుగా అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో.. ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్లో ఉంచటం డ్రెస్సింగ్రూమ్లో అనిశ్చితికి కారణమైంది. న్యూ ఇయర్ టెస్టు సిడ్నీలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సహా రిషబ్ పంత్లు కీలకం కానున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు ఐసోలేషన్, కోవిడ్19 నిబంధనల పేరిట సిడ్నీకి దూరమైతే.. అది రహానె సేనకు కోలుకోలేని దెబ్బగా మారేది. ఐసోలేషన్లో ఉంచినా, ఐదుగురు క్రికెటర్లు భారత జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీకి భారత, ఆస్ట్రేలియా క్రికెటర్లు సోమవారం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ప్రయాణించిన భారత జట్టులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవదీప్ సైని, పృథ్వీ షాలు ఉన్నారు. న్యూ ఇయర్ టెస్టుకు మరో రెండు రోజుల సమయమే ఉండటంతో మరోసారి కోవిడ్19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించి.. తుది జట్టు కూర్పుపై భారత్ కసరత్తు చేయనుంది.
ఇదిలా ఉండగా, బయో సెక్యూర్ బబుల్ ప్రోటోకాల్స్ అతిక్రమించిన భారత క్రికెటర్లు తిరిగి క్వీన్స్లాండ్లో అడుగుపెట్టేందుకు కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుం దనే సంకేతాలతో బ్రిస్బేన్ టెస్టుపై నీలినీ డలు కమ్ముకున్నాయి. జనవరి 15న బ్రిస్బేన్లో నాల్గో టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. న్యూ సౌత్ వేల్స్ బీచ్ ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో గ్రేటర్ సిడ్నీతో క్వీన్స్లాండ్ ప్రభుత్వం రాకపోకలు తెంచుకుంది. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లను అనుమతిస్తామని హామీ ఇచ్చినా.. తాజా పరిస్థితుల్లో కఠిన లాక్డౌన్ నిబంధనలు ఉంటాయనే సూచనలు ఉన్నాయి. ఐపీఎల్ ఆరంభానికి నెల రోజుల ముందు నుంచి క్వారంటైన్, లాక్డౌన్ నిబంధనలతో సహ జీవనం చేస్తున్న భారత క్రికెటర్లు మళ్లీ బ్రిస్బేన్లో కఠిన క్వారంటైన్లో ఉండేందుకు భారత శిబిరం ఏమాత్రం సుముఖంగా లేదు. అదే జరిగితే, బ్రిస్బేన్ టెస్టును బహిష్కరించేందుకు సైతం వెనుకాడబోమనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.
అటువంటిదేమీ లేదు! : ఐదుగురు భారత క్రికెటర్లను ఐసోలేషన్లో ఉంచటం, నాల్గో టెస్టు వేదిక బ్రిస్బేన్కు ముందు భారత క్రికెటర్లకు కఠిన లాక్డౌన్, క్వారంటైన్ నిబంధనలు వర్తింపజేస్తారనే వార్తలతో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జనవరి 15 నుంచి గబ్బాలో ఆరంభం కావాల్సిన నాల్గో టెస్టును భారత జట్టు బహిష్కరిస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. సజావుగా సాగుతున్న సిరీస్లో, ఔత్సాహిక అభిమాని సోషల్ మీడియా ట్వీట్ వాతావరణాన్ని వేడెక్కించింది. బ్రిస్బేన్ టెస్టు బహిష్కరణపై భారత క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సూచనలు లేవని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ అన్నారు. ' క్వీన్స్లాండ్ రాష్ట్ర క్వారంటైన్ నిబంధనలకు భారత క్రికెట్ బోర్డు పూర్తి మద్దతు ఉంది. బీసీసీఐ ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. బీసీసీఐ నుంచి సానుకూల స్పందన మినహా మాకు ఎటువంటి ఇతర సంకేతాలు లేవు. భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఆడాలని అనుకుంటున్నాయి. న్యూ సౌత్ వేల్స్లో ప్రజారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య అధికారులతో మాట్లాడుతున్నాం. ఆటగాళ్లు, సిబ్బంది, మ్యాచ్ అధికారులు, ప్రసారదారులు, అభిమానుల భద్రతకు తీసుకోవాల్సిన బయో సెక్యూరిటీ ప్రమాణాల గురించి చర్చిస్తున్నాం. భౌతిక దూరం నిబంధనలు పాటించేందుకు సిడ్నీ స్టేడియం రోజువారీ సామర్థ్యం కుదిస్తున్నాం' అని నిక్ హాక్లీ వెల్లడించాడు.